శివపురాణము/ఉమా ఖండము/శుంభ నిశుంభుల వథ

వికీసోర్స్ నుండి

సజ్జన సాధుపుంగవుల్ని హింసించడం రాక్షసులకు జన్మతో వచ్చిన విద్య గదా! దేవతాముని జనాదుల్ని నానాపాట్లూ పెట్టే శుంభ నిశుంభుల ధాటి కోపలేక దేవతలంతా కైలాసం చేరుకున్నారు.

ఆ రక్కసిద్వయం పీచమణచడానికే, 'కౌశికి'ని ఆవిర్భవింపజేసి ఉంచిన విధాత, ఆమె కాళీ అవతారమూర్తి కనుక అమెను మాతంగిగా ఆరాధించ వలసిందని దేవతలకు సూచించాడు.

అంతా భక్తిశ్రద్ధలతో ఆమెను అలాగే కొల్చారు. వారిపట్ల సుప్రసన్నయై, ఆ కదంబనవాసిని ధైర్యం చెప్పి కరుణ కురిపించింది.

తక్షణం అక్కడ మాయమై రక్కసిద్వయ నగరపొలిమేరల్లో జగదేక సుందరిగా రూపుదాల్చింది. ఆమె రూపలావణ్యాలకు కళ్ళు చెదిరిన చండ ముండులనే రాక్షసులు ఆ వార్త శుంభ నిశుంభులకు చేరవేయ్యనిదే ఉండలేకపోయారు.

అంతటి జగదేకసుందరిని పొందితీరని బ్రతుకు వ్యర్ధం అన్నట్లు ఆమె అంద చందాల్ని వర్ణించడంతో, క్రమంగా వారిలో పట్టుదల పెంచారు. అలాగే జరుగుతుందని, అంబకీ తెలుసు! అంతేకాదు! వాళ్ల వద్ద నుంచి దూతలు వచ్చి - తనను రమ్మంటారనీ ఆ ఆమ్మకు తెలుసు!

అలావచ్చిన దూతలతో "నాకో ప్రతిజ్ఞ వున్నది. యుద్ధంలో నన్ను గెలిచిన వాళ్లని తప్ప, ఇతరుల్ని పెళ్లాడను నేను. చేవ వుంటే యుద్ధానికి రమ్మని మీ వాళ్ళకు చెప్పు!" అన్నది అమ్మ.

తమనొక కుమారి ఆ విధంగా సవాలుచేయడమా అనే గర్వంతో "ఆ పిల్లకి మన తడాఖా తెలీనట్లుంది. ఓరీ ధూమ్రాక్షా! మాయచేసి ఐనా సరే! ఆ కన్నెను లాక్కురా!" అని ఆజ్ఞచేశాడు నిశుంభుడు.

ధూమ్రాక్షుడు ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త చర్యగా సైన్య సమేతుడై వెళ్లాడు - అక్కడకు.

సైన్యంతో సహా ధూమ్రాక్షుడ్ని కేవలం తన హుంకార ధ్వనితో బూడిదగా మార్చి నిశుంభుని పురానికి పంపింది కౌశికి. ఆ విధంగా ఒక రక్కసి మూక నంతటినీ ధూళిలో కలిపేసినందు వల్ల ఆవిడకు 'ధూమావతి' అనే పేరు సార్థకమైంది. శత్రువుల్ని నామ రూపాల్లేకుండా మట్టుబెట్ట దలచినవారు ధూమావతిని ఆరాధిస్తారు. అనగా ఆమెను ఉపాసించు వారికి శత్రుభయం ఉండదు.

ధూమ్రాక్షుడ్నే వధించిందంటే, ఆమె సుకుమారి అయివుండదని - ఏ దైవ మాయాశక్తో అయివుంటుందని గ్రహించుకున్న నిశుంభుడు మెరికల్లాంటి రాక్షసవీరులను ఏరి, ఆమె పైకి యుద్ధానికి పంపాడు.

చండ, ముండ, రక్తబీజాదులు కూడా ఆమె ధాటికి మరణించారు.

కాలకేయాది మహావీరుల్ని వెంటబెట్టుకుని అన్నదమ్ములిద్దరూ కదనానికి కదిలారు.

వారిని చూస్తూనే కౌశికి వింటినారి సంధించింది. పెనుఘోషతో ధనుష్టంకారం చేసింది.

అంతవరకూ కేవలం ఆమె సోయగాలను విని మాత్రమే ఉన్న శుంభ నిశుంభులు, ప్రత్యక్షంగా అప్పుడు చూశారు ఆమెను.

నిజమే! ఆవగింజంతయినా తమవాళ్లు అతిశయోక్తి చెప్పలేదు. 'ఇటువంటి పిల్లతోనా మారణక్రీడ?'...అలా అనుకున్న తక్షణం, యుద్ధ సన్నద్ధులై వచ్చికూడా - "పిల్లవు! మాతో పోరుకంటే పొందు నీకులాభం! వచ్చి శరణుకోరి శయ్యాగృహం చేరు. సుఖించు - సుఖపడు!" అని మెల్లమెల్లగా నచ్చజెప్ప జూశారు.

"పిరికిపందల్లారా! ఇంత సైన్యాన్ని తెచ్చుకొని కూడా ఇంకా దీనాలాపాలు ఏల? సత్తావుంటే సమరంలో చూపండి! ముందే చెప్పినట్లుగా, నన్ను యుద్ధంలో ఓడిస్తే నేను ఇంకెక్కడికి పోగలను?" అనేసరికి, పౌరుషం పొడుచుకొచ్చిన శుంభ నిశుంభు లిద్దరూ వివిధ ఆయుధాల్ని ఆమెమీద ప్రయోగించారు. అన్నీ ఆమె శరపరంపర ముందు నుగ్గునుగ్గు అయిపోయాయి.

ఇక - చివరగా తన దగ్గర మిగిలినదీ అజేయమైనదీ అయిన గదాయుధాన్ని ప్రయోగించాడు నిశుంభుడు. కౌశికి త్రిశూలం ప్రయోగించింది - అందుకు ప్రతిగా. అది, గదను పడగొట్టి నిశుంభుడిని రెండుగా చీల్చుకుంటూ వెళ్లిపోయింది.

హాహాకారాలతో రాక్షసులు విషణ్ణ వదనులు కాగా, సోదరుడిని కోల్పోయిన క్రోధం తన కళ్లకు మరింత జ్వలితం చేయగా శుంభుడు విరుచుకు పడ్డా డామెమీద.

శుంభుని దగ్గర ఇంతకాలం అజేయంగా ఉన్న ఖడ్గాన్ని తుత్తునియలు చేసి, తన శూలాయుధ ప్రయోగంతో శుంభుని తలను కూడా ఎగుర మీటింది అమ్మవారు. శుంభ నిశుంబుల వధ పూర్తయింది.