హిమబిందు/ప్రథమ భాగం/17. హిమబిందుకుమారి

వికీసోర్స్ నుండి

“అలాగునా చెల్లీ!”

“అవును, నీ చెక్కడాలు చూచునట అన్నా! నాతోనే చెప్పినది. రా; నీ మందిరానికి పోదము రా, అన్నా!”

సిద్ధార్థినిక అన్నను చేయిబట్టి లాగినది. అతనికి ఏదియో భయము, ఏదియో ఆశ, ఏదియో త్రప కలిగినవి.

“చెల్లీ! నీవు పో! నేను వచ్చెదనులే!”

“అన్నా నీవు త్వరగా రావాలి.”

సిద్ధార్థినిక వెడలిపోవగనె, రేఖారహితమైన యాలోచనలు, మూర్తిరహితమగు స్వప్నములు అతని హృదయమున జన్మించుచున్నవి, మాయమగుచున్నవి.

ఆతడు వేయలేని బొమ్మలు, పాడలేని గీతాలు దూరాకాశనీలపథాలలో మేఘములై మందమందగతి పోయి మాయమైనవి.

17. హిమబిందుకుమారి

సమదర్శిశాతవాహనుడు మహారాజువంశమువాడు. సమదర్శితండ్రి ప్రియదర్శి శాతవాహనుడు. ఆతడు శ్రీముఖశాతవాహనుని తండ్రియగు అభయ భాహుశాతవాహనుని పినతండ్రి మనుమడు.

శాతవాహనులు ప్రాచీనకాలమందుననే ఆంధ్రదేశానికి ఉత్తరము నుండి ప్రయాణమై వచ్చిన బ్రాహ్మణులు. భారతయుద్దమైన వెనుక, దేశమున అనార్య జాతులవారైన నాగులు, రాక్షసులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, వానరులు, పిశాచులు, గుహ్యకులు మొదలగువారు విజృంభించి రాజ్యము లెన్నియో యాక్రమించు కొనిరి. ఆ దినములలో ఆర్య సంప్రదాయములపై అసహ్యత జనించి, సాంఘిక దురాచారాలను ఖండించి, సంఘసాంప్రదాయములందు ఎందరో మార్పులు తెచ్చినారు. అట్టి వారిలో విశ్వామిత్ర సంతతివారయిన ఆంధ్ర బ్రాహ్మణులను చంద్రవంశ క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మొదలగువా రుండిరి. వారందరు శైవపూజాధురంధరులు.

ఇట్లు కొన్ని సంవత్సరములు గడిచిన వెనుక పరీక్షిన్మహారాజు రాజయ్యెను. ఈయన పూర్వసంప్రదాయగాఢాభిమాని. పరీక్షిత్తు చండవిక్రముడై విజృంభించి అనార్షోద్యమ భూయిష్టములగు రాజ్యముల నాశము చేసి, వైదికాచారము పునరుద్ధరించి అనేకాశ్రమములలో యజ్ఞయాగాది క్రతువుల నొనరింపజేసి, తా నొనరించి నాగాదిజాతుల పొగరణచి వైచెను.

ఆతని దాడుల భరింపలేక ఆంధ్రులు కళింగదేశము వలసవచ్చిరి. ఆర్య జాతులవారైనను వారు అనార్షవాదులైనందున పరీక్షిత్తు వారిపై దండయాత్ర సలిపి, ఓడించి, దేశమునుండి తరిమివేసెను.

తూర్పు సముద్రతీరమున నదివరకే సింధునదీ ప్రాంతమునుండి రామాయణ కాలమునకు ముందుగనే వలసవచ్చియున్నవారు అసురులు. రాజ్యములు, ఆశ్రమములు స్థాపించి, ఆ తూర్పు తీరాననే పట్టణములు నిర్మించుకొని నాగరికత వృద్ధి చేసికొని యుండిరి. అసురులు హిమవన్నగ ప్రాంతీయులైన ప్రథమార్యులు. వారు హిమ వన్నగజములైన సింధు గంగా యమునా నదితీరముల మహానగరములు నిర్మించుకొని అచ్చటనున్న పచ్చిపొలసుదిండ్లను, నరమాంసభక్షకులను దక్షిణ దేశములకు దరిమి, యాప్రదేశములను లక్ష్మీపదముల గావించిరి.

