భాషలకుం దల్లి'యు నగు నీసరస్వతిని వెండియుం దెచ్చికొని హృదయాలయములందు ప్రతిష్ఠించికొని యుపాసించి తత్ప్రసాదంబున సంస్కృతభాషలో కావ్యనాటక కథాప్రబంధముల రసంబును ధర్మయోగ పురాణేతిహాస వేదవేదాంతాది విషయంబులను గ్రహించి సర్వశ్రేయంబులం బొందంగోరిక, ఇతర విద్యాభ్యాసప్రయాసచే బాల్యమందు ఈవిద్యను నేర్వని సజ్జనులకు పలువురకు చిత్తమందు ఉదయించుచున్నది. కాని, అట్టివారికి అనేకులకు ఉపాథ్యాయులు దొరకమింజేసి ఈయభీష్టము నెఱవేఱకయున్నది. మఱియు నిపుడు హౌణాది భాషాంతర ప్రసిద్ధ విద్యాకలావిశేషములనేమి స్వతంత్రకావ్య నాటకాది గ్రంథములనేమి ఆంధ్రంబున రచియింప ననేకులుకోరుదురు. వారి యుద్యమములకును సంస్కృతపరిచయము ఆవశ్యకముగదా. అట్టివారికొఱకును కేవల బాలురకొఱకును ఉపాథ్యాయునితో బనిలేకుండ స్వయంబోధకములుగా పెక్కు సంస్కృతగ్రంథములను, తెనుగున, టిప్పణముతో కొన్నిటిని, సంపూర్ణటీకతో కొన్నిటిని, ప్రకటించియు ప్రకటించుచును ఉన్నాడను. కారణ విశేషములచే నడుగంటుచున్న మనభాషలకొఱకై యీ యుద్యమమని విన్నవించుచున్నాడను."
- వేదము వేంకటరాయశాస్త్రి.
ఈమాఱు శాస్త్రులవారు మునుపటివలెగాక పెక్కుగ్రంథములను ముద్రింపగల్గిరి. 1910 సం., అమరుకావ్య, పుష్పభాణవిలాస, రసమంజరులను తెనుగు సంపూర్ణటీక