హిమబిందు/ప్రథమ భాగం/16. హృదయ కుసుమపరాగము

వికీసోర్స్ నుండి

యీ ముఖము ఎవరిదో నేను చూచినట్లున్నది! ఎవరు చెప్పుమా?” యని తలపోయ జొచ్చెను. అప్పుడు తొమ్మిదేండ్ల బాలికయగు సిద్ధార్థినిక ఒక్క గంతువేసి చప్పట్లు “ఆఁ నాకు తెలిసినది! మీరు చెప్పుకొనండి!” అని కిలకిల నవ్వెను.

శక్తిమతీదేవి యా రాతితలను తదేకదృష్టితో తిలకించి “యీముఖము నా బాల్యస్నేహితురాలగు ప్రజాపతిమిత్ర మోమువలె నున్నది” యనెను. అప్పుడు మహాలి “ఆఁ తెలిసినదమ్మా తెలిసినది. చారుగుప్త కోటీశ్వరునితనయ, ప్రజాపతిమిత్ర కొమరిత, హిమబిందుకుమారిక మోము. మొన్న ఉత్సవమునాడు అబ్బాయికి బహుమాన మిచ్చినప్పుడు నాట్యమాడిన బాలలలో హిమబిందు కుమారిక యొక్కతె” అని సాభిప్రాయముగ నవ్వుచు నామె యేమియో చెప్పబోవుచుండ, సిద్ధార్థినిక మోము చిన్నబుచ్చుకొని కన్నుల నీరు తిరగ “నన్ను చెప్పనీయక మీరందరు చెప్పుకొనుచున్నారు. ఈ మహాలి మంచిది కాదు. మీ ఎవరి జత ఉండను” అని మూతిముడుచు కొని గబగబ పరుగిడి పోయెను.

ఆమె యట్లు శిల్పమందిరములున్న తోటలోనికిబోయి యొక కేళాకూళికడ పూలవృక్షములున్నచోట పండుకొని వెక్కివెక్కి ఏడువజొచ్చెను. ఇంతలో సువర్ణశ్రీకుమారు డామెను చూసి, చెల్లెలినెత్తి తనయొడి జేర్చు కొని, చెక్కిలి ముద్దుగొనుచు కంట నీరుతుడిచి బుజ్జగింపుచు “ఏవమ్మా చిట్టితల్లీ! ఏమిటి యీ ఏడుపు? అమ్మ కూకలువేసినదా? లేక అక్క కలత పెట్టినదా?” అని ప్రశ్నించెను. సిద్ధార్థినిక మరియు వెక్కి వెక్కి యేడువసాగెను. అన్నగారు పరిపరివిధముల బ్రతిమాలి ఎత్తుకొని తీసికొనిపోయి తాను తన చెల్లెలికై చెక్కిన యొక బాలకుని బొమ్మను, ముద్దులమూట గట్టుదానిని, కిలకిలనవ్వు మోముగలిగిన ప్రతిమను ఆమెకిచ్చి “ఇదిగో నీ అబ్బాయి బొమ్మ ఆడుకో. ఏడవకు. అక్కకు, ఎవ్వరికీ ఈయకు” అని ఇచ్చెను. తోడనే కళ్ళనీళ్ళు తుడుచుకొనుచు ఆ బాల చిరునవ్వు నవ్వుచు “ఈ అబ్బాయిని అక్కయ్యను, అమ్మను ఎత్తుకోనివ్వనులే. మహాలికి కొంచెమైనా చూపించను. నేనే నీళ్ళు పోసుకుంటాను, నగలు పెట్టుకొంటాను. మరే అన్నా! నీవు చెక్కిన బొమ్మ తలకాయ వాళ్ళమ్మాయి హిమబిందుదని నేను చెప్పబోతుంటే వాళ్ళే చెప్పుకొని నాకు కోపం తెప్పించినారు!” అని యా వెఱ్ఱి బాగుల శిశువు అన్నగారికి చెప్పెను. సువర్ణశ్రీకుమారు డామాట వినుచునే ఉలికిపడెను. చెల్లెలిని సాగనంపి అక్కడనున్న యొకరత్న కంబళిపై చతికిలబడి యదేవిధముగ నాలోచింపసాగెను. ఉజ్వల సువర్ణవర్ణుడగు నాతని కపోలము లెఱ్ఱబారెను.

