శ్రీ సాయిసచ్చరిత్రము /నలుబదిరెండవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (నలుబదిరెండవ అధ్యాయము)



శ్రీ సాయిసచ్చరిత్రము నలుబదిరెండవ అధ్యాయము బాబా మహాసమాధిచెందుట 1. ముందుగా సూచించుట 2. రమచంద్ర దాదా పాటీల్; తాత్యాకోతే పాటీలుల చావులను తప్పించుట 3. లక్ష్మీబాయి శిందేకు దానము 4. చివరిదశ


ఈ అధ్యాయములో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణితము.

గత అధ్యాయములో చెప్పిన లీలలు, బాబా కృపయను కాంతిచే ఐహికజీవితమందలి భయము నెటుల త్రోసివేయగలమో, మోక్షమునకు మార్గము నెట్లు తెలిసికొనగలమో, మన కష్టములను సంతోషముగా నేట్లు మార్చగలమో చెప్పును. సద్గురుని పాదారవిందములను జ్ఞప్తియందుంచుకొనినచో మన కష్టములు నశించును. మరణము దాని నైజము కోలుపోవును. ఐహికదుఃఖములు నశించును. ఎవరయితే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీసాయి లీలలను జాగ్రత్తగ వినవలెను. అది వారి మనస్సును పావనము చేయును.

ముందుగా సూచించుట

చదువరు లింతవరకు బాబా జీవితకథలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధి ఎట్లు పొందిరో వినెదరుగాక. 1918 సెప్టెంబరు 28వ తేదిన బాబాకు కొంచెము జ్వరము తగిలెను. జ్వరము రెండుమూడు దినములుండెను. కాని ఆటుతరువాత బాబా భోజనము మానెను. అందుచేత క్రమముగా బలహీనులైరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరము అక్టోబర్ 15వ తేది మంగళవారము 2-30 గంటలకు బాబా భౌతీకశరీరమును విడిచిరి. ఈ విషయమును రెండు సంవత్సరములకు ముందె బాబా సూచించిరి గాని, యది యెవరికి బోధపడలేదు. అది యిట్లు జరిగెను. 1916 వ సం విజయదశమినాడు సాయంకాలము గ్రామములోని వారందరు సీమోల్లంఘన మొనర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠత్తుగా కోపోద్రిక్తులైరి. కఫనీ, లంగోటీ తీసి వానిని చించి ముందున్న ధునిలోనికి విసరివైచిరి. దీని మూలముగా ధుని యొక్కువగా మండజోచ్చెను. అ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరుడై నిలచి ఎఱ్ఱగా మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లు అరచెను. "ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో, మహమ్మదీయుడనో చెప్పుడు." అచటనున్న ప్రతివాడు గడగడ వణకిపోయెను. బాబా వద్దకు పోవుట కెవ్వరును సాహసించలేకపోయిరి. కొంతసేపటికి భాగోజీ శిందే (కుష్ఠురోగ భక్తుడు) ధైర్యముతో దగ్గరకు బోయి లంగోటీని కట్టి యిట్లనెను. "బాబా! సీమోల్లంఘనమునాడు ఇదంతయు నేమి?" ఈ రోజు నా సీమోల్లంఘనము." అనుచు బాబ సటకాతో నేలపై గొట్టెను. బాబా రాత్రి 11 గంటలవరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి యుత్సవము జరుగునో లేదో యని యందరు సంశయించిరి. ఒక గంట తరువాత బాబా మామూలు స్థితికి వచ్చెను. ఎప్పటివలే దుస్తులు వేసికొని చావడి యుత్సవమునకు తయారయ్యెను. ఈ విధముగా బాబా తాము దసరానాడు సమాధి చెందుదుమని సూచించిరి గాని యది యెవరికి అర్థము కాలేదు. దిగువ వివరించిన ప్రకారము బాబా మరియొక్క సూచన గూడ చేసిరి.

