పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మతప్రచారము సన్నగిలిపోయెను. అంతట ఆస్కూలుభవనమును బంగళాను, దానిచుట్టునున్న స్థలమును బేరముపెట్టిరి. దూరమున ఊరివెలుపల నుండుటచేతను స్మశానభూమిసమీపమున నుండుటచేతను ఆభవనములపై నెవ్వరికిని వ్యామోహము కలుగలేదు. లక్ష్మీనారాయణగారు నావద్దకు వచ్చి ఆభవనములు స్వల్పధరకు లభించునని తెలిపిరి. అంతకుమునుపే పునహాపట్టణములో కార్వేపండితులు స్థాపించిన ట్లొక మహిళావిద్యాలయము స్థాపనచేయవలె నను ఆశయము నాహృదయమున నుండెను. ఈభవనము లందుకు ఉపయోగించు నని ఎంచితిని. తుదకు నాలుగువేలరూపాయలకు విక్రయించుటకు మిషనరీలు సమ్మతించిరి. నేను గుంటూరుబ్యాంకులో అప్పుతీసికొని వారికి చెల్లించి, క్రయదస్తావేజు రిజిష్టరుచేయించుకొంటిని. ఆభవనములు మొదలగు వానిని చూచుచుండుటకు లక్ష్మీనారాయణగారినే విచారణకర్తగా నేర్పరచి, ఆతోటలో చెట్లకు నీళ్ళుపోసి పెంచుట కొక తోటమాలిని నియమించితిని.

పిమ్మట లక్ష్మీనారాయణగారిని వెంటబెట్టుకొని పునహా పట్టణములో మహిళావిద్యాలయమును దర్శించి, కార్వేపండితులతో ముచ్చటించి, విద్యాలయము నదుపుటనుగూర్చి వారి సలహా పొందితిని. వారు నాప్రయత్నమునకు మిక్కిలి సంతసించిరి. వారి విద్యాలయములో శిక్షితమైన సమర్ధురాలి నొకరిని మావిద్యాలయప్రధానగురుస్థానము వహించుటకు పంపవలెనని కోరితిని. వా రందుకు సమ్మతించిరి. ఆసమయముననే ఫర్గూసన్ కళాశాలను దర్శించి, ప్రధానాచార్యులైన పరంజేపే గారిని కలుసుకొని, సంభాషించితిని. అఖిలభారతసేవాసంఘము