16. హృదయ కుసుమపరాగము

ఆ బాలిక హిమబిందు. ఎంత చక్కని పేరు! స్నిగ్ధ శ్వేతకాంతి భాసమాన హిమబిందువా ఆ బాల! ఆ తెలుపు ఎరుపులు ఔత్తరాహికములు. ఆమెలో గాంధార రక్తమున్నది. రోమక, యవన జాతులు ఆర్యరక్త సమ్మిశ్రితములై, మహోత్తమమూర్తి తాల్చినట్లున్నవి. ఎవ్వ రాబాలిక? ఏ రాజతనయ? ఏ నందనవనమున అవతరించినదో! ఎంత హొయలున్నది యామే కదలికలో! ఆమె అద్భుతనాట్యనిమగ్నయయ్యు తన్నంతతీక్షణముగ గమనించినదేల? సాకూతములగు ఆమెచూపుల కొన్నింట ఎన్నియో ప్రశ్నలున్నవి. ఆమె కన్నులు! ఏ శిల్పియైన వానిని విన్యసింపగలడా? ఆ కన్నులలో వేయితారకల కాంతులు, ఆమె కనురెప్పలలో పదివేల గగననీలాలు, ఆ బొమలలో వేయి యమునానదీ ప్రవాహధారలు, ఆమె అపాంగములలో లక్ష కల్లోల నర్తనములు, ఆమె భ్రూభంగిమలలో కోటి ఇంద్రధనువు లున్నవి. ఆమె కనీనికలలో మహాపద్మనీల పథము లున్నవి. ఆమె ఎవరు?

తన శిల్పమున నా బాలికమోమును వారెట్లు గ్రహించిరి? తనకు పోలిక లేనట్లే కనబడెనే! ఆమె రూపమును తన అల్పశక్తి కళగట్టింప గలదా? తన కళానైపుణ్యము మంట గలిసెనా? అయోఘనము తప్పి జారి చేతికి రెండుమూడుసార్లు దెబ్బలు తగిలినవి. టంకము చేతపట్టినప్పుడు చేయి వణికిపోయినది. తద్రూపభావనామాత్రమున తనలో నింతటి వివశత్వమునకు గారణమేమి? తన వారితో కూర్చుండి సల్లాపము లాడలేడు, తానొంటిగ నుండలేడు. వేసవిని మిట్ట మధ్యాహ్నమున గాలిలేని సముయమున నిద్రయు పట్టదు. మేల్కొని యేపనియు చేయజాలడు. తన మానస పథమందు గాలివాన లేవైన రాబోవు చున్నావా? నిశ్చల శీతలమందాకినీ తుషారము లెక్కడున్నవి? గంటలకొలది ఇటునటు తిరిగినను తన హృదయమునకు శాంతి కలుగదు. గ్రంథములు చదువుటకు మనస్సుపోదు. పెద్ద చెల్లెలి వీణాగాన మాలకించుచు ఆ స్వనముతో శ్రుతిగలిపి మనోహర గాన మొనరించు దైనందినమగు అలవాటు తనకు నేడు అసహ్యమయినది. ఆతని ఆలోచనలు వాయుద్వంద్వపాతములైపోయినవి.

ఇంతకు ఎవ్వరాబాలిక? చెల్లెలి నడుగ సిగ్గు. తనకు సిగ్గెందుకు? నాగబంధునిక ఏమయిన ననుకొనునా? ఏమనుకొనగలదు!

అతడు కృష్ణ ఒడ్డున కూర్చుండి, మధుమాసవిరహకృశయగు నాధునీ బాలిక నిట్టూర్పుల నాలించుచు, దూరపుకొండల గమనింపుచు, నదీ గర్భమందెల్ల నావరించి యున్న ఇసుకతిన్నెల చూపులేని చూపులతో చూచుచు హిమబిందునే తలపోయుచు కూరుచుండెను.

ఇంతలో నాగబంధునిక వచ్చి యన్నగారి కన్నులు మూసెను. సువర్ణశ్రీ “నాగా చేతులుతీయవే!” యని విసుగుకొనెను.

“అవును! హిమబిందువే లోకమైపోయిన అన్నగారికి చెల్లెలంటే విసుగుకాదా మఱి?”

“ఏమి మాటలవి నాగా! ఇంతట చాలించు.”

“అదుగో! కోపంకూడా వస్తున్న దన్నాయికి. అంత ఉలుకయితే పోనీ మాటాడనులే.”

“అవేమిమాటలే! ఏదోవిసుగున అన్నానే తల్లీ! ఇంతలో కోపమా?”

