వేంకటరత్నము పంతులవారు మదరాసునుండి జరుపుచుండిరి. వీరు మదరాసు ప్రెసిడెన్సీకాలేజిలో నాంధ్రపండితులేగాక ఆంధ్రవిద్యాపారంగతు లని ప్రసిద్ధి వహించియుండిరి. బహునాటక కర్తలైన శ్రీ ధర్మవరము రామకృష్ణమాచార్యులవారి వంటివా రనేకులు వీరి శిష్యవర్గములో నుండిరి. అముద్రిత గ్రంథచింతామణి యను పత్రికను శ్రీ పూండ్ల రామకృష్ణయ్యగారు నెల్లూరినుండి ప్రకటించుచుండిరి. వీరు 1860 సం. జూలై 4 తేది, నెల్లూర, దువ్వూరను గ్రామమున ఆఱువేల నియొగిబ్రాహ్మణ కుటుంబమున జనించి సంస్కృతాంధ్రములందు చక్కని జ్ఞానము సంపాదించుటయేగాక మంచిలాక్షణికులనియు, విమర్శకులనియు ప్రసిద్ధివడసిరి. 1885 సం. మున వీరును ఒడయారు వీరనాగయ్యగా రనువారుకలసి యీ పత్రికను, శ్రీ వేంకటగిరి మహారాజా, కీ.శే.శ్రీ రాజగోపాలకృష్ణయా చేంద్ర బహద్దరు వారిపోషణలో, ప్రారంభించి, 1888 సం. వరకు జరిపిన యనంతరము సహాయసంపాదకులైన వీరనాగయ్య గారు మానుకొనగా తామొక్కరే తమనిర్యాణపర్యంతము 1904 సం. వరకు జయప్రదముగా జరిపిరి. పూర్వకావ్యముల నెన్నింటినో పరిష్కరించి ముద్రించిరి. శశిలేఖయను పత్రికను మదరాసునుండి శ్రీ గట్టుపల్లి శేషాచార్యులవారు శ్రి నేలటూరి పార్థసారథి అయ్యంగారు మొదలైనవారి తోడ్పాటున ముద్రించుచుండిరి. శ్రీ కందుకూరి వీరేశలింగము పంతులవారు వివేక వర్థనిని రాజమహేంద్రవరమునుండి జరుపుచుండిరి. కలావతి