2
వేదము వేంకటరాయశాస్త్రులవారి జీవితము
ఔచిత్యముం బాటింపకయు, పైగా గీర్వాణగ్రంథముల యాంగ్లానువాదముల నాథారముగాగొని అనువదించియు పలుపాట్లు పడుచుండిరి. అప్పటికి స్వతంత్ర నాటకము లింకను వెలువడ లేదు; వచనగ్రంథములు వ్రేళులపై లెక్కపెట్టదగినవిగా నుండినవి; కవనము ఇంకను ప్రాచీనమార్గమున పాడిన పాటయే పాడుటగా నుండినది. అట్టి యీకలమున శ్రీ వేదము వేంకటరాయశాస్త్రులవారి యాగమనము ఆంధ్రవాఙ్మయమున నొక క్రొత్త యుగమును సూచించుచున్నది. గద్య పద్య నాటక విమర్శకాది విషయములలో వారుచూపిన మార్గములు పెక్కులు.
శ్రీ శాస్త్రులవారింగూర్చి నేటిరచయితలు పరిపరవిధముల వ్రాయుచున్నారు. శాస్త్రులవారు అసాధువాఙ్మయమును పూర్తిగా నిరసించినారు. అందులకు కసితీర్చుకొనుటగా వారిని కొందఱు నిరంతరము విమర్శించుచున్నారు. శాస్త్రులవారి గ్రంథములు విమర్శకు గుఱియైనట్లు ఆధునికులలో నెవరి గ్రంథములును కాలేదనుట అతిశయోక్తికాదు. అదిపనిగా శ్రద్ధాళువులు వారిగ్రంథములం జదివి, రసము గ్రహించి, తా మభివృద్ధినంది వారిని దైవమువలె కొనియాడువారును, అట్లే ఇతర కార్యములను మానుకొని అదిపనిగా నిరంతరము వారిగ్రంథములను పరీక్షగావించి, ఏవైనను, అచ్చు పొరబాట్లుగాని, ఏమఱుపాట్లుగాని దొరకిన నిధి దొరకినట్లు సంతోషించుచు వారిని దూషించు వారును కనబడుచున్నారు. శాస్త్రులవారు ఆంధ్రవాణి కొనర్చిన సేవను గుఱించియు, వారు, చూపిన నూతనమార్గ