“నాకు ఎంత కోపముగా ఉన్నదో తెలియునా? నా స్నేహితురాలు, చారుగుప్తులవారి కొమార్త, తల్లిలేని పిల్ల, ముక్తావళీదేవి మనుమరాలు ఆ హిమబిందునుగూర్చి ఇన్నాళ్ళకా మా అన్న తెలిసికొన బ్రయత్నించుట అని. మా అన్నను, ఆ హిమబిందు తలలోనిపూలతో కట్టవలెనని ఉన్నది”

“ముక్తావళీదేవికి అంత స్వచ్ఛదేహం ఉన్నది. ఆమె తెలుగుజాతి ఆడ బిడ్డయేనా చెల్లీ?”

“ముక్తావళీదేవి యవనవంశ జాత అన్నా! ఆమెపోలిక హిమబిందు. హిమబిందు తన అమ్మమ్మకన్న ఎక్కువ స్వచ్ఛమైన శరీరము, అద్భుతమైన అందమును కలది. ఆమె హృదయము మా అన్న దొంగిలించినట్లు నా అనుమానము ఎక్కువౌచున్నది, అట్లాంటి దొంగతనాలకు రాజసభలో దేశాంతరవాసము విధింపబడుచున్నది. దొంగ అన్నగారూ!”

“ఏమిటి నాగా! నీకు నిజముగా పిచ్చి ఎత్తినది. కులవైద్యులు, ప్రఖ్యాతులు, అపర ధన్వంతరులు, ఆనందులవారు నీకు మందు త్వరగా ప్రారంభించగలరు. సేవకుని పంపి వారిని త్వరగా రమ్మని వార్తనంపవలసి ఉన్నది.”

“మా అన్నగారికే మతిభ్రమణము కలిగినది. ఉత్తమశిల్పి బ్రాహ్మణ వంశజాతుడైన మా అన్న యవనవంశజాతను ప్రేమించుటేమీ?”

“ఓ భగవానుడా! నేను ఎక్కడికైన పారిపోవలసి ఉన్నది!”

“ఓ మాయాదేవీ, ఈ దీనురాలి ఇక్కట్లు తొలగింపవా?”

“చెల్లీ! నీవును, హిమబిందును కలిసి చదువుకొన్నారా?”

“ఆమెయు, నేనును కలిసి చదువుకొన్నాము. ఆమె కోటీశుతనయ”

“ఆమెలో భారతజాతి సుగుణములు, యవనజాతి సుగుణములు మేలు కలయిక పొందినట్లున్నదే!”

“అన్నా! బాలికలలో సామ్రాజ్ఞిని నా అన్న వరించవలె! జయములలో అఖండ విజయము నందవలె. ఆ దినమున నీ చుట్టూ మేమందరమూ నాట్యము సలిపినప్పుడు, హిమబిందు నీవంక అట్లు తదేకదీక్షను చూపులు పరిపినదేమి? చారుగుప్తుని బండిని సమదర్శి శాతవాహన సేనాని తోలినారు.

ఆయన నీవల్ల ఓడిపోయినారు. అందుకని ఆమె కొంచెము కించపడినది కూడ సుమా!”

“ఆమె దేవలోకమునుండి దిగివచ్చిన ఇంద్రాణివలె లేదటే తల్లీ!”

“నీవు ఇంద్రునివలె లేవా ఏమి?”

“సరి! సరి! అదేమి మాటలే?”

ఇంతలో సిద్ధార్థినిక వారిరువురు కూరుచున్న నల్లరాతి బండకడకు పరుగునవచ్చి వగర్చుచు, నవ్వుచు, “అన్నా! వచ్చినది! వచ్చినది!” అని అరచెను.

సువర్ణ: ఎవరు తల్లీ?

సిద్ధార్థినిక: హిమబిందు! హిమబిందే!

నాగబంధునిక: హిమబిందా!హిమబిందు ఎందుకువచ్చునే వెఱ్ఱి తల్లీ!

సిద్ధా: నేను వెఱ్ఱితల్లిని, నీవు తెలివిగల తల్లివి, పోనీలెండి. నా మాట ఎవ్వరును ఎప్పుడును నమ్మరు.

సువర్ణశ్రీ చిన్నచెల్లెలిని దగ్గరకు తీసికొని, “ఓసి బంగారుతల్లీ, అక్క వెండితల్లికాదూ? వెఱ్ఱితల్లి! నీమాటే నిజము! నాగా! నీ కొరకే వచ్చి ఉంటుంది. వెంటనే పో!”

నాగబంధునిక చఱ్ఱున పరువిడినది.

