పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పత్రము సమర్పించుచు రు 130 లు చందా వసూలుచేసి వరదబాధ పడినవారికి బియ్యముమొదలగునవి కాంగ్రెసుకమిటీతరపున పంచిపెట్టబడినదని వ్రాయగా గవర్నరుగారు కాంగ్రెసువారు నూటముప్పదిరూపాయలు ఖర్చుపెట్టిరా అని హేళనచేసిరి.

మరికొంతకాలమునకు బాబూ బిపినచంద్రపాలు అను బంగాళాదేశస్థుడు, కాంగ్రెసునాయకుడు గొప్పవక్త బందరుకు వచ్చెను. ఆయన బ్రాహ్మసమాజముతరపున ఉపన్యాసము లిచ్చుపనిమీద వచ్చినను కాంగ్రెసునాయకుడగుటచే ఆయనను సన్మానించుటకు కాంగ్రెసుకమిటీ తీర్మానించెను. నేను కార్యదర్శిని. వారిని తీసుకొనివచ్చి బస ఏర్పాటు గావించితిని. ఆయన హిందూహైస్కూలులో నని జ్ఞాపకము - లేకటౌనుహాలులోనో - ప్రస్థానత్రయమునుగూర్చి మహత్తరమగు నుపన్యాసము నొసంగెను.

మరునాడు మా న్యాయవాదులును తక్కిన పురప్రముఖులు పౌరులనిమిత్తము ఏర్పడిన క్లబ్బులో వారికి విందు నేర్పాటుచేసితిమి. గోపాలరత్నంగా రనున్యాయవాది, వైశ్యులు క్లబ్బులో సభ్యులుగా నుండిరి. వారియింటిలో చక్కెరపొంగలి తయారుచేయించి ఆవిందులో వినియోగించిరి. అప్పటి నామనస్థితినిబట్టి వైఇశ్యులు చేసిన ఫలహారమును పుచ్చుకొనుట ఇష్టము లేకుండెను, కాన నేను తినలేదు. నేను తినలేదని తక్కినవారికి తెలియదు. ఇందుకు ఆయూరిలోని బ్రాహ్మణసభవారు ఆవిందులో పాల్గొన్నవారి నందరిని బహిష్కారముచేయవలె