పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధుసూదన దత్తు

మధుసూదనదత్తు బంగాళాదేశములోని 'జస్సూరు' జిల్లాలో సగందరి యను గ్రామమున 1824 వ సంవత్సరమున జన్మించెను. వాని తండ్రియగు రాజనారాయణుఁడు సాదరుదివానీఅదాలత్‌' కోర్టులో న్యాయవాదిగా నుండెను. ఆయనకు నలుగురు భార్యలు. ఈ మధుసూదనుఁడు జ్యేష్ఠభార్య కుమారుఁడు. ప్రారంభమున నతఁ డందఱు బాలకులవలెనే మాతృభాషయగు బంగాళీని కొంతకాలము నేర్చుకొని యనంతరమున 1837 వ సంవత్సరమున హిందూకళాశాలలో జేరెను. ఆకళాశాల యా కాలమున డిరోజియోయను దొరగారి పరిపాలనముక్రింద నుండెను. ఆయన బంగాళాబాలకుల ప్రవర్తనమును జక్క జేసి విద్యాబుద్ధులు చెప్పి పనిచేయుటలో జాలపని చేసెను. ఆయనకు శిష్యులై విద్యనేర్చికొనిన బంగాళాబాలకు లనేకులు సంఘ సంస్కార ప్రియులై హిందూమతములలో నుండు దురాచారములను దొలగించుటకై పాటుపడిరి. మధుసూదనదత్తును వారిలో నొకఁడయ్యెను.

ఆ పడుచు వాండ్రందఱు సంఘదురాచారములను దొలగించి దేశమున కుపకారము జేయదలంచుటయేగాక రాజ్యాంగవిషయములయందుఁ గూడ బనిచేసి భరతఖండము నున్నతస్థితికి, దెచ్చుటకును స్వభాష నభివృద్ధి చేయుటకును సంకల్పించిరి. అంతియగాక తామభ్యసించిన శాస్త్రవిద్యలచేత తా మాంగ్లేయభాషలోగూడ కవనము చెప్పి చిత్రవచన కావ్యముల రచించి ప్రసిద్ధిగాంచగల వారమని నమ్మియుండిరి. మధుసూదనదత్తును దనమనంబున నిట్టి నమ్మకము గలవాడె. అతఁడు 1837 వ సంవత్సరము మొదలు 47 వ సంవత్సరము వఱకు హిందూకళాశాలలో విద్యార్థియైయుండి యా