పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నుండిరి. వీ రిద్దరు కాంగ్రెస్‌లో ప్రదమముగా నుపన్యాసముల నిచ్చి సభాసదుల మెప్పించిరి. దేశప్రభుత్వమునందు ప్రజాప్రాతినిధ్యముండవలెననియు, శాసనసభలలోను, మునిసిపాలిటీలు, జిల్లాబోర్డులు, తాలూకాబోర్డులలోను ప్రజలప్రతినిధులు చేరవలెననియు, వీరికి పరిపాలనాబాధ్యత నొసగవలెననియు దీర్ఘోపన్యాసములనొసంగిరి. జాతీయమహాసభాపతాకము విప్పారిన దనియు దానిపై ప్రాతినిద్య మను పదము స్వర్ణాక్షరములతో లిఖీంపబడినదనియు గంభీరముగ వచించుటతోడనే సభాసదులు పులకాంకితులైరి. కరతలధ్వానములు మిన్నుముట్టెను. అప్పటికి దేశపరిపాలనలో ప్రజాప్రాతినిద్యము కోరుటయే గొప్పవిశేషము. ఆసభలో మరియొకవిషయము చర్చించబడెను. చెన్నపట్టణములో హైకోర్టులో న్యాయవాదిగా పనిచేయుచున్న ఎడల్జినార్టన్ అను సుప్రసిద్ధ ఆంగ్లేయు డొక ఆంగ్లేయస్త్రీతో అవినీతిగ ప్రవర్తించి ఆమెభర్తనుండి వివాహబంధవిచ్ఛేదమును హైకోర్టుద్వారా సంపాదించి, తాను, ఆమెను వివాహముచేసుకొనకయే ఆమెతో కలసి నివసించుచు ఈజాతీయమహాసభకు ఆమెతోహాజరయ్యెను. అట్టి అవినీతిపరులను జాతీయమహాసభలో పాల్గొననియ్యవచ్చునా యను చర్చ తలయెత్తెను. ఈమహాసభలో సభ్యుల సంసారిక జీవితములందలి నీతిధర్మములను విచారించుట తగదనియు, ఏది నీతియో, ఏది అవినీతియో విచారించి తేల్చుటకష్టమనియు, గాన అట్టి నిషేధమును ఈమహాసభ చేయజాలదనియు స్పష్టపరచబడెను. అంతట ఆసభకు వచ్చియుండిన తీవ్రనీతివాదులగు (puritans) శ్రీ వెంకటరత్నంనాయుడు ఎం. ఏ. మొదలగువారు సభనుండి వెడలిపోయిరి.