పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తఱిగొండ వెంగమాంబ.

                క. కందువమాటల సామెత !
                    లందముగాఁగూర్చి చెప్పనవి తెనుఁగునకుం
                    బొందైరుచియై వీనుల !
                    విందై ! మఱికానిపించు విబుధుల కెల్లన్.
                                                             మొల్ల.

తఱిగొండ వెంగమాంబ వసిష్ఠగోత్రికుఁడును నందవరీక బ్రాహ్మణుఁడునగు కృష్ణయ్యయను నాతనిపుత్రిక. ఈమె వాసస్థానము కడపమండలములోని తఱిగొండయని యూహింపఁబడుచున్నది. వెంగమాంబ తెలుఁగునందు విద్వాంసురాలని యామెచే రచియింపఁబడిన గ్రంధములే వేనోళ్లఁ దెలుపుచున్నవి. వేంకటాచలమహాత్మ్యమునం దీమె ఆశ్వానాదిని వేసిన శ్లోకములవలన సంస్కృతమునందును నీమెకుఁగొంత పరిచయము గలదని తోఁచుచున్నది. ఈమె బాలవితంతువు. వేదాంతగ్రంధపఠనము వలనను, గ్రంధరచనవలనను కడపమండలములోనేగాక తెనుఁగుదేశము నందంతటను వెంకమ్మగారి కీర్తి విస్తరిల్లెను. కాన జనులామెయం దధికవిశ్వాసముఁగలిగి దేశాచారప్రకార మామెపై ననేకకధలను జెప్పుకొనసాగిరి. అవి యన్నియు నిందుదాహరించుట యనావశ్యకము గాన నొకటి రెంటిని మాత్రమిందుదాహరించెదను.

వెంగమాంబ గ్రంథరచన చేయుచు నేకాంతముగా నొకగదిలో కూర్చుండుచుండెను. అచటినుండి యామె యీ