శ్రీ సాయిసచ్చరిత్రము /నాలుగవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (నాలుగవ అధ్యాయము )



శ్రీ సాయిసచ్చరిత్రము నాలుగవ అధ్యాయము యోగీశ్వరుల కర్తవ్యము ; పవిత్ర శిరిడీ క్షేత్రము;సాయిబాబా యొక్క రూపురేఖలు;గౌలిబువా గారి వాక్కు;విఠలదేవుడు దర్శనమిచ్చుట;క్షీరసాగరుని కథ;దాసుగణ ప్రయాగస్నానము; మూడు వసతిగృహములు భగవద్గీత చతుర్థాధ్యాయమున 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చియున్నారు. "ధర్మము నశించునప్పుడు అధర్మము వృద్ధి పొందునప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు, యుగయుగములందు అవతరించెదను." ఇదియే భగవంతుని కర్తవ్యకర్మ. భగవంతుని ప్రతినిధులగు యోగులు సన్యాసులు అవసరము వచ్చినపుడెల్ల అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులగు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతులవారుతమకర్మలను మానునప్పుడు, శూద్రులు పైజాతులవారి హక్కులను అపహరించునప్పుడు, మతగురువులను గౌరవించక యవమానించునప్పుడు, ఎవరును మతబోధలను లక్ష్యపెట్టనప్పుడు, ప్రతివాడును గొప్ప పండితుడనని యనుకొనునప్పుడు, జనులు నిషిద్దాహరములు మద్యపానముల కలవాటుపడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయునప్పుడు, వేర్వేరు మతములవారు తమలో తాము కలహించునప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించనప్పుడు, ప్రజలు ధనదారాసంతానములే జీవిత పరమార్ధముగా భావించి మోక్షమార్గమును మరచునప్పుడు, యోగీశ్వరులుద్బవించి వారి వాక్కాయకర్మలచే ప్రజలను సవ్యమార్గమున బెట్టి వ్యవహారములు చక్కదిద్దుదురు. వారు దీపస్తంభములవలె సహయపడి, మనము నడువవలసిన సన్మార్గమును సత్ర్పవర్తనమును నిర్దేశించెదరు. ఈ విధముగనే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోరా, గోణాయీ, ఏకనాథుడు, తుకారాము, నరహరి, నర్సిబాయి, సజన్ కసాయి, సాంవతమాలి, రామదాను, మొదలుగాగల యోగులును, తదితరులును వేర్వేరు సమయములందుద్భవించి మనకుసవ్యమైన మార్గమును జూపిరి. అట్లే సాయిబాబాగూడ సకాలముందు శిరిడీ చేరిరి.

పవిత్ర శిరిడీ క్షేత్రము

అహమదునగరు జిల్లాలోని గోదావరినది ప్రాంతములు చాలా పుణ్యతమములు. ఏలయన నచ్చట ననేక యెగులుద్భవించిరి, నివసించిరి. అట్టి వారిలో ముఖ్యులు శ్రీజ్ఞానేశ్వర్ మహరాజ్. శిరిడీ గ్రామము అహమదునగరు జిల్లాలోని కోపర్‍గాం వద్ద గోదావరి దాటి శిరిడీ పోవలెను. నది దాటి 3 కోసులు పోయునచో నీమ్‍గాంవ్ వచ్చును. అచ్చటికి శిరిడీ కనిపించును. కృష్ణా తీరమందుగల గాణగాపురము, నరసింహవాడి, ఔదుంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రములవలె శిరిడీకూడ గొప్పగా పేరు గాంచినది. పండరీపురమునకు సమీపమున గల మంగళవేఢ యందు భక్తుడగు దామాజీ, సజ్జనగఢ మందు సమర్ధరామదాసు, నర్సోబాచీవాడీయందు శ్రీ నరసింహ సరస్వతీస్వామివార్లు వర్ధిల్లినట్లే శ్రీసాయినాథాడు శిరిడీ వర్ధిల్లి దానిని పవిత్ర మొనర్చెను.

