పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

178

అబలాసచ్చరిత్ర రత్నమాల.

గొప్పయుద్ధము జరిగినపిదప రాణిజయముఁగాంచి యచటఁజెఱలో నుండిన భర్తను విడిపించి మరల జయ ఘోషములతో పటియాలఁబ్రవేశించెను.

1794 వ సంవత్సరమున ఆనందరావు, లక్ష్మణరావులను మరాఠాసైన్యాధిపతులు విపుల సైన్యసహితులయి యమునానది నుత్తరించి పటియాలసంస్థానమును గెలుచుటకై వచ్చుచుండిరి. వారువచ్చునపుడు వారిశౌర్యమునకు వెఱచి కొందఱు సామంతరాజులు వారికి ధనము నిచ్చిరి. మఱికొందఱు వారి కనుకూల వచనములఁ బలుకుచు ననేకవస్తువాహనములను వారి కర్పించిరి. కాని యసమర్థుఁ డగు రాజునకుమంత్రిగానుండిన యింతిమాత్రము వారికివెఱచి లోఁబడునట్టిది కాక పోయెను. ఆమెమరాఠివారిరాకనువిని మిగులనాగ్రహించివారిని గెలుచుటకయి యత్నింపసాగెను. ఆమెశౌర్యధైర్యములం గని చుట్టుపట్ల నుండు రాజులును జమీదారులు గొంతసేనలతో నామెకుఁ దోడుపడిరి. ఇది యంతయు గలిసి 7 వేలసైన్య మయ్యెను. దాని కంతకును దానే యాధిపత్యము వహించి రాణీసాహెబు కువరు అంబాలయనుపట్టణ సమీపమునం దున్న మర్దనపుర సమీపమున శత్రువుల నెదిరించి నిలిచి వారిత్రోవ నరికట్టెను. అచ్చట నారెండు సైన్యములవారికిని ఘోరసంగ్రామము జరిగెను. రాణిసైన్య మల్పమగుటవలనను యుద్ధవిద్యాభ్యాసము వారి కంతగా లేనందునను గొంతసేపు యుద్ధము జరిగిన పిదప వారు శత్రువుల దెబ్బలకు నాఁగియుండ నేరక నలువైపులకుఁ జెదరునట్లగుపడిరి. అప్పుడు ధైర్యవతియగు నారాణి రధమునుండి దిగి ఖడ్గము నొఱలో నుండి తీసి ఝళిపించుచు శౌర్యోత్పాదకము లగువచ