ఆంధ్రభారత రచనోద్దేశ్యము
రాజరాజనరేంద్రునిచే భారతము మత ప్రచారార్ధము పుట్టింపబడినదనియు, సారస్వత పోషణార్ధము పుట్టింపబడినదనియు వాదించే ఇరువాగుల వారికిని భిన్నమగు, 'భారత రచనము వంశచరిత్ర రచన' ముగానుద్దేశింపబడినదను నా యభిప్రాయము వెగటుగ తోపక మానదు. కాని నా వ్యాసోద్దేశమును చదువరులు సహృదయముతో గమనింతురుగాక యని ప్రార్థించుచున్నాను.
శ్రీయుత గొడవర్తి సూర్యనారాయణమూర్తిగారు 'వీణ' నవంబరు - డిశంబరు సంచికలలో భారత రచనము మతప్రచారార్థము జరిగినది కాదని నిరూపించి, వాఙ్మయ పోషణార్ధ ముద్దేశింపబడినదని తేల్చియున్నారు. మతప్రచారార్ధము కాదన్నమాట సత్యము. అందులకు వారా కాలమునాటి మతపరిస్థితులు విపులముగా చర్చించి, భారతరచనము వలన జరుగవలసిన మతప్రచారమేమియు లేదని చూపియున్నారు. భారతరచనము 'వాఙ్మయపోషణార్ధమే' జరిగినదని వారు తీర్మానించిన వాదమును అంత సహేతుకముగ కన్పట్టదు.
రాజరాజు లోకమునం దాదికావ్యమగు రామాయణ మాంధ్రీకరింపజేయక, భారత మాంధ్రీకరింప జేయుటలో నీతని యుద్దేశ్యము సారస్వత పోషణము గాక అన్యమని స్పష్టమగుచున్నది. అదియే తన వంశచరిత్ర రచనోద్దేశ్యము. రాజరాజు విద్యావిలాస గోష్ఠిలో నుండి నన్నయ భట్టారకుని చూచి తాననేక కావ్యములను, ఈశ్వరాగమములను పరికించితిననియు, కాని 'అనవరతంబును శ్రీమహాభారతంబువిన నభిలాష పెద్దయైయుండు' ననియు చెప్పియున్నాడు. అట్టి అభిలాషకు కారణముగా భారతము తన వంశచరిత్రయని తలపోయుచు రాజరాజు :
చ.
"హిమకరు దొట్టిపూరు భరతేశ కురుప్రభు పాండు భూపతుల్
క్రమమున వంశకర్తలనఁగా మహినొప్పిన యస్మదీయ వం
శమునఁ బ్రసిద్ధులై విమల సద్గుణ శోభితులైన పాండవో
త్తముల చరిత్ర నాకు సతతంబు వినంగ నభీష్టమెంతయున్.”
సాహిత్య విమర్శ
605