సాయిబాబా రూపురేఖలు

సాయిబాబా వలననే శిరిడీ ప్రాముఖ్యము వహించినది. సాయిబాబా యెట్టి వ్యక్తియో పరిశీలింతము. వారు కష్టతరమైన సంసారమును జయించినవారు. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తులు కిల్లువంటివారు; ఉదారస్వభావులు సారములోని సారాంశమువంటివారు; నశించు వస్తువలందభిమానము లేనివారు; ఎల్లప్పుడు అత్మసాక్షాత్కారమందే మునిగియుండెడివారుల్ భూలొకమందుగాని, స్వర్గలోకమందుగాని గల వస్తువులయందభిమానము లేనివారు. వారి యంతరంగము అద్దమువలె స్వచ్ఛమైనది. వారి వాక్కులనుండి యమృతము స్రవించుచుండెను. గొప్పవారు, బీదవారు, వారికీ సమానమే. వారు మానావమానాలను లెక్కించినవారు కారు. అందరికి వారు ప్రభువు. అందరితో కలసిమెలసి యుండెడివారు. అటలు గాంచెడివారు; పాటలను వినుచుండెడివారు. కాని సమాధి స్థితినుండి మరలువారు కారు. ఎల్లప్పుడు అల్లా నామము నుచ్ఛరించుచుండెడివారు. ప్రపంచమంతా మేలుకొనుప్పుడు వారు యోగనిద్రయందుండెడివారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండెడివారు. వారి యంతరంగము లోతయిన సముద్రమువలె ప్రశాంతము. వారి యాశ్రమము, వారి చర్యలు ఇదమిత్థముగా నిశ్చయించుటకు వీలుకానివి. ఒకచోటనే కూర్చుండియున్నప్పటికిని ప్రపంచమందు జరుగు సంగతులన్నియు వారికి తెలియును. వారి దర్బారు ఘనమైనది. నిత్యము వందలకొలది కథలు చెప్పునప్పటికిని మౌనము తప్పెడివారు కారు. ఎల్లప్పుడు మసీదుగోడకు అనుకొని నిలుచువారు. లేదా, ఉదయము మధ్యాహ్నము లెండీ తోటవైపుగాని చావడివైపుగాని పచార్లు చేయుచుండెడివారు. ఎల్లప్పుడు అత్మధ్యానమునందే మునిగి యుండెడివారు. సిద్దిపురుషుడైనప్పటికిని సాధకునివలె నటించువారు. అణకువ నమ్రత కలిగి, యహంకారము లేక యందరిని అనందింపజేయువారు. అట్టివారు సాయిబాబా. శిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది. జ్ఞానేశ్వర్ మహరాజు అళందిని వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైఠానును వృద్ధి చేసినట్లు, శ్రీసాయిబాబా శిరిడిని వృద్ధి చేసెను. శిరిడీలోని గడ్డి రాళ్ళు పుణ్యము చేసికొన్నవి. ఏలయిన బాబా పవిత్రపాదములను ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపైని వేసికొనిగలిగినవి. శిరిడీ మావంటి భక్తులకు పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశి, రామేశ్వము, బదరీకేదార్, నాసిక్, త్ర్యంబకేశ్వరము, ఉజ్జయిని, మహబలేశ్వరము, గోకర్ణములవంటిదయినది. శిరిడీ సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణతంత్రము. అది మాకు సంసారబంధముల సన్నగిలచేసి యాత్మసాక్షాత్కారమును సులభసాధ్యము చేయును. శ్రీ సాయి దర్శనమే మాకు యెగసాధనముగా నుండెను. వారితో సంభాషణ మా పాపములను తొలిగించుచుండెను. త్రివేణీ ప్రయాగల స్నానఫలము వారి పాదసేవ వలననే కలుగుచుండెడిది. వారి పాదోదకము మాకోరికలు నశింపజేయుచుండెడిది. వారి యాజ్ఞ మాకు వేదావాక్కుగా నుండెడిది. వారి ఊదీ ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. వారు మాపాలిట శ్రీ కృష్ణుడుగ, శ్రీ రాముడుగా నుండి ఉపశమనముకలుగజేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మస్వరూపమే. వారు ద్వంద్వాతీతులు; నిరుత్సాహముగాని ఉల్లాసముగాని యెరుగరు. వారు ఎల్లప్పుడు సచ్చిదానందస్వరూపులుగా నుండెడివారు. శిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తరహిందూస్థానము, గుజరాతు, దక్కను, కన్నడదేశములలో చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా, భక్తు లన్నిదేశములనుండి శిరిడి చేరి వారిని దర్శంచి వారి యాశీర్వాదమును పొందుచుండిరి. వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెదివి. పండరీపురమందు విఠల్ రఖుమాయీలను దర్శంచినచో భక్తులకు కలిగెడి యానందము శిరిడీలో దొరకుచుండెడిది. ఇది యతిశయెక్తి కాదు. ఈ విషయమును గూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు.

