బాల్యమున వారికడ తామేమియు పఠింపకపోయినను ఆకొఱతను తీర్చుకొనునట్లు తామేచదువుకొనిరి. తండ్రిగారి శ్లాఘనందిరి. శాస్త్రులవారి స్త్రీపునర్వివాహదు ర్వాదనిర్వాపణమును వారుకని శాస్త్రులవారి తమ్ములతో 'మీఅన్న చక్కగానే వ్రాశాడోయి' అని వారు చెప్పువఱకు శాస్త్రులవారికి తృప్తికలుగలేదు. అట్లే ప్రతాపరుద్రీయముంగని తండ్రిగారు హర్షించినందులకు శాస్త్రులవారు లోకముహర్షించినదానికన్న నెక్కుడుగా నానందించిరి. మనశాస్త్రులవారికిని వారితండ్రిగారికిని జరిగిన ఉత్తర ప్రత్యుత్తరములలో కొన్నిజాబులు సంస్కృతమునందే గలవు.
శాస్త్రులవారు ఈదెబ్బనుండి కొంచెకొంచెము తేరుకొనుచుండగా వారియాప్తమిత్రులు శేషగిరిశాస్త్రులవారు హఠాత్తుగా వారముదినముల జ్వరముచే తమ 52 యేట పరమపదించిరి. ఇది వేంకటరాయశాస్త్రులవారికి పిడుగుదెబ్బగా తగిలినది. అప్పుడు వారు 'సిద్ధసుథాప్రవాహము'ను ఉషానాటకమను స్వతంత్రనాటకమును రచించుచుండిరి. ముద్రితమైనవెంటనే దానిని శ్రీ శేషగిరిశాస్త్రులవారి కీర్తిమూర్తి కంకితము గావించిరి. శ్రీయుత శ్రీపాదకృష్ణమూర్తి శాస్త్రులవారును (నేడు మహామహోపాథ్యాయులు, కళాప్రపూర్ణులు) తమ గౌతమీ మాహాత్మ్యమును వా కంకితమొనర్చిరి.
శ్రీ పూండ్ల రామకృష్ణయ్యగారును ఎక్కుడుకాలము జీవించలేదు.