మతము - పథము/చివరి మాట

వికీసోర్స్ నుండి

రచయిత చివరి మాట

మతమను మాటయే సరియైనది కాదు. మతమనునది మాయ మిళితమైనది కావున దానిలో స్వమత అభిమానము పరమత ద్వేషము ఉంటాయి. ఎందరో అమాయక ప్రజలు మత ద్వేషముల వలన ప్రాణాలు కోల్పోతున్నారు. మతమే ఎంతో నష్టమును కల్గించునదైయుంటే, దానికి రాజకీయరంగు పులుముకొంటే మరీ ప్రమాదముగా తయారగు అవకాశము కలదు. హిందూదేశముగ పేరుగాంచిన భారతదేశములో మతమును వాడుకోవడము వారికలవాటై పోయినది. అటువంటి వారికి దేవుని జ్ఞానము యొక్క వాసన కూడ తెలియదు. జ్ఞానము యొక్క రుచిగానీ, వాసన గానీ తెలియనివారే జ్ఞానమును ప్రచారము చేయు మమ్ములను ఇబ్బందిపెట్టి,దాని ద్వార వారు కావాలను కొంటున్నారు. మేము ఎవరిని ఇబ్బందిపెట్టుచున్నామని వారు ఏమాత్రము ఆలోచించడములేదు. హిందూ మతములో ఎవరూ చేయని ప్రచారము మేము చేస్తూ నలభై ఐదు గ్రంథములను ప్రచురించాము. అజ్ఞానములోనున్న క్రైస్తవులకు కూడ వారి మతములోనే ఇది సరియైనమార్గమని చెప్పాము. 'ఇందూజ్ఞానవేదిక' అను సంస్థను స్థాపించి దాని ద్వారా ఎంతో దైవజ్ఞానమును ప్రచారము చేయుచున్నాము.ఎంతో జ్ఞానమును ప్రచారము చేయుచున్న మమ్ములను వ్యతిరేఖించడము ఎవరికి మంచిది కాదు. మాలో ఏమైన తప్పులుంటే, మేమేమైన హిందూమతమునకుగానీ ఇతర మతమునకుగానీ వ్యతిరేఖముగా ఉంటే మమ్ములను బహిరంగముగా నిలదీసి అడుగవచ్చును. దానికి సమాధానము చెప్పుటకు సిధ్ధముగా ఉంటాము. అట్లుకాకుండ మామీద ధర్మవరము,బత్తలపల్లిలో చేసినట్లు ధర్నాలు చేయడము. హంపిలో మాదిరి కేసులు పెట్టడము, మహానందిలో మాదిరి పేపర్లలో వేయడము వలన మాకు ఎటువంటి నష్టమురాదు. కానీ మీరు మాత్రము దేవుని భక్తులైన గొప్ప గ్రహముల కోపమునకు గురికాగలరు! దాని వలన మీకే కష్టము రాగలదు!! అందువలన మమ్ములను విమర్శిస్తే ఇటు జ్ఞానపరముగా గానీ, అటు న్యాయపరముగా గాని విమర్శించండి. అట్లు కాక అన్యాయముగా,అజ్ఞానముగా విమర్శించడము దేవునికి కూడ సరిపోదని తెలుపుచున్నాము.