శ్రీ సాయిసచ్చరిత్రము /అయిదవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (అయిదవ అధ్యాయము )



శ్రీ సాయిసచ్చరిత్రము అయిదవ అధ్యాయము చాంద్ పాటిల్ పెండ్లి బృందముతో కలసి బాబా తిరిగి శిరిడీ రాక; ’సాయి’యను నామము; ఇతర యోగులతో సహవాసము; పాదుకల చరిత్ర; మొహియొద్దీన్ తో కుస్తీ; జీవితములో మార్పు; నీళ్లను నూనెగా మార్చుట;జౌహర్ అలీ యను కపట గురువు పెండ్లివారితో కలసి బాబా తిరిగి శిరిడీ వచ్చుట

ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామము కలదు. అచ్చట ధనికుడగు మహమ్మదీయు డొకడుండెను. అతని పేరు చాంద్ పాటీలు. ఔరంగాబాదు పోవుచుండగా అతని గుఱ్ఱము తప్పిపోయెను. రెండుమాసములు వెదకినను దాని యంతు దొరకకుండెను. అతడు నిరాశచెంది భుజముపై జీను వేసుకొని ఔరంగాబాదునుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను. సుమారొక తొమ్మిది మైళ్ళు నడచిన పిమ్మట నొక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో నొక వింత పురుషుడు కూర్చొనియుండెను. అతడు తలపై టోపి పొడగైన చొక్కా ధరించియుండెను. చంకలో సటకా పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాంద్ పాటీలును జూచి, ఆతనిని బిలిచి చిలుము త్రాగి కొంత తడవు విశ్రాంతి గొనుమనెను. జీను గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకొనిన గుఱ్ఱముదని చాంద్ పాటిల్ బదులు చెప్పెను. అ దగ్గరలోనున్న కాలువ ప్రక్కన వెదకుమని ఫకీరు చెప్పెను. అతడచటకు పోయి గడ్డి మేయుచున్న గుఱ్ఱమును చూచి మిక్కిలి యాశ్చర్యపడెను. ఈ ఫకీరు సాధారణమనుజుడు కాడనియు గొప్ప ఔలియా(సిద్దపురుషుడు) అయియుండవచ్చు ననియు అనుకొనెను. గుఱ్ఱమును దీసికొని ఫకీరివద్దకు వచ్చెను. చిలుము తయారుగానుండెను. కాని చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసియుండెను. ఫకీరు సటకాను భూమిలోనికి గ్రుచ్చుగా నిప్పు వచ్చెను. మరల అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. ఫకీరు చ్చాపీ(గుడ్డ ముక్క) నా నీటితో తడిపి, నిప్పుతో చిలుమును వెలిగించెను. అటుల సిద్దమైన చిలుమును అ ఫకీరు తాను పీల్చి, తరువాత చాంద్ పాటిలు కందించెను. ఇదంతయు జూచి చాంద్ పాటీలు అశ్చర్యచకితుడయ్యెను. ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పాటీలు వేడెను. అ మరుసటిదినమే ఫకీరు పాటిలు ఇంటికి పోయి యచ్చట కొంతకాలముండెను. ఆ పాటీలు గ్రామమునకు మునసబు. అతని భర్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురది శిరిడీ గ్రామము. అందుచే కావలసిన సన్నహములన్నియు చేసికొని పాటిలు శిరిడీ ప్రయాణమయ్యెను. పెండ్లివారితో కలసి ఫకీరు కూడా బయలదేరెను. ఎట్టి చిక్కులు లేక వివాహ జరిగిపోయెను. పెండ్లివారు ధూప్ గ్రామము తిరిగి వెళ్ళిరి గాని ఫకీరు మాత్రము శిరిడీలో అగి, యచ్చటనే స్థిరముగా నిలిచెను.

ఫకీరుకు ’సాయి’ నామ మెట్లు వచ్చెను?

పెండ్లివారు శిరిడీ చేరగనే ఖండోబా మందిరమునకు సమీపమున నున్న భక్త మహల్సాపతిగారి పొలములో నున్న మఱ్ఱిచెట్టు క్రింద బస చేసిరి. ఖండోబామందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలో నున్నవారొకరి తరువాత నొకరు దిగిరి. ఫకీరు కూడ దిగెను. బండి దిగుచున్న యువ ఫకీరును జూచి భక్త మహల్సాపతి, "రండి సాయీ!" యని స్వాగతించెను. తక్కినవారు గూడ అయనను ’సాయి’యని పిలువనారంభించిరి. అది మొదలు వారు ’సాయిబాబా’గా ప్రఖ్యాతులైరి.

