పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.[1] "అది కాదే చెలి! నీవు కేరళమహా హార్యంబుపై నున్న యా
    మదిరోన్మత్త పుళిందనాయకులతో మాటాడి చంపింపవే
    కదనుల్ ద్రొక్కుచు వాని వాహనములై కాల్ద్రువ్వు నేణీమదో
    న్మదసంఘంబులఁ జూత మింక నెటు దు ర్మార్గుండు రానేర్చునో!”

యని యూహించినది. పిమ్మటఁ బర్యాలోచనమున 'నీయవి వెఱ్ఱియూహలు కదే! శబరపల్లవుల న్స్మరకేళిలోలురం జేయుచు నీగంధవహుఁడు చెల్వుఁడై మెలఁగుఁ గదా! అట్టివానికి వారెట్లపకార మొనర్పఁగల' రని దైన్యము వహించినది.

విరహిణీలోక మేమనుకొన్న నేమి? అతని నేమన్న నేమి? వారు సన్మార్గుఁ డనినను దుర్మార్గుఁ డనినను మలయానిలుఁడు మనసునఁ బెట్టుకొనుట లేదు. చైత్రభూమీకళత్రచామర చాలనము వలనను, బటుఘర్మజలకణ పశ్యతోహరవృత్తి వలనను వారికి వలపు మెలపుల బ్రసాదించుచునే యున్నాఁడు.

'కామీ స్వతాం పశ్యతి'. తాము దుష్టులు. మలయానిలుని మంచి యెఱుఁగక విరహు లతనిపై నెన్ని నీలాపనిందలుఁ గల్పించినారు! అతని పరోపకారపరత నణుమాత్రమైన వారంగీకరింప నిచ్చగించుట లేదు.

గంధవహుని ప్రత్యుపకారబుద్ధినిఁ గూర్చి శుభ్రజ్యోత్స్నికలలో నెచ్చెలులఁ గూడి శుక్తిమతీనదీతీరమున 'గూఢమణు' లను దాఁగిలిమూఁతల నాడు గిరిక చెప్పఁగలదు. ఆమె దాఁగు కొనినవేళ శరీరపరిమళమును గ్రహించినవాఁ డగుటచేఁ ప్రతిక్రియగఁ గన్నులఁ గపురంపు దుమారమును జల్లి చెలికత్తియల కన్నులకుఁ గనఁబడకుండున ట్లితఁడు మేలొనర్చినాఁడు. దూతకృత్యమునఁ బ్రథమగణ్యుఁ డనిపించుకొనిన వాయునందనుని లక్షణములు గల మలయానిలు నొకమాఱు దర్శించి భట్టుమూర్తి యతని పరోపకారపారీణతను :


చ. [2]"అనిలకుమారకుండు మరుదధ్వనిరోధి పలాశిమండలీ
     ఘనవనరాశిలోఁ బుడమి కానుపు పద్మిని చిక్కి స్రుక్కఁగా
     నినకరముద్రఁ జూపి వెలయించి తదంబుజ రాగపాళిఁ గై
     కొనుచుఁ బ్రవాళతేజమునఁ గూరిచెఁ గంటె పలాశవీథులన్.”

అని యుగ్గడించినాఁడు. అనాఘ్రాతపుష్పమగు గిరికా శరీర పరిమళముల గ్రహించుట గౌరవసూచకమే కాని యన్యము కాదు. లేకున్న స్త్రైణపరీమళముల ముల్లోకపాంథుఁడై

యతఁ డెన్ని మారు లనుభవింపలేదు! అంతియకా దనేక పర్యాయములతఁడు :
  1. అదికాదే చెలి - మదీయము
  2. అనిలకుమారకుండు - వసుచరిత్ర ఆ. 3, ప. 139

____________________________________________________________________________________________________

మణిప్రవాళము

45