మత్స్యపురాణము/ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి

ఉపోద్ఘాతము

మత్స్యపురాణము నాంధ్రీకరించిన కవి హరిభట్టారకుఁడు. ఇతఁడింతకుమున్ను వరాహపురాణముఁ దెలిగించి కొలిపాక యెఱ్ఱన యను కరణమున కంకితము చేసెను. నరులకుఁ గృతి యిచ్చుటఁ గలిగిన పాపముఁ బరిహరించుకొను తలంపుతో నీతఁడీమత్స్య పురాణమును రచించిన ట్లీక్రిందిపద్యముచే నూహింపఁబడుచున్నది.

సీ. ఆయురారోగ్య నిత్యైశ్వర్యములుగల్లి
            విభవంబుతో ధాత్రి వెలయుకొఱకు
    ధనమునకై నరాధముల సన్నుతిసేయఁ
            బొడమిన పాపముల్ చెడుటకొఱకు
    హృదయంబు లక్ష్మీశపదపంకజములందు
            నిశ్చలవృత్తితో నిలుచుకొఱకు
    రౌరవమ్ములఁ బాసి రయమున వైకుంఠ
            సదనంబునకు వేడ్కఁ జనెడుకొఱకుఁ
గీ. బరమవైష్ణవజనులెల్లఁ బ్రస్తుతింప
    మత్కృతంబయి హరికథామాన్యమగుచు
    నుత్తమంబగు విష్ణుధర్మోత్తరంబు
    రంగనాథున కర్పింతు రాణ మెఱసి.

ఇక్కవి తన ‘కష్టఘంటావధానపరమేశ్వరబిరుద’ మున్నట్లు గ్రంథాంతగద్యమునందుఁ జెప్పుకొనియెను. దీనిచే నాకాలమునం దష్టావధానమే మిగుల నపురూపముగా నున్నట్లు తెలియవచ్చుచున్నది. ఈతనికవిత్వము ధారాశుద్ధి గలిగి మృదుమధురముగా నున్నది. ఈతని కాలమింకను జరిత్రకారులచే సరిగా నిర్ణయింపఁబడలేదు. కానీ యపూర్వమగు గ్రంథోపక్రమమును బట్టి చూడ నీతఁడు మిక్కిలి ప్రాచీనుఁడయినట్లు తోచుచున్నది.

ఈగ్రంథమును బ్రహ్మశ్రీ మ. రా. రా. మానవల్లి రామకృష్ణకవిగారివలన బ్రహ్మశ్రీ మ. రా. రా. చిలకమర్తి లక్ష్మీనరసింహకవిగారు గ్రహించి ప్రకటింపఁదలంచిరి. ఇంతలో బ్రాచీనకృతుల ముద్రింపించి జగదుపకృతి యొనరించు శ్రీ శ్రీ శ్రీ పీఠికాపురపు రాజుగారి సదుద్యమము తెలియవచ్చుటయు శ్రీవారి కాగ్రంథము నొసంగిరి. శ్రీ సూర్యారావుబహద్దరువారును దమపండితులలో నొకరగు బ్రహ్మశ్రీ పురాణపండ మల్లయ్యశాస్త్రులవారిచే నాగ్రంథమును బరిష్కరింపించి శుద్ధగ్రంథలేఖకులగు భాస్కర రామమూర్తిగారిచే వ్రాయించిరి. అంతమాచే నభ్యర్థింపఁబడి మాకవితకు దయాపూర్వకముగా నొసంగిరి. ధనసాహాయ్యముతోఁ బాటు, గ్రంథసాహాయ్యముఁ గూడఁ జేసి మాకవితను బోషించు శ్రీవారి కభ్యుదయపరంపరాభివృద్ధిగా దీవించుచున్నారము.

పత్త్రికాధిపతులు.