ఆ అసురులకు తర్వాత హిమశైలీయులైన ఆర్యులు దక్షిణమునకు వలస వచ్చి, అచ్చట ఇదివరకే రాజ్యములు స్థాపించియున్న అసురులతో ఘోర యుద్ధములుచేసి, వారిని సింధునదీతీరమునుండి తరిమివేసిరి. అసురు లక్కడనుండి కదలి మెసపొటేమియా, ఈజిప్టులకు, భరతఖండ ప్రాకృశ్చిమ దక్షిణ తీరములకు సముద్రయానము చేయుచునో, తీరములవెంట ప్రయాణము చేయుచునో వచ్చి వలసలుపోయి రాజ్యము లేర్పరచుకొనిరి.

పరీక్షిత్తు కాలమున తూర్పుతీరములకు వచ్చిన ఆంధ్రార్యులు అదివరకే పూర్వ సముద్రతీరమున వాసముచేయు అసురార్యులతో యుద్ధములు సలిపి, అసురరాజుల నిర్జించి తామురాజులైరి. ఆ కాలముననే ఆంధ్రవిష్ణువు గాథ జన్మించినది.

ఆంధ్రవిష్ణువు వంశమువారే ఆంధ్ర శాతవాహనులు. ఈ గాథయే బృహత్కథయందు వర్ణితమైనది.

ఆ శాతవాహనవంశమందు ప్రియదర్శి తన పెదతండ్రికొమరుడును చక్రవర్తియు నగు అభయబాహునకు దక్షిణబాహువై, చండవిక్రముడై, మహాసేనాధిపతియై ఆంధ్ర రాజ్యము పడమటి తీరమునుండి ఉత్తరమున ఘూర్జరమువరకు గొనిపోయెను. మాళవము జయించి ఆంధ్రరాజ్యములోజేర్చెను. అభయ బాహువు ప్రతిష్ఠానమున ప్రియదర్శి శాతవాహనునే తనకు బ్రతినిధిగ నుంచెను.

ఆ దినములలో కోటీశ్వరుడగు వినయగుప్తుడు అభయబాహు సార్వభౌమునకు వామహస్తమై, తన వైభవమంతయు చక్రవర్తికి దాసిని జేసెను. ఆతడు ప్రియదర్శి శాతవాహనుని ఎక్కువగా ప్రేమించి ఆతని జైత్రయాత్రలలో సర్వవిధముల బాసటగా నుండెను. ప్రియదర్శిని ప్రేమించుటతో తృప్తిపడక తన కొమార్త అమృతలత నా వీరపుంగవునకు కన్యాదాన మొసంగెను.

సమదర్శిశాతవాహనుడు ప్రియదర్శికి ఏకపుత్రుడు. అమృతలతాదేవి కుమారుని యందు గాఢప్రేమతో, మాళవయుద్ధమందు వీరస్వర్గమందిన ప్రాణేశుడగు ప్రియదర్శిని తలంచుకొని ఆంధ్రసైన్యమునందు చేర సుతుడనుజ్ఞ వేడినప్పుడు సమ్మతినొసంగ నిరాకరించినది.

సమదర్శికి పదునేడవ ఏడు వచ్చినది. ఆయేటి మహాలయపక్షములలో అన్నగారి భవనమునకు కుమారునితో బోయిన అమృతలతాదేవికి స్వప్నమందు ప్రియదర్శి ప్రత్యక్షమై, “ఆత్మేశ్వరీ! నా పేరునకు, నాజాతికి, శాతవాహనవంశానికి అపఖ్యాతి తెచ్చుచున్నావా? ఇది నీకు ధర్మమా?” అని ప్రశ్నించుచు విచారవదనమున కనబడినాడట.

అంతియ. అమృతలతాదేవి ఆ మరుక్షణమునుండి సంపూర్ణముగ మారిపోయి, కుమారునికి సైన్యమునజేర ననుమతి యొసంగుటయేగాక, స్వయముగా శ్రీముఖచక్రవర్తి కడకుబోయి సమదర్శిని వేయికన్నుల గాపాడవలసినదనియు, నాతనికి సైన్యమున ముఖ్యోద్యోగములనిచ్చి యా బాలుని తండ్రియంత వాని జేయవలయుననియు బ్రార్థించెనట. సమదర్శి మరునాడు దళపతిగా ఆంధ్ర సైన్యములలో జేరినాడు. ఒక సంవత్సరములో నాతడు ముఖపతియు, గణపతియు, వాహినీపతియు నైనాడు. మరు సంవత్సర మాతడు చమూపతియైనాడు. మొదటినుండియు ననేక యుద్ధముల వీరవిక్రముడై యాంధ్ర సైన్యములకు యశము సముపార్జించుచు నేడు విఖ్యాతినందిన ఉపసేనాపతులలో నొకడైనాడు. ఆతడు తా నెప్పుడు సేనాపతియగుదునా, ఉపసైన్యాధ్యక్షుడ నగుదునా, సర్వసైన్యాధ్యక్షుడనగుదునా, అందులకు తన మేటిమగటిమి చూపు సందర్భ మెప్పుడువచ్చునా యని ఎదురుచూచుచున్నాడు.

