మహాపురుషుల జీవితచరిత్రములు (ప్రథమ సంపుటము)/మహా అలగ్జాండరు

వికీసోర్స్ నుండి



మహా అలగ్జాండరు

మహా ఆంగ్జాండరు 'హెర్క్యులీస్‌'యొక్క సంతతి వాఁడు. కాని తండ్రి 'ఫిలిప్'; తల్లి 'ఒలింపియస్‌'. చిన్న తనములోనే వీరొకరినొకరు ప్రేమించినందునఁ గాలమువచ్చిన తరువాత వారు వివాహముఁ జేసికొనిరి. కామశాస్త్రము నుపదేశమును బొందుటకు పూర్వము తన గర్భముమీఁద పిడుగుపడి రగులుకొని మంటలు జాజ్వల్యమానముగా నలు దెసల న్యాపించినటుల 'ఒలింపియసు' కలఁగనెను. వివాహాసంతరమున రాజపత్నిగర్భము సింహముద్రాంకితము చేసి నటుల 'ఫిలిప్పు'కు స్వప్నము వచ్చెను. పరిపంధి, రాజచక్రంబుమీద ననక్రపరాక్రమమున సింహంబు కరణి లంఘించి, 'సముద్ర మేఖలానలయిత్వభూచక్రంబు నిర్వక్రంబుగ నధిరోహించుటకుఁ దగిన పుత్రుఁడు కలుగునని జ్యోతిష్కులు స్వప్న ఫలమును 'ఫిలిప్పు'తోఁ జెప్పిరి. అలగ్జాండరు క్రీ. పూ. 356 సం: రము జూలై నెల 6. తేదీని జననమొందెను. ఆ రోజుననే 'ఎఫీషన్‌'లోని 'డయానా' యను పేరుగల చంద్రదేవతయొక్క యాలయము తగులఁబడెను. అక్కడి భక్తులంద ఱీ యాదిభౌతకాధికి వెఱగంధి, చిందఱ వందఱ పడిరి. ఫిలిప్పు 'పోటీడయా' పట్టణమును ముట్టడించి దానిని పట్టుకొనినరోజున మువ్వురు హర్కారాలు రాజధానినుండి సుఫుత్రజననవార్త నతనికిఁ దెచ్చిరి. అతని సేనానాయకుఁడు పోరాటములో జయమునొందెననియు, నతని పంచభద్రము 'ఒలింపికు' క్రీడలలో పందెము గెలిచెననియు సుపుత్రుఁడు కలిగెననియు, మూఁడు శుభవార్తల నతఁడు విని, 'పులకించి, చోద్యమంది, యుబ్బి' చెల రేగెను. శిశువునకు 'అలగ్జాండరు' అనెడు నామకరణమును దండ్రి చేసెను.

దినదిన ప్రవర్ధమానముగ మహాపురుషలక్షణములు కలిగి, యతనికి యౌవన ప్రాదుర్భావమయ్యెను. యుక్తకాలమున నతఁడు తగిన యొజ్జలయొద్దఁ బ్రవేశించి విద్యాభ్యాసముఁ జేసెను. రాజకుమారునకుఁ దగిన దేహ మనోసంస్కారముల నతఁడు పొందెను. తండ్రి శత్రువులపై దండెత్తి వెళ్లినపుడు సాం కేతస్థలమున ప్రధానులతో నతఁడు మంతనముఁ జేయుచుండెను. ప్రభు మంత్రోత్సాహ శక్తులను గలిగి దురవగాహమైన గాంభీర్య ధైర్యస్థైర్య జేగీయమానసుండై, భృత్యామాత్య సుహృద్బంధువర్గంబులో నతఁ డనన్యాదృశంబుగ సంచరించెను. 'దళములు దళముగ నడచుచు | దలవంపులు చేసే వారి దళముల నెల్లన్ || అని విని సంతసించక "శత్రుదళములను విదళనము చేసి వారి రాష్ట్రములను స్వరాష్ట్రముతోఁ జేర్చుచు,• దిగ్విజయమును జేయుట చేత నా భుజ పరాక్రమములను జూపించుటకు తండ్రి నా కవకాశ మీయఁ”డని అలగ్జాండరు స్నేహితులతోఁ జెప్పి విచారించుచుండెను. "చతురంగబలములతో కూడిన నీ మహా రాజ్యాధిపత్యమును బొందుటకు నే నియ్యకొనను. 'పరిపంధి రాజచక్రంబుమీఁద నవక్ర పరాక్రమంబున శిఖిశిఖాసంకాశ నిశిత శిలీముఖ నారాచ భల్లప్రముఖంబులైన బహువిధ బాణ పరంపరలఁ గురిపించి విదళిత మత్తమాతంగ తురంగరధవరూధ పదాతి యూధంబుగఁజేసి', రణంబున నెదురులేని శౌర్యంబును బాటించి దేశపాలకుల నతిక్రమించి దిగ్విజయముఁ జేసి సామ్రాజ్యమును బొందుటకు నే సభిలషించెద"నని అలగ్జాండరు' స్నేహితునితోఁ బలికి కక్కసపడుచుండెను.

