ఈజాబునకు శ్రీమహారాజావారు, హృదయము కరగి, 1915 సం. ఏప్రిలునెల 25 తేది వేయిరూప్యములు బహుమతిగాను రెండువేల యైదువందలరూప్యములు అప్పుగాను నొసంగిరి. శాస్త్రులవారు శ్రీ మహారాజావారికి కృతజ్ఞులై తమ చిక్కులను సడలించుకొని వ్యాపారమును సాగించుటకు ప్రారంభించిరి.
ఇక్కాలమున శ్రీ మహారాజావారి చిత్తము రంజింపగోరి వెలమవీరుల గొప్పతనము ప్రకటించునదైన బొబ్బిలి యుద్ధనాటకమును వ్రాసిరి. అందు సూత్రథారునిచే శ్రీ మహారాజావారిని ప్రశంసింపించిరి. ఈగ్రంథము ప్రకటించుటకు కొంతముందే శాస్త్రులవారు సూర్యరాయాంధ్రనిఘంటు సంపాదకులగుటయు, తన్మూలమున మరల నచ్చాపీసుతోగూడ శాస్త్రులవారు చెన్న పట్టణమునకు నివాసము వచ్చుటయు జరిగినవి. శ్రీ మహారాజావారు కోరిన కాదంబర్యాది గ్రంథముల రచనసాగుటకు కొంతయాలస్యము కాజొచ్చెను. శాస్త్రులవారు నిఘంటు సంపాదకత్వము నంగీకరించుటకు ప్రోత్సహించినవారిలో శ్రీ రాజాగారు ప్రథానులు.
ఈవిధముగా కొంత కుదురుపాటుతో శాస్త్రులవా రుండిన కాలమున శాస్త్రులవారి కొక పిడుగుదెబ్బ తగిలినది; వారికి ఆధారముగానుండిన కల్పవృక్షము కూలిపోయినది; శ్రీ మహారాజావారు ఆకస్మికముగా పరమపదించిరి. శాస్త్రిగారికి కొంత కాలము వఱకును ఇతికర్తవ్యతాజ్ఞానము లేకయుండినది. అట్టి విద్వత్ప్రభువును పోగొట్టుకొని నందులకు చింతింపనివా రుం