లందఱను కూర్చుండి విస్తరాకులను కుట్టి ఆఱునెలలకు వలసిన విస్తళ్లను ఆవృద్ధయింట వైచిరి. ఆముసలామె నివ్వెఱబోయెను. అదిమొదలు వేంకటరమణశాస్త్రిగారిని అందరును చాల మర్యాదగా చూడసాగిరి. ఇట్టియుదంతములు ఎన్నేనియు గలవు.
వీరికి దయ్యములందుగాని శకునములు మొదలైనవాని యందుగాని ఎట్టినమ్మకమునులేదు. విద్యార్థిదశలోనే యొకప్పుడు వీరికిని వీరితోడి విద్యార్థులకును దయ్యముల విషయమై వివాద మేర్పడినది. వీరు అట్టి పిచ్చినమ్మకమునకు తావీయలేదు. అంతట విద్యార్థులందఱును పందెములు వేసికొని ఒక అమావాస్యనాడు రాత్రి శ్మశానమునకు బయలుదేఱిరి. ఒక్కొకరును చేత తమపేరువ్రాసిన తాటియాకు, ఒకచీల, ఆతాటియాకును శ్మశానము చెంత నొక చెట్టునకు కొట్టుటకు ఱాయి, వీనితో తరలిరి అర్థరాత్రివేళ. అందఱును కలసియే ప్రయాణమైరి గాని నాలుగడుగు లిడిన వెనుక ఒకరొకరు వెనుకకు పోసాగిరి. తుదకు వేంకటరమణశాస్త్రిగారు మిగిలిరి. ధైర్యముగాపోయి వల్లకాటి చెట్టున ఆ తాటియాకును చీలతోకొట్టి ఇటునటుచూడక వెనుకకు తిరుగగానే ఎవడో వెనుకనుండి వీరి పైపంచెను లాగుకొనెను. ఇంకను బాల్యమేగావున ఎవడో బేతాళుడని తలంచి పైపంచె వదలివేసి త్వరగా నిల్లుచేరిరి. విద్యార్థులకు ఈవృత్తాంతమును చెప్పి 'వాస్తవముగా దయ్యమే యైయుండునా?' అని యనుమానించుచు ప్రొద్దున విద్యార్థులతో పోయి చూడగా, ఆ పైమంచెనులాగినది దయ్యమునుగాదు పిశాచమునుగాదు,