సమదర్శి తిన్నగా ఒకనాడు చారుగుప్తుని భవనమునకు పోయెను. తన మేనమామ కోటీశ్వరులలో కోటీశ్వరుడు. ధనము మాట యటుండ ప్రపంచమున ననన్యలభ్యమగు మహారత్నమువంటి సుందరాంగికి జనకుడు. మేనమామ కుమారిత ధర్మశాస్త్రప్రకారము తన స్వత్వము. హిమవంతుని తనయను కైలాసనాథుడు వివాహమాడినాడట. సముద్రుని పుత్రికను, సముద్రమున వసించు వటపత్రశయను దుద్వాహమయ్యెనట. చిన్న తనముననుండి తాను హిమబిందుతో ఆటలాడుకొన్నాడు. ఆమె “నాకిదికావలె” నని యనినంత తా నది తెచ్చినాడు. ఒకసారి యామె కృష్ణానది కావలియొడ్డుననున్న పచ్చ తురాయి పూలగుత్తులు పట్టుకొని రమ్మని నప్పుడు, తాను పదునారేండ్ల యీడువాడై యున్నప్పుడు, కృష్ణానది నీది ఆపూలు తెచ్చి యిచ్చినాడు. హిమబిందు తన్నెంతో మెచ్చుకొని “బావా! నీయంత గొప్పవా రెవరునులేరు నేను నిన్నే వివాహమాడెద “నని తన మెడచుట్టును బాహులతల పెనవేయలేదా? ఆనాటి కౌగిలింత యిప్పటికిని మధురస్మృతియై మరపునకురాదు. తాను బాహుబలమున అసమానుడు. తనవంశము అనేక తరములనుండియు ప్రసిద్ధికెక్కిన శాతవాహనవంశము అతిరథశ్రేష్ఠుడైన ప్రియదర్శి తన తండ్రి. తాను సేనాపతి. నేట రేపట ఉపసేనాధ్యక్షపదము, సర్వసేనాధిపత్యము, ఆ వెనుక?

ఈ ఆలోచనలు కన్నులకొక కాంతి నీయ, మోమున కొక విలాసముగూర, మూర్తికొక ఠీవి జేర్ప, గుఱ్ఱమును మంద మందగతుల నడుపుకొనుచు సమదర్శి శాతవాహనుడు చారుగుప్తుని సౌధము సమీపించెను. కోటవలెనున్న యా భవన ముఖ ద్వారము సమీపించగనే గుఱ్ఱముస్వారితో పోవుటకు మహాతోరణ వామ కవాటమును మాత్రమే ద్వారరక్షకులు తెరచిరి. స్వారిచేయుచునే సమదర్శి నిస్సరణము దాటి ద్వితీయ ద్వారము కడచి ప్రాంగణము జేరునప్పటికి అశ్వరక్షకులు గుఱ్ఱము కళ్ళెమును పట్టుకొన, సమదర్శి అవరోహణ మొనర్చుచు పగ్గపు త్రాడు వారికిచ్చి పాదరక్షలు చప్పుడుకా, మీసములు వడివేసికొనుచు, సభాశాల దాటి అభ్యంతర గృహములోనికి బోయెను.

అట్లు నడచి నడచి ప్రతిహారుల నమస్కృతులందుకొనుచు ఆ సౌధశాలలకు, అందున్న సమస్తమునకు ప్రభువునా విస విస నాతడు లోనికి జనెను. ఒక మందిరముకడ ఆగి, పాదరక్ష వదలి, యచ్చట నున్న పరిచారికతో తనరాక చెప్పిపుచ్చి అనుమతికై నిలిచియుండ ఆమె లోపలికిబోయి ఒక క్షణములో మరలివచ్చి “రావచ్చు” నని తెల్పెను.