ఇతరయోగులతో సహవాసము

సాయిబాబా శిరిడీలో నొక మసీదులో నివాస మేర్పరచుకొనిరి. బాబా శిరిడీ రాక పూర్వమే దేవిదాసు అను యోగి శిరిడీలో ఎన్నొ సంవత్సరములనుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమున కిష్టపడెను. అతనితో కలసి కొంతకాలము మారుతీ మందిరములోను, చావడిలోను నుండెను. కొంతకాల మొంటరిగా నుండెను. ఆంతలో జానకీదాసు గోసావి అను నింకొక యోగి యచ్చటకు వచ్చెను. బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండెడివారు లేదా, బాబా ఉండు చోటుకు జానకీదాను పోవుచుండెను. అటులనే, పుణతాంబే నుండి యొక వైశ్యయోగి శిరిడీ వచ్చుచుండెడివాడు. అయన గృహస్థుడు. పేరు గంగాగీరు. ఒకనాడు, బాబా స్వయముగా కుండలతో నీళ్ళు తెచ్చి పూలచెట్లకు పోయుచుండుట జూచి అతడుశిరిడీ గ్రామస్థులతో నిట్లనెను. " ఈ మణి యిచ్చటుండుచే శిరిడి పుణ్యక్షేత్రమైనది. ఈయనీ నాడు కుండలతో నీళ్ళు మోయుచున్నడు. కాని యితడుసమాన్యమానవుడు కాడు. ఈ నేల నిజముగ పుణ్యముచేసికొనినది. కనుకనే సాయిబాబా యను నీ మణిని రాబట్టుకొనగలిగెను." ఏవలా గ్రామములో నున్న మఠములో అనందనాథుడను యోగిపుంగవుడుండెను. అతడు అక్కల్ కోటకర్ మహరాజ్ గారి శిష్యుడు. అతడొకనాడు శిరిడీ గ్రామనివాసులలో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను జూచి యిట్లనెను. " ఈయన యొక యమూల్యమైన రత్నము సామాన్యమానవుని వలె గాన్పించునప్పటికిని ఈయన మామూలు రాయివంటీవాడు కాదు. ఈయనొక యమూల్య వజ్రము. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు." ఇట్లనుచు అనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళెను. ఇది సాయిబాబా యౌవ్వనము జరిగిన సంగతి.

బాబా దుస్తులు - వారి నిత్యకృత్యములు

యౌవనమునందు బాబా తమ తలవెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను. పహిల్వానువలె దుస్తులు వేసికొనెడివారు. శిరిడీకి మూడు మైళ్ళ దూరములో నున్న రహతాకు పోయినప్పుడొకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసికొనివచ్చి నేలను చదను చేసి, వానిని నాటి, నీళ్ళు పోయుచుండిరి. అనుదినము వామన్ తాత్యాయను కుమ్మరి బాబాకు కాల్చిని రెండు పచ్చి కుండలను ఇచ్చుచుండెడెవాడు. బాబా స్వయముగ బావి నుండి నీళ్ళు చేది, ఆ నీటిని అ పచ్చి కుండల్లో తోడి, భుజమపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసెడివారు. సాయంకాలము అ కుండలను వేపచెట్టు మొదట బోర్లించుచుండిరి. కాల్చనివగుటచే అవి వేంటనే విరిగి ముక్కలు ముక్కలగుచుండెడివి. ఇట్లు మూడు సంవత్సరములు గడిచెను. సాయిబాబా కృషివలన అచ్చట నొక పూలతోట లేచెను. అ స్థలములోనే యిప్పుడు బాబా సమాధి యున్నది. దానినే సమాధి మందిర మందురు. దానిని దర్శించుట కొరకే యనేకమంది భక్తులు విశేషముగా పోవుచున్నారు.

