పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన 90

నిలిపి కూర్చుండుఁ డని వేమన యెంత తిట్టి చెప్పినను అతనినోరు నొచ్చుట తప్ప వేఱు ఫలమెట్లు కలుగును? ఇఁక నితని నంఘ సంస్కారపు నీతులంటిమా, అవి నిండిన చెఱువుకట్ట నొకటే మాఱు తెంపఁజూచినట్లు, ఇదివఱ కున్న సాంఘిక వర్తనముల కన్నిటికిని మూలచ్చేదము చేయC బ్రయత్నించు చున్నవి. ఉన్న దున్నట్లుగా ఒక యూరికిఁ బోయి -

        "ఆ. ఉర్వివారికెల్ల నొక్క కంచముఁ బెట్టి
              పొత్తు గుడిపి కులము పొలియ(బేసి
              తలనుజేయి పెట్టి తగనమ్మఁ జెప్పరా.." (545)

యని యెంత పెద్ద గొంతుకతో నఱచినను, జనసామాన్యమున కట్లు చేయుట సాధ్యమా ? సంఘ సంస్కారికుండవలసిన ప్రధానగుణము ఏ సంఘమును తాను సంస్కరింప దలంచునో, దానిలోనే తానును జేరి, వారి సుఖదు:ఖములను తాను ననుభవించి, వారి జ్ఞానాజ్ఞానములతో సహానుభూతి గలిగియుండుట. అప్పడు జనులు క్రమముగా అతని నర్ధము చేసికొందురు ; అతని మనసుతో నేకీభవింతురు ; అతని శ్రద్దకు లోనగుదురు. అట్లుగాక బైటనుండి యెన్ని యుపన్యాసము లిచ్చినను లాభము లేదు. వేమన్న తానన్నివిధముల ప్రపంచవ్యవహారమునకు విరోధముగానే నడుచుచున్నాఁడు. కావున నితని సిద్ధాంతము లనేకుల కంటలేదు. సహజముగా నుద్రిక్త స్వభావము గలవాఁడు గావున ' ఇతరుల తప్పులను గని యసహ్యపడఁ గలఁడే కాని వారియందలి గుణములను గమనింపలేఁడు. గుణమే లేని పదార్థ మేదియు భూలోకమందు లేదు. మఱియు నిదానముగా జనులను దగ్గఱకు పిలిచి పదిమాఱులు వారికిఁ జెప్పి బోధించు నోర్పుగాని పాండిత్యముగాని కలవాఁడు కాcడు. తన మాటలను తిరస్కరించిన వారిని గూర్చి యితఁ డేమనుచున్నాఁడు వినుఁడు :

          "ఆ, ఎద్దుకైనఁగాని యేడాది తెల్పిన
                మాట దెలిసి నడుచు మర్మమెఱిగి
                మొప్పె తెలియలేఁడు ముప్పదేండ్లకునైన.." (వే.జ్ఞా. 356)

ఇట్లైనను వేమనయందు బలవత్తరమైన గొప్పగుణమున్నది. అవేదనఁగా శ్రద్ద, తాను గొప్పతత్త్వము నెఱిఁగితినను దృఢమైన నమ్మికకు తోడు, బ్రదికి యుండు లోపల దానినంద ఱెఱుఁగునట్లు చేయవలయునను పట్టుదలయుఁ గల వాఁడు కావున, ఎవరు విననీ, వినకపోని, తనపని తాను వదలలేదు. ఆ శ్రద్ధాగుణము చేత, ఇతనివలెనే యప్పటి సాంఘిక మతస్థితులతో తృప్తిలేనివారు అనేకులు ఇతనియం దేమోయున్నదని నమ్మి యాశ్రయించి యుందురు. అట్టివారి నితఁడు తాను నిరర్ధకములని తేల్చుకొన్న హఠయోగము మొదలగు మార్గములలో దింపక, కేవల చిత్తశుద్ధి గలిగి శాంతిని సంపాదించు మార్గమును మాత్రము వారికి బోధిం చెను. శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు పంతులుగారు ఇట్లు వ్రాసిరి :

"ఇట్లు కేవల శివాద్వైతియు, జాతి కులాభిమాసమునకు నతీతుడును, పరోపకారమే పరమధర్మముగాc గల యీకవి చరమావస్థయందొక మతమును స్థాపించెనఁట. ఆ మతమును అంగీకరించువారు ఈ క్రింది యేడు సిద్ధాంతములను అంగీకరింపవలయును : (1) దొంగతనము చేయరాదు. (2) ఎల్లప్పడును భూత దయ గలిగి యుండవలెను. (3) ఇతరుల మనస్సు నొప్పింపరాదు. (4) ఉన్న దానితో తృప్తిఁజెంది యుండవలయును. (5) ఇతరులను మత్సరింపరాదు.