పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జోధపురపురాణి.

209

పత్ని భర్తకుఁ దగిలిన దెబ్బలను, గాయములను గని మిగుల విచారపడి వానికిఁ దగు నౌషధము రాచి మాన్పు ప్రయత్నములు చేసెను.

ఔరంగజేబు డిల్లీకరిగి తండ్రినికారాగృహమునం దుంచి సహోదరుల నంతమునొందించి, రాజ్యము నపహరించిన పిదప జసవంతసింగుని వైపు దృష్టి సారించెను. జసవంతసింగు నొకని నంతము నొందించిన తనరాజ్యము నిష్కంటక మగునని యాతఁ డనుకొనుచుండెను. కాన నాతని నుపాయాంతరముతోఁ జంప నెంచి యాసమయమున కాబూలుదేశమున జరుగుచుండిన ప్రజాయుద్ధము నాపుటకయి జసవంతసింగునికి సైన్యాధిపత్య మొసఁగి యాతని నచ్చటికిఁ బంపెను. కాని కపట మెఱుఁగని జసవంతసింగు తన కంతటి సైన్యాధిపత్యము దొరకినందున కెంతయు నుప్పొంగుచు రా జాజ్ఞ శిరసావహించి యాతఁడు దండయాత్రకు బయలు వెడలెను. అప్పు డాతని శూరపత్నియు నాతనితోడఁ గాబూలుదేశమునకు యుద్ధార్థమయి వెడలెను. ఆదంపతు లిరువురును దమ కిదివఱకుఁ బరాజయమువలనఁ గలిగిన యపకీర్తి నణఁచి శాశ్వతకీర్తిని సంపాదింపఁ గృతనిశ్చయు లయి పృధివిసింగుఁ డను పుత్రునకు రాజ్యము నిచ్చి సైన్యసహితు లయి వెడలిరి.

ఆసమయమునందు రాణిగారు పురుషవేషమును ధరియించి యొకానొకశూరుని పగిది భర్తతోడన యుండి యాతనికి సహాయురాలయి యనేకపర్వత ప్రదేశములను మిగుల కష్టముతో గడచి కొన్ని దినములకు కాబూలుపట్టణమును సమీపించిరి. వారచటికి వెళ్లునప్పటి కాదేశమంతయు రాజద్రో