రామచంద్ర తాత్యాకోతే పాటీళ్ళ మరణము తప్పించుట

ఇది జరిగిన కొంతకాలము పిమ్మట రామచంద్ర పాటీలు త్రీవముగా జబ్బుపడెను. అతడు చాల భాధపడెను. అన్ని ఔషధములు ఉపయోగించెను గాని, అవి గుణము నివ్వలేదు. నిరాశ చెంది, చావుకు సిద్దముగా నుండెను. ఒకనాడు నడిరేయి బాబా యతని దిండువద్ద నిలచెను. పాటీలు బాబా పాదములు పట్టుకొని, "నేను నా జీవితముపై అశ వదలుకొన్నాను. నేనెప్పుడు మరణించెదనో దయచేసి చెప్పుడు" అనెను. దాక్షిణ్యమూర్తి యగు బాబా "నీ వాతురపడవద్దు, నీ చావు చీటి తీసివేసితిని! త్వరలో బాగుపడెదవు. కాని, తాత్యాకోతే పాటీలు గూర్చి సంశయించుచున్నాను. అతడు శక. సం 1840 (1918) విజయదశమినాడు మరణించును. ఇది యెవరికిని తెలియనీయకు వానికి కూడ చెప్పినచో మిక్కిలి భయపడును." అనిరి. రామచంద్ర దాదా జబ్బు కుదిరెను. కాని యతడు తాత్యా గూర్చి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగు లేదు కనుక తాత్యా రెండు సంవత్సరములలో మరణము చెందుననుకొనెను. దీనిని రహస్యముగా నుంచెను. ఎవరికిని తెలీయనీయ లేదు కాని, బాలాషింపికి మాత్రమే చెప్పెను. రామచంద్రపాటీలు బాలషింపి ఈ యిరువురు మాత్రమే తాత్యా గూర్చి భయపడుచుండిరి.

రామచంద్ర దాదా త్వరలో ప్రక్కనుండి లేచి నడువసాగెను. కాలము వేగముగా కదలిపోయెను. 1918 భాద్రపదము ముగిసెను. అశ్వయుజమాసము సమీపించుచుండెను. బాబా మాట ప్రకారము తాత్యా జబ్బుపడెను. మంచము బట్టెను. అందుచే బాబా దర్శనమునకై రాలేకుండెను. బాబా కూడ జ్వరముతో నుండెను. తాత్యాకు బాబాయందు పూర్తి విశ్వాసముండెను. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మియుండెను. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగము అధికమయ్యెను. అతడు కదలలేకపోయెను. ఎల్లప్పుడు బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి గూడ క్షీణించెను. విజయదశమి సమిపించుచుండెను. రామచంద్ర దాదాయు, బాలాషింపియు తాత్యాగూర్చి మిగుల భయపడిరి. వారి శరీరములు వణకుజోచ్చెను. శరీరమంతయు చెమటలు పట్టెను. బాబా నుడివిన ప్రకారము తాత్యా చావు దగ్గరకు వచ్చె ననుకొనిరి. విజయదశమి రానే వచ్చెను. తాత్యా నాడి బలహీన మయ్యెను. త్వరలొ ప్రాణము విడుచునని యనుకొనిరి. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్యా నిలచెను, అతని మరణము తప్పెను. అతనికి బదులుగా బాబా దేహత్యాగము చేసెను. వారిలో వారు మరణము మార్చుకొన్నట్లు గనిపించెను. బాబా తన ప్రాణమును తాత్యా కోసమర్పించెనని జనులనుకొనిరి. బాబా యెందుకిట్లు చేసెనో బాబాకే తెలియును. వారి కృత్యము లగోచరములు, ఇవ్విధముగా బాబా తమ సమాధిని సూచించిరి. తమ పేరుకు బదులు తాత్యా పేరు తెలిపిరి.

