Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/527

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

(accent) కనిపిస్తుంది, విన్నపం చేశారు; శాయంగల మొదలైన పదాలలో, ప్రథమ మీద గ, స, డ, ద వాదేశం విరివిగా కనిపిస్తుంది. దీర్ఘాల మీద నిండుసున్న ప్రయోగించేవాళ్ళే - వాండు, మూంకుడు, పేండ, శబ్దాలలో. ఆ శబ్దాలు వ్రాసేటప్పుడు తరువాతి హల్లు మూకుండ్డు, పేండ్డ, వాండ్డు, మాదిరిగా ద్విత్వంచేసేవాళ్ళు. 'ఉ'కార 'ఒ'కారాలకు 'వ' కారం విరివిగా వాడేవాళ్ళు. చేస్తే, వస్తే మొదలైన ప్రయోగాలు విరివిగా వున్నాయి. స, శలకు, 'రు' 'ఋ'లకు భేదం లేదు. ఉచ్చారణానుసారంగా వ్రాసేవారు. బ్రహ్మపదాన్ని 'బ్రంహ్మ' అని ప్రయోగించేవాళ్ళు.

ఈ 17, 18 శతాబ్దులలో యక్షగాన నాటక వాఙ్మయం ఎంతో అభివృద్ధి పొందింది. ఆ నాటకాలలో వచనం ప్రయోగించేవాళ్ళు. ఆ వచనం కూడా వ్యావహారిక భాషలోనే వుంటుంది. చూడండి రెండుదాహరణాలు :

"అయ్యా! యీ సభలో యుండు రాజాధిరాజులారా! ఈ శకుని పురుష వేశ్యలవలె మంత్ర తంత్ర ఇంద్రజాలముచేసే తంటవరుని కండలు తుండెలు తుండెలుగా కోసి కాకులకు గెద్దెలకు వెయ్యకపోతే నేను సహదేవుడనుగాను”

మహాభారత విలాస నాటకము

“రాజ రాజనరేంద్రుని సుతుండైన సారంగధరు డెటువంటివాడో చూడవలెనని నిండా ఆపేక్ష గలిగి వుంటివి గనక నేటిదినం చెలికాండ్లతో కూడా రాజవీధిని ఆటలాడుతూ వున్నాడు చూతువు మేడమీదికి రావమ్మా చిత్రాంగిదేవి... కానరాని మేడిపుష్పము లయినా వెదికి కానవచ్చును. తెల్లటి కాకినైనా వెదికి కానవచ్చును. నీళ్ళలో వుండే చాపల అడుగులనైనా వెదకి కానవచ్చును. స్త్రీల హృదయం కనగూడ దనునీతి కలదు. కాన నీవు రాజులేని సమయమున మీ పినతల్లియైన చిత్రాంగి నగరికి పోకూడదోయి సారంగధరా”

సిద్ధకవి సారంగధర నాటకము

19వ శతాబ్ది ప్రథమ భాగంలో వచనరచన అంతా వ్యావహారిక భాషలోనే జరిగింది. కథావాఙ్మయమూ, శాస్త్రగ్రంథాలు, టీకా గ్రంథాలు కూడా ఈ భాషలోనే ఉన్నవి. సాంద్రీసు దొర ఈ శతాబ్ద ప్రథమ భాగంలో పైడిపాటి పాపయ్య కవికి ప్రోత్సాహం ఇచ్చి ద్విపద రామాయణాన్ని వచనకావ్యంగా వ్రాయించినాడు. ఈ కవి రచనావిధానానికి ఒక ఉదాహృతి :


సాహిత్య విమర్శ

527