వేపచెట్టు క్రిందనున్న పాదుకలు వృతాంతము

అక్కల్ కోటకర్ మహరాజ్ గారి భక్తుడు భాయికృష్ణజీ అలీబాగ్ కర్. ఇతడు అక్కల్ కోటకర్ మహరజ్ గారి చిత్రపటమును పూజించెడివాడు. అతడోకప్పుడు షోలాపూరు జిల్లాలోని అక్కల్ కోట గ్రామమునకు పోయి, మహరాజ్ గారి పాదుకలు దర్శించి పూజించవలెనని యనుకొనెను. అతడచ్చటికి పోకమునుపే స్వప్నములో అ మహరాజ్ దర్శనమిచ్చి యిట్లు చెప్పెను: "ప్రస్తుతము శిరిడి నా నివాసస్థలము. అచ్చటికి పోయి నీ పూజ యొనరింపుము !" అందుచే, అక్కల్ కోట పోవలెనను తన నిర్ణయమును మార్చుకొని భాయికృష్ణజీ శిరిడి చేరి, బాబాను పూజించి, అచ్చటనే అరు మాసములు అనందముతో గడిపెను. దీని జ్ఞాపకార్దము పాదుకలు చేయించి శ్రావణమాసములో నొక శుభదినమున వేపచెట్టుక్రింద ప్రతిష్ఠ చేయించెను. ఇది శక సం 1834, శ్రావణ మాసములో (అనగా, క్రీ.శ. 1912లో) జరిగెను. దాదాకేల్కర్, ఉపాసనీబాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి. దీక్షీత్ యను బ్రాహ్మణుడు పాదుకల నిత్యపూజకు నియమింపబడెను. దీనిని పర్యవెక్షించు బాధ్యత భక్త సగుణ్ మేరు నాయక్ నకప్పగించబడినది.

ఈ కథయొక్క పూర్తి వివరములు

ఠాణే వాస్తవ్యుడైన శ్రీ బి.వి.దేవు బాబాకు గొప్ప భక్తుడు. వీరు మామల్తదారుగా పదవీ విరమణ చేసిరి. వేపచెట్టు క్రింద ప్రతిష్ఠింపబడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నియు సగుణ్ మేరు నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షిత్ ల నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతము, శ్రీ సాయిలీల మాసపత్రిక రెండవ సంపుటము మొదటి సంచిక, 25వ పేజీలో నీరీతిగా ప్రచురించినారు.

1912వ సంవత్సరములో బొంబాయినుండి డాక్టరు రామారావు కొఠారెయను నతడు శిరిడి వచ్చెను. వాని తో బాటుగ అతని కంపౌండర్‍ను, మరియు అతని మిత్రుడైన భాయికృష్ణజీ అలీబాగ్ కర్ అనునతడును వెంటవచ్చిరి. శిరిడీలో వారు సగుణ్ మేరు నాయక్ కు జి.కె.దీక్షిత్ కు సన్నిహితులైరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకొనునప్పుడు సంభాషణ వశాత్తూ, బాబా ప్రప్రథమమున శిరిడీ ప్రవేశించి వేపచెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్ధము బాబా పాదుకలు ఆ వేపచెట్టు క్రింద ప్రతిష్ఠించవలెనని నిశ్చయించుకొనిరి. పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి. ఈ సంగతి దాక్టరు రామారావు కొఠారేకు దెలిపినచో అయన చక్కని పాదుకలు చెక్కించెదరని భాయికృష్ణజీ మిత్రుడైన కంపౌండర్ సలహనిచ్చెను. అందరును యీ సలహకు సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టరుగారికి ఈ విషయము తెలియపరచిరి. వారు వెంటనే మరల శిరిడీ వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి. ఖండోబా మందిరమందున్న ఉపాసనీ మహరాజ్ వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమునాను జూపిరి. శ్రీ ఉపాసనీ దానిలో కొన్ని మార్పులను జేసి, పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి, బాబా యోగశక్తిని వేపచెట్టు గొప్పతనమును దెలుపు యీ క్రిండి శ్లోకమును కూడ చెక్కించమనిరి.

సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధా స్రావిణం తిక్తమష్యప్రియం తమ్ తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్

ఉపాసనీ సలహల నామోదించి పాదుకలు బొంబాయిలో చేయించి, కంపౌండరు ద్వారాపంపిరి. శ్రావణ పౌర్ణమినాడు స్థాపన చేయుమని బాబా యాజ్ఞాపించెను. అ నాడు 11 గంటలకు జి.కె.దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకొని ఖండోబా మందిరమునుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి. బాబా యాపాదుకలను స్పృశించి, అవి భగవంతుని పాడుకలని నుడివెను. వానిని వేపచెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని యాదేశించెను.

