నాతనికి, సుదక్షిణాపరిణయకర్తయైన తెనాలి అన్నయ సోదరుఁడు. "సారస్వతములో తెనాలి రామకృష్ణుని పేరు అందఱకును దెలియును. ఆ తెలియుటకు కారణము ఆతని కవితాశక్తి కాదు. అతని గుఱించి ప్రచారములో నున్న యనేక హాస్యకథలు. దానికి కారణము అందులో నేవి రామకృష్ణునిచే చేయఁబడినవో, యేవి కల్పింపఁబడినవో విడదీసి చెప్పుటకు వీలు లేదు. కాని యొక్కటి మాత్రము నిజము. అతఁడు అమిత వాక్చమత్కృతి గలవాఁడు. ఈ చమత్కృతి యాతని కావ్యములం దెచ్చటను గానరాదు" (శ్రీ విశ్వనాథ).
తెనాలి రామకృష్ణకవి "ఘటికాచల మాహాత్మ్యము, ఉద్భటారాధ్య చరిత్రము, పాండురంగ మాహాత్మ్యము" అను కావ్యములను జెప్పినాఁడు. ఉద్భటారాధ్య చరిత్రకర్త రామలింగకవి యనియు, పాండురంగ మాహాత్మ్యకర్త రామకృష్ణకవి యనియు నున్నవి. ఇద్దరి పేరులు లింగ, కృష్ణ భేదములు కలిగి యుండుట, శైవ వైష్ణవ భేదములు కలిగియుండుట, ఉద్భటారాధ్యకర్త గురువు "పాలగుమ్మి భీమన" (దైవగురువు) అగుట వలన, పాండురంగ కృతికర్త గురువు "భట్టరు చిక్కాచార్యులు” (వైష్ణవగురువు) అగుటవలన, నీ రెండు కావ్యములను రచించిన కవులు భిన్నులను భావము కలుగుచున్నది. అదియును గాక రామకృష్ణకవి సోదరుఁడైన అన్నయ తన సుదక్షిణా పరిణయమున అన్న మతాంతరమును స్వీకరించినాఁడని యేమియు పేర్కొనక పోవుటయును గన్పట్టుచున్నది. కాని తరువాతి కాలమందలి తెనాలి కవులలో ప్రసిద్ధుఁడైన రామభద్ర కవి (ఇందుమతీపరిణయ కర్త) పాండురంగమాహాత్మ్య కృతికర్తయైన రామకృష్ణుని తన పెదతాతగను, సుదక్షిణాపరిణయకర్తయైన అన్నయను చినతాతగను జెప్పినాఁడు. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రివంటి పరిశోధకవిద్వాంసులు రామలింగ, రామకృష్ణ కవుల కులగోత్రాదులను, ఉభయులు రచించిన కావ్యములలోని భావము లందలి సామ్యములను, సమకాలీనతను పురస్కరించుకొని, యిరువురు నొక వ్యక్తియేయని నిర్ణయించియున్నారు. దీనినిబట్టి శైవుఁడుగా నున్న కాలమున రామలింగకవి శైవగురు పీఠమైన ఉద్భటారాధ్యుని చరిత్రమును జెప్పినాఁడనియు, వైష్ణవుడైన పిమ్మట రామకృష్ణుఁడై పాండురంగ మాహాత్మ్యమును జెప్పినాఁడనియు నర్థమగుచున్నది.
రామకృష్ణకవి - కాలము
రామకృష్ణకవి (రామలింగ కవి) ఉద్భటారాధ్య చరిత్రమును, కొండవీటి దుర్గాధ్యక్షుఁడైన నాదెండ్ల గోపమంత్రి కడముఖ్యోద్యోగిగా నున్న దేచమంత్రి
766
వావిలాల సోమయాజులు సాహిత్యం-4