పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రాఁగలిగితివి?' మొదలగు నర్థములు గల సూక్తము లథర్వ వేదమున నకాలమునందు విచ్చేసిన నిద్రాదేవి నుద్దేశించి కన్పించుచున్నవి. ఆ శ్రుతి యందే నిద్ర దేవపత్నుల గర్భాండమనియును, గలలు దేవతలనియును చెప్పఁ బడియున్నది.

నిద్రాతత్త్వమును గూర్చి ప్రవచింపవలసినదని గార్గ్య సౌరాయణి, మహర్షి పిప్పలాదు నీ భరతభువియం దెన్ని సహస్ర వర్షములకుఁ బూర్వమో యిట్లర్థించినాఁడు.

"భగవంతుఁడా! పురుషుని యందు నిద్రవోవునవి యెయ్యవి? మేల్కొనున నెయ్యవి? ఇందు స్వప్నావస్థను బొందు దేవత (ఇంద్రియము) యెవ్వఁడు? నిద్రా సుఖమెవ్వరిది? దేనిపై నియ్యవి సంప్రతిష్ఠితములైయున్నవి?”

ఈ ప్రశ్న పరంపరకుఁ బిప్పలాద మహర్షి యొసఁగిన సమాధానమునందు భారతీయ నిద్రావిజ్ఞానము నిరూపితమై యున్నది.

113[1]"సంధ్యాసమయ సూర్యుని కిరణము లే రీతి యతని తేజోమండలమును జేరుకొనుచున్నవో యటులనే సర్వేంద్రియములును నిద్రాసమయమున మనస్సుతో నేకీభవించుచున్నవి. అందువలన నింద్రియ వ్యాపారముండదు. ఈ కారణముననే పురుషుఁడు నిద్రించుచున్నాఁడని చెప్పెదరు. ఆ మనస్సు తేజసాభిభూతమైనపుడు సుఖానుభూతి నొందును.”

“యయేష సుప్తేషు జాగ్రత కామమ్ కామమ్ పురుషో నిర్మిమానః దదేవ శుక్రమ్ దద్బ్రహ్మ” ఈ కఠోపనిషద్వాక్యము వలన 'నిద్రితుని యందు మేల్కొనునది బ్రహ్మ' యని భారతీయ తాత్త్వికుల నిశ్చయమైనట్లు వ్యక్తమగుచున్నది.

సృష్టికి నిద్ర యత్యవసరము. జగత్కారణుఁడగు విష్ణువు నిద్రాముద్రితుఁడై శరదారంభమున మేల్కొని పునఃసృష్టి నారంభించును. ఆ మహామహుని జాగ్రదవస్థారంభ వేళాసౌందర్యముఁగనిన మహాకవి యాంధ్ర నిద్రాసాహిత్యమున నిరుపమాన రత్నమగు నీ పద్యములో దానినిట్లు వర్ణించినాఁడు.

సీ. 114[2]"అభినవో న్మేషచిహ్నంబైన తొలిచూపు
          కౌస్తుభాలోక రేఖలకు నలగఁ
    సాంగభంగంబైన యావులింతకు వేల్పు
          లంగుళీస్ఫోటంబు నాచరింప
    సౌఖశాయనికులై సంవర్తభృగ్వాది
          మునులు హస్తాంభోజములు మొగుడ్ప

  1. 113.సంధ్యా సమయ సూర్యు "యాథాగార్గ్య - మరీచయో౽ర్క న్యాస్తం - ఇత్యాది” ప్రశ్నోపనిషద్వాక్యములు మూలము
  2. 114. అభినవోన్మేష చిహ్నంబైన - కాశీఖండము ఆ. 3, ప. 22

____________________________________________________________________________________________________

68

వావిలాల సోమయాజులు సాహిత్యం-4