ఉపసంహారము
వేంకటరాయశాస్త్రులవారి సారస్వతమూర్తి
తాతగారి యవతారము సమాప్తియైనది. వారిజీవితము తిన్నగా నడువలేదు. మిట్టపల్లములు, చీకటివెలుగులు, - ఒకటి వెనుక నొకటి వారి జీవితములో ననుగమించుచునే యుండినవి. కొంతకాలము సంతోషము కొంతకాలము దు:ఖము, మరల సంతోషము, మరల విషాదము - ఇట్లొకదాని తర్వాత నొకటి; తుదకు అంతయు సమసిపోయినది. బాల్యములో నెంత యుత్సాహముతోనుండిరి! ఆధునికులలో నవ్యకవులనుమించిన యుత్సాహముతో, తెనుగునుడికారమును ఆంధ్రజాతీయతను ప్రతిబింబింపజేయు జానపదావాఙ్మయరసమును తనివితీర నాస్వాదించిరి. కృష్ణా గోదావరీ పినాకినీ తీరములు వారి బాల్యవిహారభూములు. సంస్కృతాంధ్రములలో నిష్ణాతులైన వెనుక, విధవా వివాహవాదముల దినములలోను, కవిపండితసంఘమును 'మదరాసులో రూపుమాపిన' దినములలోను మేరువును తృణముగా భావించినారు. 'నాకుకూడా ముసలితనంవస్తుందని నేను అనుకోలేదు' అని ఒకానొకప్పుడు నాతో వేడుకగా వచించినారనగా ఎంతటి యారోగ్యవంతులుగా నుండిరో యూహింపవచ్చును. శరీరమందారోగ్యము, తమప్రజ్ఞయందు సంపూర్ణవిశ్వాసము, వాఙ్మయవిషయములలో గట్టిపట్టు, తాము పూనినకార్యమును సాధించుదీక్ష, నిరంతరము సారస్వతపరిశ్రమ. ఏసభలో