Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/629

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గద్యములందు ఉపయోగించినాఁడు. కావున మనము స్వారోచిషమనుసంభవ మనునదియే దీని నామమనియును, మిగిలినవి వ్యవహారనామములుగా వచ్చినవనియును నూహింపవలసి యున్నది.

ఆంధ్రసాహిత్యమున క్రీ.శ. 1500 మొదలు 1600 వఱకును గల నూరు సంవత్సరముల కాలమొక ప్రత్యేక ఘట్టము. సాహిత్యచరిత్రకారులు దీనినొక ప్రత్యేక యుగముగ భావించి దీనికి 'కృష్ణరాయయుగ' మని నామకరణమొనర్చిరి. ఇంతకుఁ బూర్వయుగములందు కవులు విశేషముగా సంస్కృతమునుండి పురాణాది గ్రంథములనో, లేక గ్రంథభాగములనో స్వతంత్రించిగాని, మూలానుగుణముగాఁ గాని అనువదించినారే గాని స్వతంత్ర రచన లొనర్పలేదు. ఈ కృష్ణరాయయుగమున 'నూత్నతేజముతో వెలుగొందు సామ్రాజ్య వైభవముతో పాటు నవనవోన్మేషమైన స్వతంత్ర సారస్వత వైభవము' గూడ వెల్లివిరిసినది. అదియే మన ప్రథమ నవ్యకవిత్వోద్యమము.

ఆంధ్రులు తమ ప్రత్యేక సారస్వతసిద్ధిగాఁ గొనియాడుకొనఁదగిన ప్రబంధ ప్రక్రియ నూతనముగా నావిర్భవించుటయే ఆ యుద్యమమునకుఁ బ్రథమ లక్షణము. ఆంధ్ర సరస్వతీవిహారమున కనువైన సుందరోద్యానవనము ప్రబంధము. కృష్ణరాయల మనోరథానుసారముగ ఆ యుద్యాన నిర్మాణభారమును మొదట వహించిన మహాపురుషుఁడు అల్లసాని పెద్దన. ఆ యుద్యానమున తొలుతగా పుష్పించి ఫలించిన రసాలము (మామిడిచెట్టు) మనుచరిత్రము.

పెద్దనాదులైన మహాకవులు కడు శక్తిసంపన్నులు. అయినను పరిపూర్ణముగా స్వతంత్రించి క్రొత్త కథలను గల్పించుటకు వారు సాహసింపలేకపోయిరి. ఇందుకుఁ గాలప్రభావము (Time-spirit) ముఖ్య కారణము. వసుచరిత్రకారుడు కృతిపతి తన్నుఁ గోరినట్లుగాఁ జెప్పిన -

ఉ. కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నము లాద్యసత్కథల్
వావిరిబుట్టు రత్నము లవారిత సత్కవికల్పనావిశే
షావహపూర్వవృత్తములు సానలఁదీరిన జాతిరత్నముల్
గావున నిట్టి మిశ్రకథగా నొనరింపుము నేర్పు పెంపునన్.

అన్న పద్యమువలన నా కాలపుఁ గవులకు మిశ్రమకథయం దభిమానము విశేషమగుట స్పష్టమగుచున్నది. పురాణయుగమునకుఁ బిమ్మట శ్రీనాథ మహాకవి సంస్కృత గ్రంథములను కావ్యమార్గమును ననువదించుటకు ద్రోవ చూపినాఁడు.


సాహిత్య విమర్శ

629