అ ముందురోజు బొంబాయి నుండి పాస్తాసేట్ యను పార్సీ భక్తుడొకడు మనియార్డరు ద్వారా 25 రూపాయలు పంపియుండెను. బాబా యాపైకము పాదుకాప్రతిష్ఠకగు ఖర్చు నిమిత్తమిచ్చెను. మొత్తము 100 రూపాయలు ఖర్చయినవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి. మొదటి 5 సంత్సరములు జి.కె.దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేసెను. తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ జాఖ్ డ్ యను బ్రాహ్మణుడు (నానుమామా పూజరి) పూజ చేయుచుండెను. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయలు చొప్పన డాక్టర్ కొఠారె దీపపు కార్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకల చుట్టు కంచెకూడ పంపెను. ఈ కంచెయు పైకప్పును కోపర్ గాం స్టేషన్ నుండి శిరిడీ తెచ్చుటకు 7-8-0 ఖర్చు సగుణ్ మేరు నాయక్ ఇచ్చెను (ప్రస్తుతము జాఖ్ డె పూజ చేయుచున్నాడు. సగుణుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నడు.)

మొట్టమొదట భాయికృష్ణజీ, అక్కల్ కోటకర్ మహరాజ్ భక్తుడు. 1912వ సంవత్సరములో వేపచెట్టు క్రింద పాదుకలు స్థాపించునప్పుడు అక్కల్ కోటకు పోవుచు మార్గమద్యమున శిరిడీయందు దిగెను. బాబా దర్శనము చేసిన తరువాత అక్కల్ కోట గ్రామమునకు పోవలెనుకొని బాబావద్దకేగి యనుమతి నిమ్మనెను. బాబా యిట్లనెను. "అక్కల్ కోటలో నేమున్నది? అక్కడకేల పోయెదవు? అక్కడుండే మహరాజ్ ప్రస్తుతమిక్కడనే యున్నారు. వారే నేను." ఇది విని భాయికృష్ణజీ అక్కల్ కోట వెళ్ళుట మానుకొనెను. పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు శిరిడీ యాత్ర చేసెను.

హేమాడ్‍పంతునకీ వివరములు తెలిసియుండవు. తెలిసియున్నచో సచ్చరిత్రలో వ్రాయుట మానియుండరు.

మొహియొద్దీన్ తో కుస్తీ; జీవితములో మార్పు

శిరిడీ గ్రామములో కుస్తీల్ పట్టుట వాడుక. అచ్చట మెహియొద్దీన్ తాంబోళి యనువాడు తరుచుగా కుస్తీలు పట్టుచుండెడివాడు. వానికి బాబాకు ఒక విషయములో భేదాభిప్రాయము వచ్చి కుస్తీ పట్టిరి. అందులో బాబా యోడిపోయెను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను, నివసించు రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకొని, (ఫకీరులు ధరించు) పొడవాటి చొక్కా (కఫ్నీ) ని తొడిగికొని, నెత్తిపైని గుడ్ద కట్టుకొనేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునెదివారు. చింకిగుడ్డలతో సంతుష్టి చెందెడివారు. రాజ్యభోగముకంటె దారిద్ర్యమే మేలని నుడివెడువారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు. గంగాగీరుకు కూడ కుస్తీలయందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా యతనికి వైరాగ్యము కలిగెను. అదే సమయములో దెహమును దమించి, దేవుని సహవాసము చేయమ’ ని యొక యశరీరవాణీ యతనికి వినిపించెను. అప్పటీనుండి గంగాగీరు సంసారము విడిచెను. అత్మసాక్షాత్కారము కొరకు పాటుపడెను. పుణాతాంబే దగ్గర నది యొడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను.

