రాణిఔస్కువరు.
175
"ఇందునగుఱించి యేషియాఖండమునందును, యూరోపుఖండమునందును, విచారించినచో రాజ్యపాలన మధిక దక్షతతోఁజేసిన స్త్రీలసంఖ్యయే లెక్క కెక్కువై యున్నది. హిందూస్థానమునం దొకానొక సంస్థానమునందు రాజ్యమతి వ్యవస్థగాను, మితవ్యయముగాను, నియమితముగాను, కలుగుచుండి రైతుకు నన్యాయముజరుగక, సంస్థానమునకు నానాఁటికి నాదాయము హెచ్చుచుఁబ్రజలు సుఖులైయుండిరనినచో నిట్టి సంస్థానములలో నాలుగింటిలో మూడుసంస్థానములు స్త్రీలపాలనలో నున్నవని నిశ్చయముగాఁ దెలిసికొనవచ్చును. ఈసంగతి పూర్వము నా కనుభవసిద్ధము కాకున్నను, హిందూస్థానమునందలి ప్రధాన రాజ్యవ్యవస్థ సమాజముతో నాకుఁ గలిగిన సంబంధమువలన హిందూస్థానమునందలి యనేక రాజ్యములలోని కాగితపత్రములు నాకుదొరకెను; వానివలన నేనీమాటను స్థాపించఁ గలిగితిని. ఇట్టి యుదాహరణము లనేకములు దొరకును. హిందువుల యాచార ప్రకారమును. వారి మతప్రకారమును స్త్రీలకు రాజ్యార్హతలేదు. అట్లయినను రాజ్యమునకు వారసుఁడగువాఁ డజ్ఞానదశయం దుండుటయు, వారి తల్లులు వారిపేర ననేక పర్యాయములు రాజ్యము నేలుటయుఁ దటస్థింపుచుండును. అదేలయన, రాజు లనేకులు సోమరులుగాను, విషయాసక్తులుగాను నుండుటవలన వారల్పవయసుననే మృతులగుదురు. ఈరాణులు లేక రాజపుత్రికలు ప్రజలయెదుటి కెన్నఁడునురారు, వారు తమకుటుంబమునందలి పురుషులతోఁదప్ప నన్యపురుషులతో సంభాషింపనైనను సంభాషింపరు. భాషించినను దెరలోనుండి భాషించెదరు. వా