గౌలిబువా అభిప్రాయము

95 సంవత్సరముల వయస్సుగల గౌలిబువా యను వృద్ధభక్తుడు ఒకడు పండరీయాత్ర ప్రతిసంవత్సరము చేయువాడు. ఎనిమిది మాసములు పండరీపురమందు, మిగత నాలుగు మాసములు -- అషాఢము మొదలు కార్తీకమువరకు (జూలై - నవంబరు) -- గంగానది యెడ్డునను ఉండెడివాడు. సామాను మోయుటకొక గాడిదను, తోడుగా నొక శిష్యుని తీసికొని పోవువాడు. ప్రతి సంవత్సరము పండరీయాత్ర చేసికొని శిరిడీ సాయిబాబా దర్శనమునకై వచ్చెడివాడు. అతడు బాబాను మిగుల ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూచుచూ యిట్లనెడివారు: " వీరు పండరీనాథుని యవతారమే! అనాథల కొరకు, బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి!" గౌలిబువా విఠోబాదేవుని ముసలిభక్తుడు. పండరీయాత్ర యెన్ని సారులో చేసెను. వీరు సాయిబాబా పండరీనాథుని యవతారమని నిర్దారణ పరచిరి.

విఠలదేవుడు దర్శనమిచ్చుట

సాయిబాబాకు భగవన్నామస్మరణయందును. సంకీర్తనమందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడు "అల్లామాలిక్" -- అనగా, "అల్లాయే యజమాని" - అని యనుచుండెడివారు. ఏడు రాత్రింబగళ్ళు భగవన్నామస్మరణ చేయించుచుండెడివారు. దీనినే నామసప్తాహమందురు. బాబా ఒకప్పుడు దాసగణు మహరాజును నామసప్తాహము చేయుమనిరి. సప్తాహము ముగియునాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామసప్తాహమును సలిపెదనని దాసగణు జవాబిచ్చెను. బాబా తన గుండెపై చేయి వేసి " తప్పనిసరిగ దర్శనమిచ్చును గాని, భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలెను. డాకురునాథ్ యొక్క డాకూరు పట్టణము, విఠల్ యొక్క పండరీ పురము, శ్రీ కృష్ణుని ద్వారకా పట్టణము, ఇక్కడనే -- యనగా శిరిడీలోనే -- యున్నవి. ఎవరును ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడనే యున్నాడు. భక్తుడు భక్తిప్రేమలతో కీర్తించునప్పుడు విఠలుడిక్కడనే యవతరించును" అనెను.

సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడీ క్రీండి విధముగా దర్శనమిచ్చెను. స్నానానంతరము కాకాసాహెబు దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి గాన్పించెను. కాకా మధ్యహ్నహరతి కొరకు బాబా యొద్దకు పోగా తేటతెల్లముగా కాకాను బాబా యిట్లడిగెను. "విఠల్ పాటిల్ వచ్చినాడ?" నీవు వానిని జూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢముగా పట్టుకొనుము. ఏమాత్రము అ జాగ్రత్తగ నున్నను తప్పించుకొని పారిపోవును" ఇది ఉదయము జరిగెను. మధ్యహ్నము ఎవడో పటముల నమ్మువాడు 25,30 విఠోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చెను. అ పటము సరిగా కాకాసాహెబు ధ్యానములో చూచిన దృశ్యములో పోలియుండెను. దీనిని జూచి బాబా మాటలు జ్ఞాపకమునకు దెచ్చుకొని, కాకాసాహెబు అశ్చర్యానందములలో మునిగెను. విఠోబా పటమునొకటీ కొని పూజమందిరములో నుంచుకొనెను.

భగవంతరావు క్షీరసాగరుని కథ

విఠలపూజయందు బాబాకెంత ప్రీతియె భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది. భగవంతరవు తండ్రి విఠోబా భక్తుడు. పండరీ పురమునకు నియమముగ యాత్ర చేయుచుండెడివాడు. ఇంటి వద్ద కూడ విఠోబా ప్రతిమనుంచి దానిని పూజించువాడు. అతడు మరణీంచిన పిమ్మట వారి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్దమును మానెను. భగవంతరావు శిరిడీ వచ్చినప్పుడు, బాబా వాని తండ్రిని జ్ఞప్తికి దెచ్చుకొని: వీని తండ్రి నా స్నేహితుడు గాన వీని నిచ్చటకు ఈడ్చుకొని వచ్చితిని. వీడు నైవేద్యము ఎన్నడు పెట్టలేదు. కావును నన్నును విఠలుని కూడ అకలితో మాడ్చినాడు. అందుచేత వీని నిక్కడకు తెచ్చితిని. వీడు చేయునది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించునట్లు చేసెదను," అనిరి.