సాయిబాబా జనులతో కలసిమెలసి తిరిగెడివారు కారు; ఎవ్వరితోను తమంతటతాము మాట్లాడెడివారు కారు. ఎవరైన యేదైన అడిగిన యాయడిగినదానికి మాత్రము జవాబిచ్చువారు. దినములో యెక్కువ భాగము వేపచెట్టునీడయందు, అప్పుడప్పుడు యూరవతలనున్న కాలువ యొడ్డునగల తుమ్మచెట్టు నీడను కూర్చొనెడివారు. సాయంకాల మూరకనే కొంతదూరము నడిచెడివారు; ఒక్కొక్కసారి నీమ్ గాం పోవుచుండెడివారు. నిమ్ గాంలో బాబాసాహెబ్ త్ర్యంబక్ జీ డేంగలే యనునతని యింటికి తరుచుగా పోవువారు. బాబాసాహెబ్ త్ర్యంబక్ డేంగలే యందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబు. అతడు రెండు వివాహములు చేసికొన్నను సంతానము కలుగలేదు. బాబాసాహెబు డేంగలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపెను. బాబా యనుగ్రహముచే నానాసాహెబునకు పుత్రసంతానము కలిగెను. అప్పటినుంచి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. వారి కీర్తి యంతటను వెల్లడి యాయెను. అహమద్ నగరు వరకు వ్యాపించెను. అక్కడనుంచి నానాసహెబు చాందోర్కరు, కేశవ్ చిందబర్ మొదలుగాగల యనేకమంది శిరిడీ వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తు చుట్టియుండెడివారు. రాత్రులందు బాబా పాడుపడిన పాతమసీదునందుశయనించుచుండెను. పొగపీల్చుకొను ’చిలిం’ గొట్టం, కొంతపొగాకు, ఒక రేకు డబ్బా, కప్నీ, తలగుడ్డ, ఎల్లప్పుడు దగ్గరనుంచుకొను ’సటకా’ (చిన్న చేతికర్ర) మాత్రమే అప్పటిలో అయనకున్న సామానులు. తలపై నొక గుడ్డను చుట్టి, దాని అంచులను జడవలె మెలిబెట్టి ముడివేసి, యెడమచెవిపై నుంచి వెనుకకు వ్రేలాడునట్లు వేసుకొనువారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతుకకుండ నుంచువారు. చెప్పలను తోడిగేవారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చొనేవారు. (కఫ్నీ క్రింద) లంగోటీ కట్టుకొనెడివారు. చలిని కాచుకొనుటకు ధుని కెదురుగా (మసీదు ఈశాన్యభాగములో గల) కొయ్య చేపట్టుపై తమ యెడమచేతినానించి, దక్షిణాభిముఖముగా కూర్చునేవారు. అ ధునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను అహుతి చేసి ’ అల్లాయే యాజమాని’ అని పలికేవారు. మసీదులో రెండు గదుల స్థలము మాత్రముండెను. భక్తులందరు అచటనే బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును మరామతు చేసి నేలపైన నగిషీరాళ్ళు తాపన చేసిరి. బాబా యీ మసీదుకు రాకపూర్వము ’తకియా’ (రచ్చ)లో చాలాకాలము నివసించిరి. బాబా తమ కాళ్ళకు చిన్న గజ్జలు కట్టుకొని సొగసుగా నాట్యము చేసేవారు; భక్తి పూర్వకమయిన పాటలు పాడేవారు.

నీళ్లను నూనెగా మార్చుట

సాయిబాబాకు దీపములన్న చాల యిష్టము, ఊరిలో నూనెను విక్రయించు షాహుకార్లను నూనె యడిగి తెచ్చి మసీదునందు రాత్రియంతము దీపములను వెలిగించు చుండేవారు. కొన్నాళ్ళు ఇట్లు జరిగెను. ఒకనాడు నూనె ఇచ్చు దుకాణాదారులందరు కూడబలుకుకొని బాబాకు నూనే ఇవ్వకూడదని నిశ్చయించిరి. బాబా వారి దుకాణములకు ఎప్పటివలె పోగా నూనె లేదనిరి. బాబా కలత జెందక వట్టి వత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టియుంచెను. నూనెవ్యాపారులు అసక్తితో నిదంతయు గమనించు చుండిరి. అడుగున రెండుమూడు నూనెచుక్కలు మిగిలియున్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలియబెట్టి, అ నీటిని త్రాగివేసిరి. ఈ విధముగా యా రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట, మరల డబ్బాతో నీరు తీసికొని, యా నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణాదారులు విస్మయమొందునట్లు ప్రమిదలన్నియు తెల్లవారుదాక చక్కగా వెలుగుచుండెను. ఇదంతయు జూచి యా షాహుకార్లు పశ్చాత్తాపపడి,బాబాను మన్నింపు కోరిరి. బాబా వారిని క్షమించి, ఇకపైనైనను సత్యము నంటిపెట్టుకొనుడని హితవు చెప్పి పంపివేసిరి.

