"నీచపాత్రములకు దెలుగు నాటకములయందు దమరుచూపినదారి నామట్టు కాదరణీయముగానే తోచుచున్నది. మఱియు దానివలన ననేకలాభములున్నట్టు నేను దలంచుచున్నాడను. గ్రామ్యములేవో యగ్రామ్యములేవో యెఱుంగనివార లనేకులుందురు గాన వా రివిగ్రామ్యము లివి యగ్రామ్యము లని తెలిసికొనుటకు వీలుకలుగుచున్నది. మఱియు వాడుకప్రకారము అట్టి గ్రామ్యరూపములు వ్రాయుట కష్టమే. నాకు జూడ దన్నాటకము బహు రసవంతముగానున్నది."
కొందఱు పండితులు ఔచిత్యాభిమానులు హర్షించినను ఇతరులు ఈపద్ధతికి వెంటనే హర్షింపలేదు. ఈవిషయము పండితులలో నొక యలజడి బుట్టించి వృద్ధి చేయుచుండినది.
1896 సం. శాస్త్రులవారు కాళిదాసమహాకవి విరచిత శాకుంతలనాటకము నాంధ్రీకరించి ప్రకటించిరి. మునుపటి వలెనే పాత్రోచితభాషం బ్రయోగించిరి. దాని పీఠికలో నిట్లు వ్రాసిరి. "నాగానందమున బ్రాకృతస్థానమున నే బ్రయోగించిన గ్రామ్యభేదములను నాంథ్రాంగ్లేయ భాషాపారీణులగు విపులహృదయ లామోదించిరి. దీనియందును గణ్వ కశ్యపులకును తలారిచెంబడులకును నేకవిధభాషణముం బ్రయోగించుట యనుచితమని కావలివాండ్రకు మత్స్యఘాతకునికిని గ్రామ్యముం బ్రయోగించితిని."