దీనికీ చాల భేదమున్నది. విశాలమైన గదిలో కూర్చుని భావవిహారం చేసే దీక్షితులు దగ్గరికి వృద్ధ బ్రాహ్మణులు, యువబ్రాహ్మణులు, వితంతువులు రావటానికి వీలులేదని భ్రమపడవచ్చు. వీరు నిజమైన వ్యక్తులు కారు. అప్పయ దీక్షితుల అంతరంగ కల్లోలం, గ్రామంలో జనశ్రుతి కలిసి కథావ్యక్తులుగా పరిణమించినవి. అందుకనే రంగంమీద కనపడకుండా తెరవెనకాల అదృశ్యంగా ఉండవలసి వచ్చింది. ఇందువల్ల పాత్ర బాహుళ్యం లేకుండా పని జరిగిపోయింది. అప్పయ దీక్షితుల మానసికమథనంలోని వివిధ దశలకు ఈ స్వరమేళలు దర్పణాలు. వీటివల్ల కవి కల్పనాచాతురీ, మానసిక తత్త్వ పరిజ్ఞానమూ (Study of Psychology) ప్రస్ఫుటమౌతవి.
తే. "అర్భకునిభంగి లేదు నా అంతరంగ
మోలలాడగ నానంద డోలలోన
తుంగభంగాలపై నూగు దోనెవోలె
నున్నదని పల్కినను విశేషోక్తి కాదు.”
అంత మనోవేదనతో అప్పయదీక్షితులు మంగళ వివాహ విషయం ఇదమిత్థమని తేల్చలేక నటరాజ విగ్రహానికి చేతులు జోడించి
"శాస్త్రమటు పల్కు, మరి వృద్ధ సంప్రదాయ మిట్లు కాదను నటరాజ, ఏమి చేతు?"
అని కళ్లు మూసుకొని ధ్యానముద్రలో ఉంటాడు. వృద్ధ బ్రాహ్మణ సర్వమేళ అప్పుడు ప్రారంభమౌతుంది.
శంభో శంకర
శాంతం పాపమ్
విప్ర వితంతూ
వివాహ కార్యమె
శాస్త్రం బేటికి
సదాచారమే
546
వావిలాల సోమయాజులు సాహిత్యం-4