ఒకనాఁడు తండ్రి సమక్షమున కొక తురగము క్రయమునకుఁ 'దేఁబడెను. ఆశ్వపాలకుల కవశ్యమై తట్టుటకైన మనుజులను చేరనీయక, విచ్చలవిడిగ నది సంచరించుటఁ జూచి దానిని క్రయమిచ్చి పుచ్చుకొనుటకు రాజు సమ్మతింపఁ డయ్యెను. దీనిని జూచి 'అలగ్జాండరు' ఎంత చక్కని గుఱ్ఱమును తమరు వదలి వేయుచున్నా”రని తండ్రితో పలుమారు పలికెను. అది విని రాజు "పడుచువాఁడవు. పెద్దలను ధిక్కరించుచున్నావు. వారికంటె దానిని నీవు వశ్యము చేసి కొనఁగలవా” యని కుమారునితోఁ బలికెను. "అది యెంతపని” యని కుమారరాజు నుడివెను, “నీ వొకవేళ దానిమీఁద స్వారిచేయలేకపోయిన, నీ మోటరి తనమునకు నీవేమి యోడెద"వని రాజు తర్జింప, "నేను దాని వెల నిచ్చెద"నని కుమారుఁడు శాంతవచనమునఁ జెప్పెను. అప్పుడు రాజకుమారుఁడు తండ్రిసెలవుఁ గైకొని తురగమును తట్టి ప్రక్కకుఁ ద్రిప్పి, పగ్గములను స్వీకరించి, దాని నారోహించెను. ఆస్కంధిత, ధౌరిత, రేచిత, వల్గిత, ప్లుతనామాంకిత గతులలో నతఁడు దానిని నడిపించి మఱలినందునఁ బరిజనులందఱు సంతసించిరి. ఆనందబాష్పములొలయఁ దండ్రి, "నీకీ 'మాసిడన్‌'దేశము తగినదికాదు. నీవంటి తేజోవంతుఁ డితర దేశములను భుజపరాక్రమముచేత స్వాధీనము చేసికొనవలసిన"దని పలికి కుమారునిఁ గౌఁగిలించుకొనెను.

మహామహోపాధ్యాయుండని పేరుబొందిన 'ఆరిస్టాటిలు'నకు కబురుపెట్టి యతఁడు దన కుమారునకు విద్యాభ్యాసము చేయింపవలసినదని ఫిలిప్పు వేఁడుకొనెను. నీతిశాస్త్ర పారంగతునిగఁ జేయుటయెగాక, యతనినిఁ బ్రగూఢశాస్త్రములలోఁగూడ 'ఆరిస్టాటిలు' ప్రవేశపెట్టెను. మొదటినుండియు వినయవిధేయతలతో గురువును శిష్యుఁడు భావింపుచుండెను. గురుశిష్యుల కత్యంతానురాగము బలిసెను. వైద్యములోఁగూడ కొంత ప్రవేశమును బొంది, మందులఁ జేయుటయం దతఁడు కుశలతఁ గలిగియుండెను.

