వంతములై యుండిన కాలమున మా పాతగుంటూరు గొప్ప వైభవము ననుభవించెను. కాని నా జననకాలమునకు కొన్ని సంవత్సరముల పూర్వమే ఆంగ్లేయ ప్రభుత్వమువారు తమకు చెల్లించవలసిన పేష్కషు చెల్లించలేదను మిషబెట్టి, తమకు రావలసిన పేష్కషును రాబట్టుకొని మరల జమీందారీలను వదలి వేయుదమని వ్రాతపూర్వకమైన వాగ్దానములుచేసి జమీందారీలు స్వాధీన పరచుకొనిరి. జమీందారులకు మాత్రము అలవెన్సుల పేరట వారి జీవితభృతికి కొంతసొమ్ము ఏటేట ఇచ్చుచుండిరేగాని ఎంతయో ఆదాయము జామీందారీ గ్రామముల మీద వసూలై తమ పేష్కషు సంబంధమగు అప్పు ఎప్పుడో తీరిపోయినను మరల జమీందారులకు వారి గ్రామములను స్వాధీనపరచక ఆంగ్లేయ ప్రభుత్వమువారే శాశ్వతముగ నాక్రమించుకొని పరిపాలించుచుండిరి.
ఈజమీందారీలు మొగలాయి ప్రభుత్వము నాటినుండి నున్నవియే. కేష్ణానదికి దక్షిణమున నున్న దేశము కొండవీటి సూబా యనియు, ఉత్తరమున నున్న దేశము కొండపల్లి సూబా యనియు పిలువబడుచుండెను. మొగలాయిల ప్రభుత్వము మారి ఆంగ్లేయ ప్రభుత్వము ప్రారంభమైన పిదప ఇప్పటి గుంటూరు జిల్లా భాగములో ఒంగవోలు తప్ప తక్కినదంతయును, కృష్ణకు నుత్తరమున బెజవాడ బందరు గుడివాడ నూజివీడు మొదలగు ప్రాంతమంతయు కలిపి కృష్ణాజిల్లా యను నొక మండలముగ నేర్పరచిరి. జిల్లాకలెక్టరు బందరులో నుండినను జిల్లాకోర్టు గుంటూరులోనే యుండుచువచ్చెను. పిమ్మట కొంతకాలమునకు