ప్రయాగ క్షేత్రములో దానుగణు స్నానము

గంగానది యమునానది కలియుచోటునకు ప్రయాగమని పేరు. ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము. అందుచేతనే వేలకొలది భక్తులు అప్పుడప్పుడచటికి పోయి స్నానమాడుదురు. దాసగణుకూడా ప్రయాగ పోయి అచ్చట సంగమములో స్నానము చేయవలెనని మనస్సున దలచెను. బాబా వద్దకేగి యనుమతించమనెను. ఆందుకు బాబా యిట్ల జవాచిచ్చెను. "అంతదూరము పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ యిచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపుము." ఇట్లనునంతలో నాశ్చర్యములన్నిటికంటె నాశ్చర్యకరమైన వింత జరిగినది. దాసగణు మహరాజ్ బాబా పాదములపై శిరస్సునుంచిన వెంటనే బాబా రెండుపాదముల బొటన వ్రేళ్ళనుండి గంగాయమునా జలములు కాలువలుగా పారెను. ఈ చమత్కారమును చూచి దాసగణు అశ్చర్యచకితుడయ్యాడు. భక్త్యావేశాలతో మైమరచాడు. కన్నులు అనందాశ్రువులతో నిండాయి. అతని హ్రదయంలో వుప్పొంగిన కవితావేశం శ్రీసాయిలీలగానరూపంలో పెళ్ళుకుబికింది.

బాబా అయెనిసంభవుడు; శిరిడీ మొట్టమొదట ప్రవేశించుట

సాయిబాబా తల్లిదండ్రులను గూర్చిగాని, జన్మము గూర్చిగాని జన్మస్థానము గుర్చిగాని యెవరికి ఏమియు తెలియదు. ఎందరో పెక్కుసారులీ విషయముల కనుగొనుటకు ప్రయత్నించిరి. పలుసార్లీ విషయముగ బాబాను ప్రశ్నించిరి గాని, యెట్టి సమాధానము గాని సమాచారము గాని పొందకుండిరి. నామదేవు, కబీరు, సామన్యమానవులవలె జన్మించియుండలేదు. ముత్యపుచిప్పలలో చిన్న పాపలవలె లభించిరి. నామదేవుడు భీమారథి నదితటమున గోణాయికి కనిపించెను. కబీరు భాగీరథినదీతటమున తమాలుకు కనిపించెను. అట్టిదే సాయిబాబా జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు బాబా పదునారేళ్ళ బాలుడుగా శిరిడీలోని వేపచెట్టు క్రింద నవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా గాన్పించెను. బాబా స్వప్నావస్థయందయినను ప్రపంచవస్తువులను కాంక్షించెడివారు కాదు. అయన మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. నానా చోప్ దారు తల్లి మిక్కిలి ముసలిది. అమె బాబా నిట్లు వర్ణించినది. " ఈ చక్కని చురుకైన కుఱ్ఱవాడు వేపచెట్టు క్రింద అసనములో నుండెను. శీతొష్ణములను లెక్కింపక యంతటి చిన్న కుఱ్ఱవాడు కఠినతపమాచరించుట సమాధిలో మునుగుట చూచి గ్రామస్థులు అశ్చర్యపడిరి. ఆ బాలుడు పగలు ఎవరితో కలసెడివాడు కాదు. రాత్రియందెవరికి భయపడువాడు కాడు. చూచినవారాశ్చర్య నిమగ్నులైయీ చిన్నకుఱ్ఱ వడిక్కడనుండివచ్చినాడని యడుగసాగిరి. అతని రూపు, ముఖలక్షణములు చాల అందముగనుండెను. చూచినవారెల్లరు ఒక్కసారిగ ముగ్ధులగుచుండిరి. ఆయన ఎవరి యింటికి పోకుండెను, ఎల్లప్పుడు వేపచెట్టు క్రిందనే కూర్చొనువాడు. పైకి చిన్నబాలునివలె గాన్పించినప్పటికిని చేతలను బట్టి చూడగా నిజముగా మహనుభావుడే. నిర్వ్యామోహము రూపుదాల్చిన యాతని గూర్చి యెవరికి నేమి తెలియకుండెను." ఒకనాడు ఖండోబా దేవుడొకని నావేశించగా నీ బాలుడెవడయి యుండునని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రు లెవరని, ఎచ్చటినుండి వచ్చినాడని యడిగిరి. అ ఖండోబా గణము యొక స్థలమును చూపి, గడ్డపారను దీసికొని వచ్చి యచ్చట త్రవ్వుమనెను. అట్లు త్రవ్వగా నందులో కొన్ని నిటుకలు, వాని దిగువ వెడల్పు రాయి యొకటి గాన్పించెను. ఆ బండను తొలగించగా క్రిందనొక సందు గాన్పించెను. అచ్చట నాలుగు దీపములు వెలుగుచుండెను. ఆసొరంగము ద్వారా ముందుకుపోగా నచ్చట నొక భూగృహము కాన్పించెను. అందులో గోముఖ్ నిర్మాణ‍ములు, కఱ్ఱ బల్లలు, జపమాలలు గాన్పించెను. ఈ బాలుడచ్చట 12 సంవత్సరములు తపస్సు నభ్యసించెనని ఖండోబా చెప్పెను. పిమ్మట కుఱ్ఱవాని నీ విషయము ప్రశ్నించగా, వారలను మరపించుచు అది తన గురుస్థానమనియు, వారి సమధి యచ్చట గలదు గావున దానిని కాపడవలెననియు చెప్పెను. వెంటనే దాని నెప్పటివలె మూసివేసిరి. అశ్వత్థ ఉదుంబర వృక్షములవలె నీ వేపచెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువాడు. మహల్సాపతి తదితర శిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధిస్థానమని భావించి సాష్టంగనమస్కారము చేసెదరు.