సువర్ణ శ్రీ గుండియలు గతులు తప్పి నడచినవి. ఏమది, ఆ దివ్య బాలిక ఎందుకు వచ్చినది? ఆ దేవీమూర్తి తన ఇంటికే వచ్చినదా? తన ఇల్లు పవిత్రమైనదా? ఓహో ఆమె వచ్చునా? నిజమా!

“అన్నా! హిమబిందు, ఆమె అమ్మమ్మ ముక్తావళీదేవి వచ్చినారు. రాగానే, హిమబిందు అక్కను అడిగినది. నాయనగారి బొమ్మలన్నియు చూడ వచ్చినదట. నన్ను కొంచె మటు తీసికొనిపోయి, “మీ అన్నగారు బొమ్మలు చెక్కునా?” యని యడిగినది.” “అలాగునా చెల్లీ!”

“అవును, నీ చెక్కడాలు చూచునట అన్నా! నాతోనే చెప్పినది. రా; నీ మందిరానికి పోదము రా, అన్నా!”

సిద్ధార్థినిక అన్నను చేయిబట్టి లాగినది. అతనికి ఏదియో భయము, ఏదియో ఆశ, ఏదియో త్రప కలిగినవి.

“చెల్లీ! నీవు పో! నేను వచ్చెదనులే!”

“అన్నా నీవు త్వరగా రావాలి.”

సిద్ధార్థినిక వెడలిపోవగనె, రేఖారహితమైన యాలోచనలు, మూర్తిరహితమగు స్వప్నములు అతని హృదయమున జన్మించుచున్నవి, మాయమగుచున్నవి.

ఆతడు వేయలేని బొమ్మలు, పాడలేని గీతాలు దూరాకాశనీలపథాలలో మేఘములై మందమందగతి పోయి మాయమైనవి.

17. హిమబిందుకుమారి

సమదర్శిశాతవాహనుడు మహారాజువంశమువాడు. సమదర్శితండ్రి ప్రియదర్శి శాతవాహనుడు. ఆతడు శ్రీముఖశాతవాహనుని తండ్రియగు అభయ భాహుశాతవాహనుని పినతండ్రి మనుమడు.

శాతవాహనులు ప్రాచీనకాలమందుననే ఆంధ్రదేశానికి ఉత్తరము నుండి ప్రయాణమై వచ్చిన బ్రాహ్మణులు. భారతయుద్దమైన వెనుక, దేశమున అనార్య జాతులవారైన నాగులు, రాక్షసులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, వానరులు, పిశాచులు, గుహ్యకులు మొదలగువారు విజృంభించి రాజ్యము లెన్నియో యాక్రమించు కొనిరి. ఆ దినములలో ఆర్య సంప్రదాయములపై అసహ్యత జనించి, సాంఘిక దురాచారాలను ఖండించి, సంఘసాంప్రదాయములందు ఎందరో మార్పులు తెచ్చినారు. అట్టి వారిలో విశ్వామిత్ర సంతతివారయిన ఆంధ్ర బ్రాహ్మణులను చంద్రవంశ క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మొదలగువా రుండిరి. వారందరు శైవపూజాధురంధరులు.

ఇట్లు కొన్ని సంవత్సరములు గడిచిన వెనుక పరీక్షిన్మహారాజు రాజయ్యెను. ఈయన పూర్వసంప్రదాయగాఢాభిమాని. పరీక్షిత్తు చండవిక్రముడై విజృంభించి అనార్షోద్యమ భూయిష్టములగు రాజ్యముల నాశము చేసి, వైదికాచారము పునరుద్ధరించి అనేకాశ్రమములలో యజ్ఞయాగాది క్రతువుల నొనరింపజేసి, తా నొనరించి నాగాదిజాతుల పొగరణచి వైచెను.

ఆతని దాడుల భరింపలేక ఆంధ్రులు కళింగదేశము వలసవచ్చిరి. ఆర్య జాతులవారైనను వారు అనార్షవాదులైనందున పరీక్షిత్తు వారిపై దండయాత్ర సలిపి, ఓడించి, దేశమునుండి తరిమివేసెను.

తూర్పు సముద్రతీరమున నదివరకే సింధునదీ ప్రాంతమునుండి రామాయణ కాలమునకు ముందుగనే వలసవచ్చియున్నవారు అసురులు. రాజ్యములు, ఆశ్రమములు స్థాపించి, ఆ తూర్పు తీరాననే పట్టణములు నిర్మించుకొని నాగరికత వృద్ధి చేసికొని యుండిరి.