సమదర్శిశాతవాహనకుమారుడు ప్రవేశించిన గృహము వైకుంఠమున లక్ష్మీదేవి నివసించు మందిరమువలె ప్రకాశించినది. బంగారముతో, దంతముతో, చందన తరువులతో నిర్మించిన పీఠములు, మంజూషలు, కాశ్మీర దేశపు కంబళ్ళు, సహ్యాద్రి పులుల, హిమవన్నగ శ్వేతచమరీమృగముల, వింధ్యాటవీ సింహముల, కామరూప ఖడ్గమృగముల, హిరణ్యద్వీప మార్జాలముల చర్మములతో సొగసుగా నమర్చిన మెత్తటి చర్మములు, శ్రీకాకుళ పల్యంకపురముల అద్దకములు, లిచ్ఛవీదేశ దుకూలయవనికలు, బ్రహ్మదేశమునుండి వచ్చు తళతళలాడు నొకరకము గడ్డి అల్లికలు, ఎచ్చటచూచిన కన్నులకు పర్వ మొనర్చుచుండెను. సర్జరసము, మల్లిగన్ధి, జోంగకము, శ్రీవాసము, జాయకము మొదలగు సుగంధముల తయారుచేసి యందుగు బంకతో మోటుపల్లి సన్నని వలిపములకు పులిమిచేసిన ధూపకళికలు హృదయము మత్తుగొలుపు సువాసనాధూమములను మందిరము నెల్లెడ విరజిల్లుచుండెను. ముత్యముల జాలరులు, నవరత్నములు పొదిగిన ఉపకరణము లెల్లయెడల చెన్నారుచుండెను.

18. చారుగుప్తుని ఎత్తు

ఇక అభ్యంతరమందిరమున, అమూల్యమగు నొక పర్యంకము పై తూలికల పానుపుపై ఉపధానముల నానుకొని ఊర్వశివలె బంగారుమేని జిగితో గాత్రానులేపనములు మెరుపులీన, ఒయ్యారమున హిమబిందుకుమారిక చెలులు వింజామరలు వీవ అధివసించి యుండెను. మేనబావ వచ్చుటయు దాపుననున్న నొక పీఠము పై కూర్చుండుమని సైగచేసి యా బాల “కుశలమా?” యని ప్రశ్నించెను. ఆమె కటిప్రదేశముచుట్టును అంతరీయము మనోహర నీలవర్ణముల జెలువారుచు నీటిమూట యుబుకుల మడతలలో శృంగారరేఖల కుచ్చులతో చెన్నారియుండెను. గంభీరవక్షోజములు పొగమంచులోనుండి అస్పష్టముగా గోచరించు బంగారుకొండలవలె ఊర్పులకు పొంగుచు, తగ్గుచు సుచేలవినీత బద్ధములై యుండెను. మంజీరములు కింకిణిద్వయములు నూపురములు పాదకటకములను, ఆమె పాదములకు మహత్తర హిరణ్యపూజ లర్పించినవి. వెలలేని హారములు శంఖమునుచుట్టిన ప్రవాళలతలవలె మెడను చుట్టి వక్షోజోన్నతతలముల పై వ్రాలి మిలమిలలాడుచుండెను. మణులు పొదిగిన మేఖల ఆమె నెన్నడుము క్రింద స్వర్ణదీ భాసమానమై వంకర వంకరల చుట్టి ప్రవహించు చుండెను. బాహుపురులు వేయి శిల్పవిన్యాసములతో నామె బాహువుల జుట్టి సౌందర్యతత్వోపదేశము నందుచున్నవి. నవమణివలయిత నీలరత్నలలాటికము రతీదేవి హృదయమై వలపుమంత్రములు జపించుచున్నది.

ఆమె కీ నగలున్నను, లేకున్న నొక్కటే! ఆమెయందము అకుంఠితము, అనన్యము, అప్రతిమానమునై నగలకే నగయైనది.

క్రీగన్నుల బావగారిని జూచుచు, మృదులాధరోష్ఠకాంతులు ప్రసరింప నెమ్మదిగ తాంబూలము నములుచు, విలాసముగా ముంగురుల సవరించుకొనుచు, బాలచంద్రుని శిశుకిరణములవంటి వ్రేళ్ళతో పూలచెండుల దొర్లించుచు “బావా! యుద్ధ వార్తలు చెప్పవూ?” అని ప్రశ్నించెను.

“సుందరీసామ్రాజ్ఞియైన మరదలు చెంతకువచ్చినపుడుగూడ యుద్ధ వార్తలేనా? లోకమోహనమైన నీ సౌందర్యమును జూచుచు ముగ్ధయైపోయే నా మనస్సు ఇతరాలోచనలకు చోటిచ్చుట లేదు.”

“బావా! నీవంటి మహావీరులకు, యుద్ధములని, సైన్యములని, గుఱ్ఱపు పందెములని యుండవలెనుగాని స్త్రీ సౌందర్యవర్ణనముతో ప్రొద్దుపుచ్చుట నిరర్థకులగు కవుల పని.”