శాస్త్రులవారు చిత్తమని దానింగూర్చి యుపన్యసింపం దొరంకొనుచుండగా కార్యదర్శిగారు మేల్కొని, ఆవిషయమున కుద్దేశకుడు తాననియు, తనయుద్దేశనోపన్యాస మయినతర్వాత శాస్త్రులవా రుపన్యసింపవచ్చుననియు నుడివిరి. శాస్త్రులవారీవిఘ్నమునకు పరమానందభరితులై తత్క్షణమే గద్దియందిగి సామాజికులందు గూర్చుండిరి......అంత కృష్ణమాచార్యులవారు కృతివిమర్శనోపసంఘ నిర్మాణమునుగుఱించి యొక యరటావుకాగితము రెండు ప్రక్కలను తామువ్రాసికొని వచ్చినయుపన్యాసముమును అరగంటసేపు చదివిరి.
అంత అగ్రాసనాధిపతిగారు వేంకటరాయశాస్త్రులవారిని ఉపన్యసింపుమని కోరిరి. వేంకటరాయశాస్త్రులవారు మునుపటికంటె నధికముగా నభినందింపబడి 'పత్రికలలో విమర్శలు సరిగావనుట సరిగాదు. అముద్రిత గ్రంథచింతామణి శాస్త్రీయ విమర్శలకు బద్ధకంకణయై పండ్రెండు సంవత్సరముల నుండి కీర్తివడసియుండగా, అట్టి పత్రికను బహూకరింపక ధిక్కరించుట పండితసంఘమునకుదగునా .......కృతి విమర్శనోపసంఘము పనికిరాదు.' అని యీతీరున ఉపన్యసించిరి.
ఈ యుపన్యాసమధ్యంబున శాస్త్రులవారు గఘప్రాసమన్నప్పుడు, కృష్ణమాచార్యులవారు లేచి అగ్రాసనాధిపతిగారి చెవిలో 'పెర్సనాలిటి' అని యూదినారు. దానిని విని అగ్రాసనాధిపతిగారు శాస్త్రులవారికి హెచ్చరిక సేయుటకు లేచుచుండగా శాస్త్రులవారు వారిరువురింగని 'I know better' (నాకంతకన్న బాగుగాతెలియును) అని పల్కిరి. దాన నాప్రయోగము శాంతమాయెను.
శాస్త్రులవారి యుపన్యాసమున వాక్యములకును వాక్యాంతర్గత పదములకును సామాజికులహర్షోత్కర్ష సూచకకరతాళఘోషములచే వ్యవధానము కలుగుచుండినది. వారుపన్యసించిన కాలపరిమాణము 15 నిమిషము లుండును. వారి యుపన్యాసమునంగలిగిన సామాజికాది చిత్తావస్థను 'రాజహంస' యిట్లు వర్ణించినది. 'వేంకటరాయశాస్త్రిగారు.........పునాదిలేని సౌధమువలె