పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధుసూదనదత్తు

115

కాలముననే యింగ్లీషుభాషలో ననేక పద్యములరచించెను. అప్పుడు హిందూకళాశాలలోఁ జదువుకొను విద్యార్థులందరిలో మదుసూదనదత్తు బుద్ధికి బృహస్పతియను పేరుపడెను. అతఁడు తరుచుగా మోహము దేశాభిమానము మొదలగు విషయములఁ గూర్చి యింగ్లీషులో పద్యములు వ్రాయఁజొచ్చెను. వానికి బాల్యము నుండియు నింగ్లాడుదేశముఁ జూడవలయునను గుతూహలము గలదు. ఆ దేశము తా నెన్నఁడు జూడగలుగుదునో యని యౌత్సుక్యము నొందుచు నింగ్లీషులో నొక చిన్నపద్యము వ్రాసెను. ఆ పద్య మెంతయు మనోహరముగా నుండును.

హిందువులలో సామాన్య బాలకులకే చిన్న తనమందనేకులు పిల్లనిచ్చి పెండ్లిచేయుచుందురు. అట్టియెడ కుశాగ్రబుద్ధియై విద్య నభ్యసించుచున్న మధుసూదనదత్తు వంటి వానికి సంబంధములు వచ్చుట యాశ్చర్యముగాదు. అందుచేత నతనితండ్రి కుమారునకు వివాహముచేయ నిశ్చయించి యొక చిన్నపిల్లను గుదిర్చి తద్విషయ ప్రయత్నములు చేయనారంభించెను. నలుగురు భార్యలం గట్టుకొని నానా యవస్థలం బడుచున్న తండ్రి తనకుఁ గూడ చిన్న తనమందే వివాహము చేయఁదలంచి నప్పుడు మధుసూదనదత్తునకు వివాహ మిష్టము లేకపోయెను. అతఁడు తన యనిష్టము సూచించియు తన మాట సాగదని తలంచి వివాహ సమయమున నిల్లువిడిచి పోయెను, పోయి క్రైస్తవ మత బోధకులగు నాంగ్లేయుల శరణు జొచ్చి యదివఱకె క్రైస్తవ మతములోఁ గలిసియున్న కృష్ణమోహన బెనర్జీ సహాయమున నాలుగు దినము లెవ్వరికిం గనఁబడకుండ దాగి యుండెను.

ఎట్ట కేలకు 1843 వ సంవత్సరమున ఫిబ్రేవరి నెలలో నతఁడు క్రైస్తవమతములో గలసి యానాఁడు మొదలు మైకేలు మధుసూదన