పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డుగా నుండి, పిమ్మట ఫస్టుగ్రేడు పరీక్షయందు కృతార్థుడై బందరు జిల్లాకోర్టులో న్యాయవాదిగా జేరెను. ఈయన మంచి తెలివిగలవాడు. వావిలాల శివావధానులుగారికి బంధువగుటచేత వారుకొన్ని అప్పీళ్ళుమొదలగునవి ఇచ్చి, ఈయన సామర్థ్యమును ప్రకటించుటకు అవకాశము కల్పించుచు, శ్రద్దవహించుచుండెను. మాకును ఆయన మిత్రుడగుటచేత సంతసించుచుంటిమి. ఇట్లుండగా ఆయనకు భార్యవియోగము సంభవించినది. మరల వివాహము చేసుకొనెను. కొలదికాలములోనే కొన్ని భూములు సంపాదించి, ఆభూములనిమిత్తము వేసచిసెలవులలో గుంటూరుజిల్లా కారుమూరు పోయి, అక్కడ జబ్బుచేసి గుంటూరుకు వచ్చుచుండగా అకస్మాత్తుగా చనిపోయెను. ఎంతయో వృద్ధికి రాదగిన వ్యక్తి ఇట్లు కొలదికాలములోనే ప్రొద్దున పువ్వు వికసించి, సాయంకాలమునకు నశించినట్లు లోకమును విడిచిపోయెను. వీరి అకాలమరణమునకు పలువురు చింతించిరి. ఆయనకు ప్రధభార్యా వియోగము కలిగినపిమ్మట మరల వివాహముచేసుకొనకముందు మిక్కిలి విరాగముతో నున్నకాలములో నేనును ఆయనయు కలిసి కొన్నిసాయంకాలములు ఊరివెలుపలకు షికారుగా పోవుచుండినపుడు సంభాషణలో ఎందరో ఆప్తులు మరణించియుందురుగాని యొక్కరైనను మరణానంతరము తమస్థితి యీప్రకారము ఉన్నదని చెప్పినవారు లేరుగదా, దేహము నశించినను జీవుడు నశించడని చెప్పెడిమాట యెంతవరకు విశ్వాసార్హము మొదలగుసమస్యలు చర్చించు చుండువారము. మరల వివాహచేసుకొని కొన్నిమాసములలోనే మృతినొందెను. ఇంతశ్రద్ధతో చర్చించిన ఆయనయైనను