పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/దక్షసావర్ణిమనువుచరిత్ర

వికీసోర్స్ నుండి

9దక్షసావర్ణిమనువుచరిత్ర

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


తెభా-8-417-వ.
అట మీఁదటి కాలంబున వరుణ నందనుండగు దక్షసావర్ణి తొమ్మిదవ మను వయ్యెడు; నతని కొడుకులు ధృతకేతు, దీప్తకేతు, ప్రముఖులు రాజులును; బరమరీచి గర్గాదులు నిర్జరులును; నద్భుతుం డను వాఁడింద్రుండును; ద్యుతిమత్ప్రభృతులగు వారలు ఋషులును నయ్యెదరు; అందు.
టీక:- అటమీదటన్ = ఆ తరువాత; కాలంబునన్ = కాలమునందు; వరుణ = వరుణుని; నందనుండు = పుత్రుడు; అగు = అయిన; దక్షసావర్ణి = దక్షసావర్ణి; తొమ్మిదవ = తొమ్మిదవ (9); మనువు = మనువు; అయ్యెడున్ = అవుతాడు; అతని = అతని యొక్క; కొడుకులు = పుత్రులు; ధృతకేతు = ధృతకేతుడు; దీప్తికేతు = దీప్తికేతుడు; ప్రముఖులు = మున్నగువారు; రాజులును = రాజులు; పర = పరులు; మరీచి = మరీచులు; గర్గ = గర్గులు; ఆదులు = మున్నగువారు; నిర్జరులును = దేవతలును; అద్భుతుండు = అద్భుతుడు; అను = అనెడి; వాడు = వాడు; ఇంద్రుండును = ఇంద్రుడును; ద్యుతిమత్ = ద్యుతిమంతుడు; ప్రభ్రుతులు = మున్నగువారు; ఋషులున్ = ఋషులు; అయ్యెదరు = అవుతారు; అందు = ఆ కాలమున.
భావము:- అటు తరువాతి కాలంలో వరుణుని కొడుకైన దక్షసావర్ణి తొమ్మిదవ మనువు అవుతాడు. అతని కొడుకులైన ధృతకేతువు, దీప్తకేతువు మొదలైనవారు రాజులు అవుతారు. పరులు, మరీచులూ, గర్గులు మొదలైనవారు దేవతలు అవుతారు. అద్భుతుడు అనేవాడు ఇంద్రుడు అవుతాడు. ద్యుతిమంతుడు మొదలైనవారు సప్తఋషులు అవుతారు.

తెభా-8-418-ఆ.
నుజహరణుఁ డంబుధార కాయుష్మంతు
కు జనించి రక్షణంబు చేయ
మూఁడు లోకములను మోదంబుతో నేలు
ద్భుతాఖ్య నొప్పు మర విభుఁడు.

టీక:- దనుజహరణుడు = హరి; అంబుధార = అంబుధార; కున్ = కు; ఆయుష్మంతున్ = ఆయుష్మంతున; కున్ = కు; జనించి = పుట్టి; రక్షణంబు = కాపాడుట; చేయన్ = చేయుచుండగా; మూడు = మూడు (3); లోకములను = లోకములను; మోదంబు = సంతోషము; తోన్ = తోటి; ఏలున్ = పరిపాలించును; అద్భుత = అద్భుతుడు; ఆఖ్యన్ = అనుపేరుతో; ఒప్పున్ = ఒప్పియుండెడి; అమరవిభుడు = దేవేంద్రుడు;
భావము:- ఆ కాలంలో విష్ణువు ఆయుష్మంతుడికీ అంబుధారకూ జన్మిస్తాడు. అతని రక్షణలో దేవేంద్రుడైన అద్భుతుడు మూడు లోకాలను సంతోషంగా పరిపాలిస్తాడు.