ఆరాధనచేయు మహాభక్తుల సందడిచే ఆస్థలము మహాపవిత్రముగ గన్పట్టినది. దేవాలయపు గ్రిందిభాగము మసీదు పోలికగా నుండుటచే మసీదునే దేవాలయముగా మార్చినట్లు తలచితిని. ఔరంగజేబు కాలములో ఆలయము మసీదు కాగా, ఆ మసీదును మరల దేవాలయముగ మార్చిరేమో యనుకొంటిని. పిమ్మట ప్రయాగలో గంగాయమునాసంగమమున స్నానముచేసి ఆవెనుక గయకు బోయి, గయలో విష్ణుదేవుని ఆలయమున నా తల్లిగారికిని పితరులకును పిండములువేసితిని. తండ్రి బ్రతికి యుండగా పిండమువేయవచ్చునా, లేదా యను సంశయము కలిగినదిగాని మాతల్లికి నేను కర్మచేసితిని.పిమ్మట ప్రతిసంవత్సరము ఆబ్దికముపెట్టి పిండదానము చేయుచుంటిని. కనుక ఇట్టి పుణ్యస్థలమున పిండ మేల వేయకూడ దని నమ్మి నా ధర్మమును తీర్చితి ననుకొంటిని. హిందూస్థానములో తీర్థవిధులు పెట్టించు గయావళులు మొదలగువారు ధనోన్మత్తులును ధనార్జనాసక్తులు మాత్రమేగాని నిజముగ భక్తిపరులు గారు. స్మార్తవిద్యాజ్ఞానమైనను పూజ్యమే. గయలో నాకు లభించిన బ్రాహ్మణుడు తీర్థవాసియైనను గయావళిగాడు. మంత్రవిధానము తెలిసినవాడు. వారియింటనే నాకు భోజన మమర్చెను. సజ్జనుడుగ గన్పడినాడు. ప్రయాగలో అంగళ్ళవీధిని పోవుచు నొక యున్ని దుప్పటి నాలుగు రూపాయలకు తీసికొంటిని. అది దట్టముగా ఇరువది మూళ్ళ పొడవుండెను.
అటనుండి కలకత్తానగరము ప్రవేశించితిమి. ఒక్కరోజు మాత్ర మక్కడ నుంటిమిగాని చూచిన విశేషము లేమియు