22-ప్రకరణము
కొన్ని సత్కారములు
1919 సం. మదరాసులో ఆంధ్రసారస్వతసభ జరిగినది. అందు సభ్యులు తాతగారికి 'మహోపాధ్యాయ' బిరుదము నొసంగుచు 1116 రూప్యములను సమర్పించిరి. గొప్ప సత్కారము జరిగినది. ఈసందర్భమున వారొక యుపన్యాస మొసంగిరి. అందలివాక్యముల కొన్ని-
"యేనామకేచిదిహ.......' అని భవభూతి చెప్పుకొన్న తీరున - ఇన్నాళ్ళకు నన్ను నేదిష్ఠనికటదూరదవిష్ఠ ప్రదేశములవారు మీరలు అభినందించితిరి.
పూర్వము నవద్వీపమందు మహోపాథ్యాయ, మహా మహోపాథ్యాయ బిరుదములు నొసంగు తెఱంగును పెద్ద లిట్లు చెప్పుదురు. పరీక్ష్యుడు ఏదేశమునుండియేని వచ్చును.... అది అభిజ్ఞమార్గము, అందు భీ గలదు. మదీయము భీ లేనిది, ఆజ్ఞమార్గము, వాగ్దేవతోపాసనారూపము.
ఉపాసనయందును లఘు లఘియో లఘిష్ఠ ప్రకారములు కలవు. అందు మదీయము లఘిష్ఠము. బాలోచిత కతిపయాల్పగ్రంథరచనా రూపము. మదీయజన్మాంతరపుణ్యవశంబున అంతపాటికే యుష్మద్రూపవాగ్దేవత వర మొసంగినది. మఱియు దేవతను ప్రసన్నయగువఱకు నుపాసింపవలయును.