బ్రాహ్మణశ్రేష్ఠులను జంపినాఁడు. ఇట్టి కర్మలొనర్చు క్రూరులు స్నేహమొనర్చినాఁడు. ఇంకను నితరము లైన పాపముల నెన్నింటినో యొనర్చినాఁడు. వీనిని చుట్టుముట్టికట్టి వేయుఁ" డని యమదూతలు బాధింపఁగా, నిగమశర్మ భయమొందినాఁడు. దిక్కులు ప్రతిధ్వనించునట్లుగా మొఱఁపెట్టినాఁడు.
యమభటు లీ రీతిగా గోపమున నాక్రమించుకొను తొందరపాటుతో నుండఁగా, విష్ణువు పూర్వ మా నృసింహక్షేత్రమున కాఁపుగా నుంచిన సుదర్శనాయుధము పరాక్రమించి, వేయి సూర్యులవలె తీక్షమైనదై యమభటుల నావలకుఁ బాఱఁద్రోలి వారు నిగమశర్మకుఁ గట్టిన బంధనములను దెగదెంచెను. యమభటులు కొందఱు భీతినొందిరి. కొందఱు పాఱిపోయిరి. అంతట విష్ణుదూతల సమూహము సుదర్శనము, నందకము, పాంచజన్యములను నాయుధములతోను, శంఖములతోను నప్పుడచ్చటికి వచ్చిరి.
ఆ విష్ణుదూతలు యమలోకమునకుఁ బోవుటనుండి మరలించి, విష్ణుని గరుడ వాహనముపై నెక్కించి నిగమశర్మను శ్వేతద్వీపము (వైకుంఠము) వంకకు మరలించిరి. వేయి సూర్యకాంతులు గల విమానమెక్కి తేజస్సుచే మన్మథునకుఁ దండ్రియైన విష్ణువు వలె వైకుంఠమునకుఁ బోవుదారిలో, నాతని శరీరమునఁ బుట్టిన చెమటను గరుత్మంతుని లెక్కల నుండి పుట్టిన గాలి తొలగించుచున్నది. ఆదిశేషుడు పడగనుముత్యాల గొడుగుగాఁ బట్టి యతనికి నెండ తగులకుండు నల్గొనర్చుచున్నాఁడు. విష్వక్సేనుఁడు చేతి బెత్తముతో నెడమును గల్పింపగా నిలిచిన దేవతలను నిగమశర్మ కడకంటి చూపులతోఁ జూచినాఁడు. ప్రక్క భాగములందు భృగువు, భరద్వాజుఁడు మొదలైన మహర్షులు స్వస్తివచనములు పలుకఁగా, నా ప్రదేశములు ప్రతిధ్వనించినవి. ఈ రీతిగా నిగమశర్మ భగవత్సారూప్యమును బొందినాఁడు. నిగమశర్మ బాహువులు పచ్చలు తాపిన స్తంభముల వలెను, అతఁడు ధరించిన బంగరు పూలమాలలు మెఱపుల రీతిని, విశాలనేత్రములు తెల్లదామర పూరేకుల వలెను, ముఖము లేఁత సూర్యుని బింబము వలెను ఉన్నవి. నిగమశర్మ విష్ణుసాయుజ్యము నొంది శ్రీమహావిష్ణువునకు పార్శ్వచరులైన పుండరీక శంఖకర్ణాదులలో నొకఁడై, కుముదుఁడను పేరుతో విశేషగౌరవము నొందినాఁడు.
794
వావిలాల సోమయాజులు సాహిత్యం-4