పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152

మహాపురుషుల జీవితములు

అంతలో స్వామి యచ్చటకు వచ్చినందున నది యావలకుఁబోవునప్పు డాయనకంటఁ బడెను. పడుటయు కలియుగ శుకయోగీంద్రుఁ డగు నా మహాత్ముఁడు దుర్ణీతిపరుఁ డగు మహారాజు దుర్వినయము సహింపక కోపము పట్టఁజాలక తూలనాడి తలవాయునటుల చీవాట్లు పెట్టెను. ఆమాటలు చాటుననుండి వేశ్యాంగనవిని తనవలపు కానికిం దనకు నెడఁబాటు చేయఁదలంచిన యాపురుషునిఁ గడతేర్ప నిశ్చయించెను. ఆ సాయంకాలము దయానందునకు మహారాజుగారు పాలు పంపునప్పు డా దురాత్మురాలు పాలలో కొంచెము విసము గలిపి పంపించెను. అది యెఱుఁగక స్వామి యాపాలు పుచ్చుకొన్న వెంటనే చంపునది కాదు గావున వాని నొక్కమాసము బాధ పెట్టెను. మహారాజున కీసంగతి తెలిసినతోడనే సంస్థానమునందలి వైద్యుల నందఱ రప్పించి నేయవలసిన చికిత్సల నన్నింటిని చేయించెను. ఎన్ని చేసినను రోగము మాత్రము తిరుగక యంతకంత కెక్కువయ్యెను. ఆశ లేదని తెలిసినప్పుడు స్వామి జోథ్ పూర్ విడిచి యజమీరునకుఁ బోయెను. ఎంతబాధ పడుచున్న నబ్బా యన్నమాటయైన నోట రానీయఁడయ్యె. 1883 వ సంవత్సరము సెప్టెంబరు 30 వ తారీఖున విషప్రయోగము జరిగెను. అది మొద లొకనెల తీసికొని యా మహాత్ముఁడు భరతఖండముయొక్క దురదృష్టవశమున 31 వ అక్టోబరు తారీఖున శరీరము విడిచి శాశ్వతపదవి నొందెను. చనిపోవునాఁడు ముండనము చేయించుకొని స్నానముచేసి యందఱ నావలకుఁ బొమ్మని యొంటిగ నీశ్వరు ప్రార్థించి తెలివితో ప్రాణముల వదలెను. ఈశ్వరునియందు దృఢవిశ్వాసముతోడను, నిర్విచారముగను, నిర్భయముగను బ్రాణములు విడచుచున్న యా మహాయోగియొక్క చరమావస్థఁజూచి యద్భుతపడి యదివఱకు దేవుఁడు లేఁడని వాదించు నాస్థికుఁ డొకఁడు తక్షణము యాస్థికుఁ డయ్యెనఁట. ఆర్యసమాజ