పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డాక్టరు ఆనందీబాయి జోశి

113

రాండ్రకును కార్పెంటరు నింటి వారికిని మహారాష్ట్ర స్త్రీలవలె జడలువేసి చీరెలు కట్టింపుచుండెను. తాను న్యూజరసీపట్టణమున కేఁగుటకు ముందు తనస్నేహితురాండ్ర కందఱకును మహారాష్ట్రపద్ధతి ననుసరించి విందుచేసెను. ఆదిన మామె తానే తమదేశపు పక్వాన్నములు వండి భోజనములకు కూర్చుండుటకు పీటలువేసి, తినుటకు విస్తరులును దొప్పలునుకుట్టి మహారాష్ట్ర దేశాచారప్రకారము సకలపదార్థములును వడ్డించి విందారగింపవచ్చిన యువతులకు మహారాష్ట్రస్త్రీవలెఁ జీరలు, గాజులు, కుంకుము మొదలయిన వలంకరించి చేతితో భోజనము చేయువిధ మంతయు వారికిఁ దెలిపి తానును వారితోఁ గూర్చుండి భోజనము చేసెను.

తదనంతరమునం దామెను దీసికొని కార్పెంటరు దొరసాని ఫిలడెల్పియా పట్టణమున కరిగి యచట నామె కనుకూల మగునటుల నిల్లు మొదలయినవి విచారించి, మరలి తనగ్రామమునకు వచ్చెను. ఆనందీబాయియు నచట విద్య నభ్యసింపుచు స్నేహితురాండ్రఁ గలసియుండెను. అచట నామె నాలుగుసంవత్సరములు విద్యాభ్యాసముచేసెను. ఆవ్యవధిలో నామె కనేక శారీరకమానసిక దు:ఖములు కలిగి యామెదేహమునానాటికి క్షీణింపసాగెను. ఆమె చదువుకొనుకాలములో హిందూదేశమునుండి యనేక స్త్రీవిద్యాశత్రువులు మిగుల హేయములగు జాబులను వ్రాసి యామెకు మిగులవిచారము కలుగఁజేసిరి. కొంద ఱామె పరదేశమున కరిగి స్వధర్మమును విడిచెనని యామెభర్తకుఁ జెప్పి యామెపై మనసు విఱుపఁజూచిరి. కాని వారిప్రయత్నము లెంతమాత్రమును కొనసాగినవికావు. ఇట్ల సత్కా