మూడు వసతిగృహములు

వేపచెట్టును, దాని చుట్టునున్న స్థలమును హరివినాయక సాఠే అనువాడు కొని సాఠేవాడాయను నొస పెద్ద వసతిగృహమును గట్టించెను. అప్పట్లో శిరిడీకి పోయిన భక్తమండలికిది యొక్కటియే నివాసస్థలము. వేపచెట్టు చుట్టు ఎత్తుగా అరుగు కట్టిరి. మెట్లు నిర్మించిరి. మెట్ల దిగువన నొకగూడు వంటిది గలదు. భక్తులు మండపముపై నుత్తారాభిముఖముగా కూర్చోనెదరు. ఎవరిచ్చట గురుశుక్రవారములు ధూపము వేయుదురో వారు బాబా కృపవల్ల సంతోషముతో నుండెదరు. ఈ వాడా చాల పురాతనమైనది. కావున మరమ్మతునకు సిద్దముగా నుండెను. తగిన మార్పులు మరమ్మతులు సంస్థానమువారు చేసిరి.

కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షీత్ వాడాయను పేర ఇంకొక వసతి గృహము కట్టబడినది. న్యాయవాదియైన కాకాసాహెబు దిక్షిత్ ఇంగ్లండుకు బోయెను. అచ్చట రైలు ప్రమాదమున కాలు కుంటుపడెను. అది యెంత ప్రయత్నించినను బాగు కాలేదు. తన స్నేహితుడుగు నానాసాహెబు చాందొర్కరు శిరిడీ సాయిబాబాను దర్శంచుమని సలహ యిచ్చెను. 1909వ సంవత్సరమున కాకా శిరిడీకి బోయెను. బాబా దర్శనమాత్రమున అమితానందభరితుడై శిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను. కాలు కొంటితనముకన్న తన మనస్సులోని కుంటితనమును తీసివేయుమని బాబాను ప్రార్దించెను. తన కొరకును, ఇతర భక్తులకును పనికి వచ్చునట్లు ఒకవాడాను నిర్మించెను. 10-12-1910వ తారీఖున ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి. అనాడె రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగెను. (1) దాదాసాహెబు ఖాపర్డేకు తన ఇంటికి బోవుటకు బాబా సమ్మతి దొరికెను. (2) చావడిలో శేజ్ (రాత్రి) అరతి ప్రారంభమయ్యను. దీక్షిత్ వాడా పూర్తికాగానే 1911వ సంవత్సరములో శ్రీరామనవమి సమయమందు శాస్ర్తోకముగా గృహప్రవేశము జరిపిరి.

తరువాత, కోటిశ్వరుడును నాగపూరు నివాసియునగు బూటీ మరియొక పెద్ద రాతి మేడను నిర్మించెను. అతడు చాలా ద్రవ్యము దీనికొరకు వెచ్చించెను. వెచించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్ధకమయ్యెను. ఏలయన బాబాగారి భౌతికశరీర మందులో సమాధి చేయబడినది. దీనినే సమాధిమందిర మందురు. ఈ స్థలములో మొట్టమొదట పూలతోట యుండెను. అ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్ళు పోయుట మొదలగునవి చేసెడివారు.

ఇట్లు మూడు వాడాలు (వసతి గృహములు) కట్టబడెను. అంతకు ముందిచ్చట ఒక్క వసతిగృహము కూడలేకుండెను. అన్నిటికంటె సాఠేవాడా మొదటి రోజులలో అందరికి చాలా ఉపకరించుచుండెను. శ్రీ సాయినాథాయ నమః నాలుగవ అధ్యాయము సంపూర్ణము సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు