నన్ను శ్లాఘించిరి. కాని గౌరీనాధశాస్త్రిగారినిగూర్చి పరుషవాక్యములు పల్కినందుకు నామనస్సు మిక్కిలి వ్యధజెందెను. ఆయన పూర్వాచారపరాయణు లైనను నీతిధర్మముల పాటించు చుండిరి. వేదాంతగ్రంథపఠనమునందు సంప్రీతిగల పండితుడాయన. పండితులను పూజించుచుండెను. ఆయనయందు నాకును గౌరవ ముండెను. కాని ఆనాడు ఆసభలో ఆయన పాల్గొనవచ్చినందుకు ఆశ్చర్యమునొంది కొంచెము కఠినముగనే పలికినందుకు పరితపించి, నేను పరుషములు పలికినందుకు క్షమింపుడని ఆయన పేర జాబువ్రాసి పంపితిని. అందుకు వారు మీమాటలవలన తమమనస్సు ఆయాసము చెందలేదనియు తాము క్షమింపవలసిన నేరము నే నేమియు చేసియుండలేదనియు శాంతప్రియవచనముతో జవాబువ్రాసిరి.
బందరు న్యాయవాదులు
బందురులో న్యాయవాదులుగా నున్నవారిలో ప్రముఖులు అయిదారుగురుమాత్ర ముండిరి. కక్షిదారులు పలువురు వారియొద్దకే పోవుచుండిరి. తక్కినవా రందరము జూనియర్లమే. మేము అనగా హనుమంతరావును, నేనును జూనియరులుగా పనిచేయుచుంటిమిగనుక ఒకరిక్రింద నున్నట్లే లెక్క, మాకు వచ్చెడికేసులనుబట్టి మేము బొత్తిగా హీనముగాను లేము. ప్రాముఖ్యముగాను ఉండలేదు. మాకు వచ్చెడికేసులు తక్కువయైనను జాగ్రత్తగా చేయువారమేయని పేరుమాత్రము పొందితిమి. మొత్తమున సివిల్ వ్యాజ్యముల అపీళ్ళలో ప్రముఖులు