అర్గళసంస్థానాధీశ్వరి.
17
మార్చికొందఱు దాసీలను వెంటఁగోని, యొరు లెవ్వరెఱుఁగ కుండ గంగాస్నానమునకు బయలుదేఱెను. ఆమె చేరువు రేవునకుఁ బోయి తానిట్టిదని యితరు లెఱుఁగకుండునటుల మిక్కిలి జాగరూకతఁ గలిగి స్నానము చేయుచుండెను. కాని యసమానసౌందర్యవతియగురాజయువతి యెట్టివేషము వేసినను దాఁగుట దుర్లభముగాన, నెవరో యొకరాజస్త్రీ సమీపమునఁ గల రేవున జలకమాడ వచ్చిన దనినవార్త క్షణములో నా గంగాతీరమున వ్యాపించెను. అంత నచటికి సమీపముననున్న యయోధ్యానవాబున కీసంగతి తెలిసెను. పరాజితుఁడై మరలి పోవుచున్న సమయమున శత్రుస్త్రీ తనచేత ననాయాసముగా దొరకు నన్నమాట విని, తురుష్కనవాబునకుఁ బట్ట లేని సంతోషము గలిగెను. వెంటనే తన సమీపమునందున్న కొందఱు భటులను గని యాస్త్రీని తెండని నవాబు వారి కుత్తరువు చేసెను. అచట రాణి దాసీసమూహముతోఁ దనపురికిఁ బోవుచుండఁగా మధ్య నవాబు పంపిన భటులు వారిని నడ్డగించిరి. తురకసైన్యము తమ్మాకట్టుటఁ గని రాణి యెంత మాత్రమును ధైర్యమును విడువక యుండెను. ఆసమయమున వర్ణింపుచు నొకానొకకవి క్రిందియర్థము గల హిందీపద్యములను వ్రాసియున్నాఁడు.
గీ|| యవనవీరులు ఘోరులై యాక్రమించ
భీతియింతయు లేక యావీరవనిత
క్రోధసందీప్తయై నిల్చెఁ గోమలాంగి
యరులతోఁబోర నుద్యుక్తయై రయమున.