పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

116

మహాపురుషుల జీవితములు

దత్తను పేరఁ బరగుచుండెను. మైకేలనునది యతఁడు క్రైస్తవమతములోఁ గలసినప్పుడు కలిగిన నామము. అతని తండ్రి వానియిష్టము లేకుండ బలవంతముగ వివాహము చేయఁదలంపకపోయిన పక్షమున మధుసూదనదత్తు క్రైస్తవమతములోఁ గలియక తన సహాధ్యాయుల వలెనే పేరునకైన హిందువుఁడై స్వమతమునందే యుండును. కాని యతనికిఁ గలిగిన నిర్బంధమువలన నతఁడు స్వమత పరిత్యాగముచేసి కృష్ణమోహనబెనర్జీవలెనే మతాంతరుఁడు కావలసివచ్చెను. పుత్రవాత్సల్య మతిశయముగాఁగల రాజనారాయణుఁడు మతభ్రష్ఠుఁడైన యాకొమరున కెప్పటియట్ల ధనమిచ్చి భిషప్ కాలేజీలో నాలుగు సంవత్సరములు చదువు చెప్పించెను. కాని కొన్ని కారణముల వలన కొడుకునకుం దండ్రికి మనస్పర్ధలు పొడమ రాజనారాయణుఁడు కుమారుని విడిచినందున మధుసూదనుఁ డసహాయుఁడై యుండవలసివచ్చె.

ఆకాలమున చెన్నపట్టణమునుండి కొందఱు బాలకులు వచ్చి బిషప్‌కాలేజీలో విద్యార్థులై కలకత్తాలోఁ జదువుచుండిరి. ఆ విద్యార్థుల ప్రోత్సాహముచేత చెన్నపట్టణమునకుఁ బోయి కొంచెము బాగుపడవచ్చునని కలకత్తా విడిచి యా పట్టణమునకుఁ బోయెను. చెన్న పట్టణమునకు వచ్చినపిదప వానిస్థితి మునుపటికన్న హీనము కాఁగా నతఁడు దారిద్ర్యబాధ మిక్కుటముగా ననుభవించి పొట్ట పోసికొనుట కేయుపాయమును గానక ఇంగ్లీషు వార్తాపత్రికలకు వృత్తాంతములను వ్రాసి దానిచే గొంతధనమును సంపాదించి జీవయాత్ర గడుపుచుండెను. ఆ నిరుపేదతనమందును మధుసూదనుఁ డింగ్లీషుకవనము మానక యందుఁ గృషిచేయుచు 1849 వ సంవత్సరమున "చెరలోనున్నస్త్రీ" యను శీర్షికతో నొక మనోహరమైన పద్యకావ్యమును రచించెను. ఆ కావ్యమును జెన్నపురమందలి