ఆ మరుసటి యుదయము అనగా అక్టోబర్ 16వ తేదిన పండరీ పురములో దాసగణుకు బాబా స్వప్నమున సాక్షాత్కరించి యిట్లనిరి. "మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాల చికాకు పెట్టిరి. కనుక ఆ స్థలమును విడిచి పెట్టినాను. ఈ సంగతి నీకు తెలియజేయుటకై వచ్చినాను. వెంటనే యక్కడకు పోమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే గప్పుము." శిరిడీనుంచి వచ్చిన ఉత్తరమువలన కూడ దాసగణుకీ సంగతి దెలిసెను. అతడు వెంటనే శిష్యులతో శిరిడీకి చేరెను. భజక కీర్తన ప్రారంభించెను. బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భవన్నామస్మరణ చేసెను. భగన్నామస్మరణ చేయుచు నొక చక్కని పువ్వుల హారమును స్వయముగా గ్రుచ్చి దానిని బాబా సమాధిపై వేసెను. బాబా పేరుతో అన్నదానము చేసెను.

లక్ష్మీబాయి శిందేకు దానము

దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభసమయము. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకొనుట మిగుల సవ్యముగా నున్నది. కొన్ని దినములనుండి వారి వ్యాధిగ్రస్తులుగా నుండిరి. లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా నుండిరి. చివరి సమయమప్పుడు హఠాత్తుగా ఎవరి సహయము లేకుండ, లేచి కూర్చుండి మంచిస్థితిలో నున్నట్లు గనపడిరి. అపాయస్థితి దాటినదని, బాబా కోలుకొనుచుండెనని యందరనుకొనిరి. తాము త్వరలో సమాధి చెందెదమని బాబాకు తెలియును, కాన లక్ష్మీబాయి శిందేకు కొంత ద్రవ్యము దానము చేయ నిశ్చయించుకొనిరి.

బాబా సర్వజీవవ్యాపి

ఈ లక్ష్మీబాయి శిందే ధనవంతురాలు, సుగుణవతి, రాత్రింబవళ్ళు అమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమందు భక్త మహల్సాపతి, తాత్యా, లక్ష్మీబాయి శిందే తప్ప తదితరులెవ్వరు మసీదులో కాలుపెట్టట కాజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యాతో కూర్చునియుండగా లక్ష్మీబాయి శిందే వచ్చి బాబాకు నమస్కరించెను. బాబా యిట్లనెను, "ఓ లక్ష్మీ! నాకు చాల అకలి వేయుచున్నది/" వెంటనే యామే లేచి "కొంచెము సేపాగుము. నేను త్వరలో రొట్టెను దీసికొని వచ్చెద" ననెను. అనిన ప్రకారము అమె త్వరగా రొట్టె, కూర తీసికొని వచ్చి బాబా ముందు పెట్టెను. బాబా దానిని అందుకొని యొక కుక్కకు వేసెను. లక్ష్మీబాయి యిట్లడిగెను. "ఇది యేమి బాబా! నేను పరుగెత్తుకొని నా చేతులార నీ కొరకు రొట్టె చేసితిని. నీవు దాని కొంచెమైనను తినక కుక్కకు వేసితిమి. అనవసరముగా నాకు శ్రమ కలుగజేసితివి." అందుకు బాబా యిట్లు సమాధానమిచ్చెను. "అనవసరముగా విచారించెదవేల? కుక్క యాకలి దీర్చుట నా యాకలి దీర్చుట వంటిది. కుక్కకు కూడ అత్మ గలదు. ప్రాణులు వేరు కావచ్చును. కాని అందరి యాకలి యొకటియే. కొందరు మాట్లాడగలరు. కొందరు మూగవానివలె మాట్లాడలేరు. ఎవరయితే యాకలితో నున్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగుము." ఇది చాలా చిన్న విషయముగాని, బాబా దాని వల్ల గొప్ప అధ్యాత్మికసత్యమును బోధించి, ఇతరుల కెట్టి బాధయు కలుగకుండ నిత్యజీవితములొ దానిని అచరణలో పెట్టుట ఎటులో చూపించిరి. అనాటినుంచి లక్ష్మీబాయి రొట్టెపాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని యెంతో ప్రేమతో తినుచుండెడివారు. అందులో కొంత తాను తిని మిగత రాధాకృష్ణమాయికి పంపుచుండెను. అమె బాబా భక్తశేషమునే యెల్లప్పుడు తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగా భవించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవులయందు గలడని తెలిసికొనగలము. బాబా సర్వవ్యాప్తి, చావుపుట్టుకలు లేనివారు, అమరులు.

బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తియందుంచుకొనిరి. అమెను మరచెదరెట్లు? బాబా తన భౌతికశరీరమును విడుచున్నప్పుడు, తన జేబులో చేయి పెట్టి యొకసారి 5 రూపాయలు, యింకొకసారి 4 రూపాయలు మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయి కిచ్చిరి. ఈ సంఖ్య 21వ అధ్యాయములోని నవవిధభక్తులను తెలియజేయును. లేదా ఇది సీమోల్లంఘన సమయమున నిచ్చు దక్షిణ యనుకొనవచ్చును. లక్ష్మీబాయి శిందే ధనవంతురాలగుటచే నామెకు ధనమవసరము లేదు. కనుక బాబా అమెకు ముఖ్యముగా నవవిధభక్తులను గూర్చి బోధించియుండవచ్చును. భాగవతము ఏకాదశస్కంధము దశమాధ్యాయములో అరవశ్లోకము పూర్వర్థమున, 5, ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడియున్నది. బాబా ఈ ప్రకారముగ మొదట 5, తదుపరి 4 మొత్తమున 9 రూపాయలు ఇచ్చెను. ఒక తొమ్మిదేకాక తొమ్మిదికి ఎన్నొ రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతిమీదగ వ్యయమైనవి. కాని బాబా యిచ్చిన ఈ తొమ్మిది రూపాయలు నామె యెన్నటికి మరువదు.

మిక్కిలి జాగరూకత మరియు పూర్ణచైతన్యము కలిగియుండు బాబా యువసానకాలమందు కూడ తగిన జాగ్రత్త పడెను. తన భక్తులపై గల ప్రేమానురగాముల యందు తగుల్కొనకుండునట్లు, వారందరిని లేచిపొమ్మనిరి. కాకాసాహెబు దీక్షిత్, బాపూసాహెబు బూటీ మొదలగువారు మసీదునందు అందోళనతో బాబాను గనిపెట్టుకొనియుండిరి. కాని బాబా వారిని వాడాకు బోయి భోజనము చేసి రండనిరి. వారు బాబాను విడువ లేకుండిరి; బాబా మాటలను జవదాటలేకుండిరి. మనస్సునందు ఇష్టము లేనప్పటికి వారు పొలేక పోలేక మసీదు విడిచి పోయిరి. బాబా స్థితి యపాయకరముగా నుండెనని వారికి తెలియును. కనుక వారు బాబాను మరవకుండిరి. వారి భోజనమునకు కూర్చుండిరే కాని వారి మనస్సు బాబాపై నుండెను. వారు భోజనము పూర్తి చేయక మునుపే బాబా తమ భౌతిక శరీరమును విడిచెనని వార్త వచ్చెను. భోజనములను విడచి యందరు మసీదుకు పరుగెత్తిరి. బయాజీ అప్పాకోతే పై బాబా దేహము ఒరిగి యుండెను. వారు నేలపైగాని తమ గద్దెపైగాని పడలేదు, తమ స్థలములో ప్రశాంతముగా గూర్చుండి తమ చేతితో దానము చేయుచు శరీరము విడిచిరి. యోగులు శరీరము ధరించి యేదో పనిమీద భూలోకమునకు వత్తురు. అది నేరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో యంత శాంతముగా వెళ్ళెదరు.


శ్రీ సాయినాథాయ నమః నలుబదిరెండవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు