Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/538

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చెలియ పాదాలు జ్ఞప్తికి వచ్చినవి. కుసుమ శబలిత కాంతులతో ఉన్న ఆరామ మార్గము రత్న కంబళాన్ని జ్ఞప్తికి తెచ్చింది. ఆ నవవీథిలో అప్పుడప్పుడూ తిరిగి పండబారి పగిలిన దానిమ్మగింజలు చూడటం వల్ల అటువంటి అక్షరాలే వ్రాయటానికి అలవాటు పడ్డాడు. మందమారుతము, మనోనాయిక మనోహర భావాలకు మద్దత్తు ఇచ్చినవి. అప్పుడు

“చెంగల్వలంబోలు చిన్నిపాదాల
ననుగు నెచ్చెలి మెట్టునట్టి మార్గంబు
పులకితం బయి వన్నె పూవులు పూయ
రత్న కంబళమట్లు రంజిల్లు మిగుల"

అని వరస పెట్టి ముచ్చటగా మూడు పద్యాలు వ్రాసేటప్పటికి

'అంచనడకల నరుదెంచె నతనిసఖియ'

వితర్దికమీద విశ్రాంతిగా కూర్చోవటము. వెన్నెల రాత్రి. తాంబూల చర్వణము. రెండో రంగం ప్రారంభిస్తుంది. మరదలి మధురవాక్కులు, మంగళాంబపాట అప్పయదీక్షితులను నిష్టాలోకంలోనుంచి ఒక్కమారుగా నిజలోకంలో పడవేసి, పుత్రీ పునర్వివాహానికి బుద్ధి కలిగిస్తవి.

శివాజ్ఞ లేనిదే ఆయన చిన్న మెత్తుపని చెయ్యడు. మర్నాటి పగలల్లా బ్రాహ్మణ బృందము ఏమనుకుంటున్నారో తెలుసుకొని వివాహము చెయ్యటమా చెయ్యకపోవటమా అనే తుల్యబల విరోధాలలో తొక్కిసలాడుతూ, చింతాసాగరనిమగ్నుడై శివాజ్ఞ కోసం మర్నాటి రాత్రి విశాలమైన గదిలో - దీపము వెలుగుతుంటుంది పార్శ్వపీఠం మీద నటరాజ విగ్రహానికి ఎదురుగా కూర్చొని ఉంటాడు.

మూడోరంగం ప్రారంభంలో, ఇక్కడ ప్రతి విషయం గమనించవలసిందే. విశాలమైనగది విమల భావనాప్రపంచంలోకి తీసుకోపొయ్యే రాచబాట. కృష్ణాజినం గృహ పారిశుద్ధ్యతకు ప్రబలసాక్ష్యం. ఇలువేలుపు నటరాజస్వామి విగ్రహానికి ఎదురుగా కూర్చోటం ఫాలాక్షుని పల్కుకోసం. శివాజ్ఞ కాలేదు. చిన్నతల్లి పెళ్ళి చెయ్యలేదు.

కథానుగుణమైన కమనీయవాతావరణం కల్పించకపోతే, కవి కళాభిజ్ఞుడు కాడన్నమాట. కవులు పాత్రల నామకరణం దగ్గరనుంచీ పాటుపడి నానారకాలుగా ఈ వాతావరణాన్ని సృష్టిస్తారు.


538

వావిలాల సోమయాజులు సాహిత్యం-4