ఈలోపున ఫిలిప్పు మొదటిభార్యను విడనాడి ద్వితీయ కళత్రమును వివాహమయ్యెను. దానిచేతఁ దండ్రీ కుమారులకు నైరము పొసఁగెను. అందుకుతోడు 'అలగ్జాండరు' తల్లి, కుమారుని తండ్రిపైకి పురికొల్పు చుండెను. ఒక రోజున, "రెండవ భార్యయైన 'క్లియోపాత్ర' యొక్క గర్భము ఫలించి, సింహాసనమునకుఁ దగిన కుమారునిఁ గనవలసిన”దని దైవప్రార్థనఁ జేయుఁ డని క్లియోపాత్ర పినతండ్రి నలుగురి యెదుటఁ జెప్పెను. "నే నౌరసపుత్రుఁడను కానని మీ యభిప్రాయము కాఁబోలు”నని యలగ్జాండరు ప్రశంసించెను. అంతలో రోషా వేశకంపమానగాత్రుండై , ఫిలిప్పు చంద్రాయుధమును ఝలిపించి కుమారుని శిరస్సుఁ దెగవ్రేయఁజూచెను, దైవికముగ ఫిలిప్పు కాదంబరీరసవిఘూర్ణితలోచనుఁడై యుండి నందువ, ననక్రమమున స్మారకముతప్పి నేలఁబడెను. "మాసిడను దేశవాసులారా, మీరు చూడుఁడు, నాలుగడుగులు వేయ లేనివాఁడు ఐరోపాఖండమునుండి ఆసియాఖండమునకుఁ బోదలచినాఁడని అలగ్జాండరు పలికెను.

ఫిలిప్పు కాలాంతరగతుఁ డయ్యెను. సింహాసనమునకు 'అలగ్జాండరు' వచ్చెను. అప్పటి కతని కిరువదిసంవత్సరముల ప్రాయము. దేశమంతయు నల్లకల్లోలముగనుండెను. దేశములను కొట్టి స్వదేశముతో వానినిఁ జేర్చుటయెగాని, వానికి తగిన రాజ్యాంగముల నిర్మించి, వానిని స్థిరముగ ఫిలిప్పుంచ లేదు. కలఁతఁ జెందిన జలములో కలుష రేణువు లనులోమ విలోమముగ సంచరించు విధమున, దేశము లానుపూర్వముగ ననుభవించుచున్న రాజ్యాంగములను మాపివేసి నూతన రాజ్యాంగములను స్థాపింపనందున, దేశవాసులు స్వాస్థ్యము లేక సంచరించుచుండిరి. ఇట్టి యరాజకస్థితిలోఁ డండ్రి కాలముఁ జేయుటయు, అలగ్జాండరు సింహాసనమునకు వచ్చుటయు జరిగెను. చతురంగబలముల నడపి, చతురోపాయములచేత నరాజక దేశంబుల నర్థమునకును బ్రాణమునకును క్షేమం బొసంగి, అలగ్జాండరు వానికి ప్రశాంతమును గలుగఁ జేసెను. రథగజతురఁగపదాతి యూధంబుల నొక యక్షౌహిణి బలము సమకూర్చి దిగ్విజయమున కతఁడు బయలు వెడలెను.

ఒక సుముహూర్తంబున మహా దంతావళంబు నధిరోహించి, 'వారాశి ప్రావృత మేదినీవలయసామ్రాజ్యంబుఁ, గైకొనుట' కతఁడు బయలువెడలెను.

“హయ హేషల్ గజ బృంహితంబులు రధాంగారావముల్ శింజినీ |
చయటంకారములున్ వినర్థిత గదాచక్రాస్తనాదంబులున్ !
జయశబ్దంబులు భేరిభాంకృతులు నిస్సాణాదిఘోషంబులున్ |
భయదప్రక్రియ నొక్కవీక సెగసెస్ బ్రహ్మాండ భేదంబుగన్”||

ఇట్లు సునాసీరనాసీరంబులు శిరస్త్రాణంబులు ధరించి, ధ్వజంబు లెత్తి దండనాయకు లుద్దండంబుగఁ గోదండంబులు సాచి స్వదండంబుల , దండించుచుఁ బ్రత్యానీకదండంబుల డంబంబు లణఁచి నడువ యవన బర్బర తురుష్క పార వంశస్థాపకుఁడైన చండ్రగుప్తమహారాజునకు వశ్యులై, గ్రీకుల రాజ్యమునకు వ్యవధి లేనందున నది మణిఁగిపోయెను. వారి దేశభాషాచారములను మన మవలంబించి యుండినచో, నేఁడు మన యవస్థ యెటుల నుండియుండునో పరమేశ్వరునికిఁ దెలియును. ఇట్లు మేఘమధ్యమును వెలువడి వెలుంగు క్రొక్కారు. మెఱుంగు తెఱుంగున, గ్రీకుల రాజ్యము భరత వర్షంబునఁ బ్రకాశించెను.