పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రూపాయలు లంచమిచ్చి రు 10/- లు జరిమానాపడిన రహితు గూడ ఏదో పనిమీద బందరుకు వచ్చి, కేసువిచారణ చూచుటకు కోర్టుకు వచ్చెను. ఆ రహితును నాగేశ్వరరావుగారెట్లు గుర్తించిరో ఊహింపశక్యముకాదు గాని ఎట్లో గుర్తించి కేసువిచారణమధ్యనే ఆరహితును 'పకడ్‌లేవ్‌' అని జవానుకు బిగ్గరగా ఆజ్ఞాపించెను. ఆరహితు వెలుపలకు పరుగెత్తెను. జవాను వెంబడించి పట్టుకొని హాజరుపెట్టెను. రు 2000/-లకు జమీనిచ్చి తాము విచారించుచున్న అవనిగడ్డమాజస్ట్రేటుమీది విచారణవాయిదానాటికి హాజరుకావలసిన దనియు లేనియెడల జయిలులో నుండవలసినదనియు నాగేశ్వరరావుగా రుత్తరువు వేసిరి.

రామాయణములో పిడుకలవేట్లాటవలె విచారణమధ్యమున జరగిన ఈ నిరంకుశచర్య కోర్టులో నున్నవా రందరకు విస్మయము కల్పించెను. అచ్చట నుండి ఈచర్య యంతయు చూచుచున్న భట్రాజు వెంకట్రాయుడుగా రను సెకండుగ్రేడు ప్లీడరు త్వరితముగా సబుకోర్టుకు వచ్చి, అక్కడనున్న ప్లీడర్లందరితో నాగేశ్వరరావుగారు నడిపించిన దౌర్జన్యమునుగూర్చి వివరించి, దీనికి తగిన పరిహారము ఆలోచింపవలసినదని నొక్కి చెప్పెను. ప్లీడర్లు వారివారి పనులనిమిత్తము వెడలిపోయిరి. వల్లూరి సూర్యనారాయణరావుగారును నేను మాత్రమే నిలచి యుంటిమి. వారు నాకు ఇంచుక సీనియ రయినను మిత్రులు గావునను స్వభావముచే ప్రభుత్వోద్యోగుల లంచగొండితనమును, నిరంకుశత్వమును నిరసించువా రగుటచేతను ఈసమయమున