Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/824

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తిరువళ్ళువరు ఎల్లరకుఁ బ్రీతిపాత్రుఁడైనాఁడు. ఇతని తిరుక్కురళు 150 సంవత్సరములకుఁ బూర్వమే జర్మను, ఫ్రెంచి, యింగ్లీషు భాషలలోనికిఁ బరివర్తన మొందినది.

సామాన్యనీతుల విషయమునఁ దప్ప వేమనకు, తిరువళ్ళువరుకు సామ్యములు లేవు. వేమన దుర్నీతిని ఖండింపఁగా, తిరువళ్ళువరు నీతిస్వరూపమును దెలిపినాఁడు. ప్రపంచముపై విరక్తి, రక్తులే యిందుకుఁ గారణములు. "అతిథులకుఁ బెట్టి మిగిలిన దారగించు నరుని పొలమునందు విత్తులు నాటఁబడలేదు. ఇతరుల తప్పులను ఓర్చుకొనవలెను. మరచుట మఱియు మేలు, కని, విని, మూర్కొని, తాకి, తిని తెలిసికొనఁదగిన తీపులన్నియు స్త్రీ శరీరమందుఁ జేరి నిలచినవి" - ఇవి తిరువళ్ళువరు నీతిస్వరూపమును దెలుపు కొన్ని యుదాహరణములు.

వేమన మతమును, భావములను గలిగి, యోగసాధనమూలమున అద్వైతమున సాధించినవారు తెలుగువారిలోనే నేకులున్నారు. వారిలో పోతులూరు వీరబ్రహ్మ మొకఁడు. ఇతఁడు కంసాలి. జననము 17వ శతాబ్ది మధ్యభాగము. పోతులూరువాఁడు, కర్నూలు మండలమందలి బనగాలపల్లెలోని గరిమరెడ్డి వెంకటరెడ్డి యింట చిన్నతనమున పసుల కాపరిగ నున్నాఁడు. చచ్చినవారిని బ్రతికించుట, జాతరలలో నందఱి యెదుట చండికావిగ్రహముచే నాజ్ఞాపించి చుట్ట కాల్చుకొనుటకు నిప్పు తెప్పించుకొనుట మొదలైన యద్భుతకార్యము లొనర్చినాఁడు. విగ్రహారాధన, జాతిభేదములు, జాతరలు మొదలగువానిని ఖండించి జనులకు బోధచేసినాఁడు. ఇతఁడు సంసారి, సన్యాసి కాఁడు. భార్య గోవిందమ్మ. అయిదుగురు కొడుకులు, ఒక కుమార్తె. ఇతని శిష్యులలో ప్రసిద్ధుఁడు సిద్ధయ్య. సిద్ధయ్య చిన్నతనముననే తల్లిదండ్రులను, తన మతమును విడిచి తన్నాశ్రయింపఁగా, వీరబ్రహ్మము శిష్యునిగా స్వీకరించి జ్ఞానోపదేశ మొనర్చినాఁడు. ఇతడు సిద్ధాయను మకుటముతో శిష్యునకై 'సిద్ధబోధము' అను గ్రంథమును వ్రాసినాఁడు. "నీవును నేనును తానును భావింపఁగా నొక్కఁడనుచు బరఁగెడుఁ గాదె" ఇత్యాదులు అందులోనివి. వేమనవలె వీరబ్రహ్మము సర్వసమత్వముగల అద్వైతమును బోధించు పద్యములను, పాటలను ఎన్నింటినో వ్రాసినట్లు తెలియుచున్నది. “సంసారైనా వొకటే, సంసారము విడిచిన నొకటే, హంస నటించే విధమెఱిగింటే, సంశయములు తనమది విడిచుంటే” "చిల్లర రాళ్ళకు మ్రొక్కుచునుంటే చిత్తము చెడునుర వొరే వొరే” వంటి రచనలు చూడఁగా, వీరబ్రహ్మము రచనల యందు వేమన్నలోఁగల వేగము, అచ్చుకట్టు ఉన్నట్లు తోచదు. హఠయోగసిద్ధి


824

వావిలాల సోమయాజులు సాహిత్యం-4