జౌహర్ అలీ యను కపట గురువు

పైన వివరించిన కుస్తీ జరిగిన యయిదేండ్ల తరువాత అహమదునగరు నుండి జౌహర్ అలీ యను ఫకీరొకడు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్రమందిరమునకు సమీపమున నున్న స్థలములో దిగెను. అ ఫకీరు బాగా చదువుకొన్నవాడు, ఖురానంతయు వల్లించగలడు, మదురభాషణుడు. అ యూరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానించుచు గౌరవముతో చూచుచుండెడి వారు. వారి సహయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ’ఈద్ గా’ యను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండుగనాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్దించు గోడయే ’ఈద్ గా’. ఈ విషయములో వివాదములేచి, అది ఘర్షణలకు దారితీసెను. దానితో జౌహర్ అలీ రహతా విడిచి, శిరిడీచేరి, బాబాతో మసీదునందుండసాగెను. ప్రజలు వాని తీపిమాటలకు మోసపోయిరి. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా యందుల కడ్డు చెప్పక శిష్యునివలెనే మసలుకొనెను. తరువాత గురుశిష్యులిద్దరు రహతాకు పోయి యచ్చట నివసించుటకు నిశ్చయించుకొనిరి. గురువునకు శిష్యుని శక్తి యేమియు తెలియకుండెను. శిష్యునికి మాత్రము గురువుయొక్క లోపములు బాగా తెలియును. అయినప్పటికి బాబా అ కపట గురువునెప్పుడు ఆ గౌరవించక శిష్యుధర్మమును శ్రద్థగా నెరవేర్చుచుండెడివారు, అప్పుడప్పుడు వారిరువురు శిరిడీకి వచ్చి పోవుచుండెడివారు కాని అధికముగా రహతాలోనే నివసించేవారు. శిరిడీలోని సాయిభక్తులకు బాబా అ విధముగా రహతాలో నుండుట ఎంతమాత్ర మిష్టములేకుండెను. అందుచే వారందరు కలసి సాయిబాబాను మరల శిరిడీకి పిలుచుకొనివచ్చుటకు రహతా వెళ్ళీరి. వారు రహతాలో ఈద్ గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి శిరిడీ తీకొనిపోవుటకై వచ్చినామని చెప్పిరి. జౌహర్ అలీ ముక్కొపి యనీ, అయనతనను విడిచిపెట్టడనీ అందువలన వారు తన యందు అశ విడిచి, ఫకీరు అక్కడకు వచ్చులోపల, శిరిడీ మరలివెళ్ళుట మంచిదని బాబా వారికి సలహ ఇచ్చెను. వారిట్ల మాట్లాడుకొనుచుండగా, జౌహర్ అలీ అక్కడకు వచ్చి, బాబాను తీసికొని పోవుటకు ప్రయత్నించుచున్న శిరిడి ప్రజలపై మండిపడెను. కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురుశిష్యులిద్దరూ తిరిగి శిరిడీ పోవుటకు నిర్ణయమైనది.

వారు శిరిడీ చేరి యచ్చటనే నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవిదాను అ కపటగురువును పరీక్షీంచి యతని బండారము బయటబెట్టెను. చాంద్ పాటిల్ పెళ్ళి బృందముతో బాబా శిరిడీ వచ్చుటకు 12 సంవత్సరముల ముందే పదిపన్నెండేళ్ళ వయసులో దేవిదాసు శిరీడీ చేరెను. వారు మారుతి దేవాలయములో నుండేవారు. దేవిదాను చక్కని అంగసౌష్టవము, తేజోవంతములైన నేత్రములు కలిగి, నిర్వ్యామోహితావతారమువలె జ్ఞానివలె కనపడుచుండెను. తాత్యాపాటీలు, కాశీనాథ్ షింపీ మొదలుగాగల యనేకమంది దేవీదాను తమ గురువుగా భావించెడివారు. వారు జౌహర్ అలీని దేవిదాను వద్దకు తీసికొనివచ్చిరి. వారి మధ్య జరిగిన వాదములో జౌహర్ అలీ చిత్తుగా యోడిపోయి, శిరిడీ నుండి పలాయానము చిత్తగించెను. అ తరువాత యతడు వైజాపూరులో నుండి, చాల యేండ్ల తరువాత శిరిడీ తిరిగి వచ్చి బాబా పాదములపై బడెను. తాను గురువు, సాయిబాబా శిష్యుడను భ్రమ వాని మనస్సునుండి తొలిగి, తన ప్రవర్తనకు పశ్చాత్తపడెను. సాయిబాబా వానిని యథారీతి గౌరవముగానే చూచెను. ఈ విధముగా శిష్యుడు గురువునెట్లు సేవింపవలెనో, యెట్ల అహంకారమమకారములను విడిచి గురుశుశ్రూష చేసి తుదకు అత్మసాక్షాత్కారమును పొందవలెనో బాబా అచరణాత్మకముగ నిరూపించెను. ఈ కథ భక్తమహల్సాపతి చెప్పిన వివరముల యాధారముగ వ్రాయబడినది. శ్రీ సాయినాథాయ నమః అయిదవ అధ్యాయము సంపూర్ణము సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు