పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పిమ్మట పెనుగొండగ్రామమునకు బోయితిమి. శ్రీ శివశంకరపిళ్ళె యను నొకన్యాయవాది గుత్తిలో కేశవపిళ్ళెగారి వలెనే పలుకుబడి కలిగి, కాంగ్రెసువ్యవహారములలో నచట శ్రద్ధవహించుచుండెడివారు. వారితో పరిచయముచేసికొని నెల్లూరు జేరి అక్కడ మహాసభ సమావేశపరచితిమి. ఇచ్చటి ఆంగ్లేయవిద్యాధికులకును చిత్తూరులోనివారికిని చెన్నపట్టణమునం దభిమాన మెక్కువగానుండి, చెన్నపట్టణము ఆంధ్రములో చేర దనుతలంపుతో ఆంధ్రరాష్ట్రనిర్మాణముపట్ల వైముఖ్యముండెను. కాని సామాన్యజనుల అభిప్రాయము అనుకూలముగనే యున్నదని గుర్తించితిమి. తిరుపతి, చిత్తూరుపట్టణములందు దక్షిణాదిఅరవవైష్ణవులు, ఆంగ్లేయవిద్యాధికులు సహజముగ అరవదేశాభిమానులై యుండుటవలన వారు ఆంధ్రరాష్ట్ర నిర్మాణమునకు వ్యతిరేకాభిప్రాయములు వెలిబుచ్చుచుండిరి.

2 బెజవాడ

__________

వేసవికాలము తిరిగివచ్చునప్పటికి బెజవాడలో రెండవ ఆంధ్రమహాసభ సమావేశమగునట్లు నిర్ణయించబడెను. బెజవాడలో శ్రీ పెద్దిబొట్ల వీరయ్యగారు, శ్రీఅయ్యదేవర కాళేశ్వరరావుగారు, అయ్యంకి వెంకటరమణయ్యగారు మొదలగు దేశాభిమానులు ఆంధ్రమహాసభను బాపట్లలోకంటె నెక్కువ వైభవముతో జరుపవలెనని కొన్నివేలరూపాయలు చందాలు వసూలుపరచి, పెద్ద పాక యొకటి సభాస్థానముగను, మరికొన్ని యితరపాకలు ప్రతినిధులనిమిత్తమును, వంటలు, భోజనముల నిమిత్తము మరికొన్ని పర్ణశాలలు నేర్పరచిరి. కాని తలవని